ETV Bharat / international

కొరియా నేతలకు 'అదృశ్యం' కొత్తేం కాదు!

author img

By

Published : May 1, 2020, 6:29 PM IST

Updated : May 1, 2020, 9:43 PM IST

ఉత్తర కొరియా దేశాధినేత ఆరోగ్యం క్షీణించిందని ఇటీవల వార్తలు వెలువడుతున్నాయి. దాదాపు 2 వారాలుగా ఆయన కనిపించకపోవడమే ఇందుకు కారణం. ఫలితంగా కిమ్​ తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారని ఊహాగానాలు, వదంతులు కోకొల్లలుగా విస్తరిస్తున్నాయి. అయితే.. ఉత్తరకొరియా నేతలు ప్రజలకు బయటకు కనిపించకుండా ఉండటం ఇది కొత్తేం కాదు. గత చరిత్రే ఇందుకు సాక్ష్యం. దశాబ్దాలుగా ఆ దేశంలో ఈ తరహా అదృశ్య ఘటనలు ఏమేం జరిగాయో ఓసారి చూడండి..

A look at past disappearances of NKorean leaders, officials
ఆ కొరియా నేతలకు 'అదృశ్యం' కొత్తేం కాదు!

కిమ్ జోంగ్ ఉన్.. ఈ పేరే ఒక సంచలనం. ఆయన ఏం చేసినా, ఏం మాట్లాడినా చర్చనీయాంశమే. 2011లో ఆయన ఉత్తర కొరియా పాలకుడు కావడమూ ఓ సంచలనమే. చాలా తక్కువ రాజకీయ, సైనిక అనుభవంతో ఆయన పీఠం అధిరోహించారు. మరిప్పుడు.. ప్రపంచంలోనే శక్తిమంతమైన నేతల్లో ఒకరిగా ఉన్నారు.

అంతటి దేశాధినేత గత 2 వారాలుగా కనిపించకపోవడం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. అందుకే.. కిమ్​ ఆరోగ్యంపై ఊహాగానాలు జోరందుకున్నాయి. వదంతులు విస్తృతంగా వ్యాపించాయి. ఆయనేమైపోయారన్నదే అందరి ప్రశ్న.

గుండెకు శస్త్రచికిత్స అనంతరం.. ఆయన అచేతన స్థితిలోకి వెళ్లారని కొందరు, తీవ్ర అనారోగ్యం బారినపడ్డారని మరికొందరు, ఆరోగ్యంగానే ఉన్నారంటూ ఇంకొందరు అంటూనే ఉన్నారు. అయితే.. ఇవన్నీ జరగొచ్చు.. జరగకపోవచ్చు..! కారణం.. కిమ్​ జోంగ్​ ఉన్​ గతంలో అదృశ్యమైన దాఖలాలు చాలానే ఉన్నాయి.

ఒక్క కిమ్​ మాత్రమే కాదు.. ఆయన తండ్రి, తాత ఇంకా ఉత్తర కొరియా పాలకవర్గంలోని ఎందరో నాయకులు అదృశ్యమై.. ఆపై ప్రత్యక్షమైన సందర్భాలెన్నో...!

మరణించడం, అస్వస్థతకు గురికావడం లేదా ఇతర రహస్య ఆపరేషన్​లలో భాగంగా కొన్ని సార్లు కనిపించకుండాపోయారనేది వాస్తవమే. కానీ... ఇప్పుడు కిమ్ అదృశ్యం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. అణ్వాయుధ దేశం లోపల ఏం జరుగుతుందోనన్న ఆలోచన... ప్రపంచదేశాలను కలవరపెడుతోంది.

కిమ్​ ఇల్​ సంగ్​ తో మొదలు...

kim il sung
కిమ్​ ఇల్​ సంగ్​

తన ఆధిపత్యంతో దక్షిణ కొరియా ప్రజల్లో ద్వేషం, ఉత్తర కొరియా జనాల్లో భయం నింపుకున్న నేత.. కిమ్ ఇల్​​ సంగ్​. ఈయనే ఉత్తర కొరియా దేశ నిర్మాత, వ్యవస్థాపకుడు. ప్రస్తుత దేశాధినేత కిమ్​ జోంగ్​ ఉన్​కు స్వయానా తాత.

కిమ్​ ఇల్​ సంగ్​.. 1950లో దక్షిణ కొరియాపై చేయించిన దాడి యుద్ధానికి దారితీయగా అమెరికా, చైనా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత 1968లో తన కమాండోలను పంపి దక్షిణ కొరియా అధ్యక్షుడిని హత్య చేయించడానికి విఫలయత్నం చేశారు. కేబినెట్​ మంత్రులపైనా బాంబుదాడి చేయించి.. ఎందరినో పొట్టనబెట్టుకున్నారు.

మొత్తం వార్తల్లోనే కానీ...

ఇలా కరుడుగట్టిన ఎన్నో విధ్వంసక చర్యలకు పాల్పడిన కిమ్ ఇల్​ సంగ్​.. 'అదృశ్యం' వార్తలతోనూ ప్రసిద్ధికెక్కారు. కొరియా దేశాలను గడగడలాడించిన ఆయన.. 1986 నవంబర్​లో చనిపోయారని దక్షిణ కొరియా వార్తాపత్రికలు తొలిసారి నివేదించాయి. ఆ వార్తతో కొద్ది గంటలపాటు సంబరపడిన జనం.. సరిహద్దు వెంబడి ఉద్రిక్తతలను తలచుకొని మిన్నకుండిపోయారు.

దక్షిణ కొరియాలోని ప్రముఖ వార్తాపత్రిక చోసున్​ ఇబో నవంబర్​ 16న.. కిమ్ ఇల్​​ సంగ్ మరణంపై ఓ చిన్న కథనం ప్రచురించింది. నవంబర్​ 18న 'కిమ్​ ఇల్​ సంగ్​ కాల్చివేత' అని మొదటిపేజీ హెడ్​లైన్​తో 7 పేజీల్లో మరోసారి వివరించిందీ పత్రిక.

అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి..

మిగతా పత్రికలూ చోసున్​నే అనుసరించి తప్పులో కాలేశాయి. కారణం.. కొద్ది గంటల్లోనే కిమ్ ఇల్​​ సంగ్ సజీవంగా​ ప్రత్యక్షం అయ్యారు మరి. మంగోలియా ప్రతినిధి బృందాన్ని ఆహ్వానిస్తూ ప్యాంగ్​యాంగ్​ విమానాశ్రయంలో మీడియా కంటబడ్డారు.

దక్షిణ కొరియాలోనే సర్క్యులేషన్​ పరంగా అతిపెద్ద పత్రికగా ఉన్న చోసున్​ మాత్రం తన తప్పును సరిచేసి ప్రచురించలేదు. అయితే.. ఇటీవలే మార్చిలో తన 100వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆ తప్పుడు వార్తకు క్షమాపణ కోరింది.

ఇదే పత్రిక మరో తప్పునూ అంగీకరించింది. ఉత్తర కొరియా గాయకురాలు, అధికార పార్టీ సభ్యురాలు హ్యోన్​ సంగ్​ వోల్​ను 2013లో ఉరితీశారని తప్పుడు వార్త ప్రచురించింది చోసున్​ దినపత్రిక. 2014 మేలో ఆమె తిరిగి కనిపించగా ఉరి వార్తలు వదంతులుగానే మిగిలాయి. ఇప్పుడు హ్యోన్​.. ఉత్తరకొరియాలోని శక్తిమంతమైన మహిళల్లో ఒకరు.

కిమ్​ జోంగ్ ఇల్​...

ప్రస్తుత దేశాధినేత కిమ్​ జోంగ్​ ఉన్​ తండ్రి అయిన కిమ్​ జోంగ్ ఇల్​ .. కూడా ఆయన మరణానికి సంబంధించి ఎన్నో సార్లు వార్తల్లో నిలిచారు.

kim jong il
కిమ్​ జోంగ్​ ఇల్​

2004లో కిమ్​ జోంగ్​... బీజింగ్​ నుంచి స్వదేశానికి రైల్లో బయల్దేరిన కాసేపటికే ఉత్తర కొరియా రైల్వేస్టేషన్​ వద్ద భారీ పేలుడు సంభవించింది. ఆయనపై హత్యాయత్నం జరిగిందని వార్తలు గుప్పుమన్నాయి. అయితే.. దీనికీ రుజువుల్లేకపోయాయి.

2008లో ఆయన స్ట్రోక్​తో చనిపోయారన్న మాటలు వినిపించాయి. అయితే... దక్షిణ కొరియా స్టాక్​మార్కెట్లు కుప్పకూలేలా చేసేందుకే ఆ ప్రచారం చేశారన్న ఆరోపణలున్నాయి. అనంతరం.. 2011 డిసెంబర్​లో ఆరోగ్యం క్షీణించి చనిపోయేముందు వరకు కిమ్​ జోంగ్ ఇల్​ గురించి ఎలాంటి సమాచారమూ ప్రపంచ సమాజానికి తెలియకపోవడం గమనార్హం.

కిమ్​ జోంగ్ ఇల్​ సోదరిని ప్రస్తుత దేశాధినేత విషమిచ్చి చంపినట్లూ వార్తలొచ్చాయి. 73 ఏళ్ల కిమ్​ క్యోంగ్​ హ్యూ.. ఆరేళ్ల తర్వాత కిమ్ జోంగ్​ ఉన్​​ పక్కనే కనిపించడం విశేషం.

కిమ్​ జోంగ్​ ఉన్​..

kim jong un
కిమ్​ జోంగ్​ ఉన్​

తండ్రీ, తాతల్లాగే కిమ్​ జోంగ్ ఉన్​​ కూడా గతంలో బయటకు కనిపించని దాఖలాలున్నాయి. 2014లో దాదాపు 6 వారాలు కనిపించకుండా పోయిన కిమ్​.. అనంతరం చేతికర్రతో ప్రత్యక్షమయ్యారు. ఆయన చీలమండ శస్త్రచికిత్స చేయించుకున్నట్లు దక్షిణ కొరియా గూఢచారి సంస్థ నివేదించింది.

2016లో అవినీతి ఆరోపణలతో మాజీ సైన్యాధిపతిని కిమ్​ ఉరి తీయించినట్లు దక్షిణ కొరియా మీడియా ఉటంకించింది. కానీ.. కొన్ని నెలల తర్వాత రీ యోంగ్​ గిల్​ వేరే ఉన్నత పదవిలో బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు ఉత్తర కొరియా మీడియా చూపించింది.

ఇప్పుడూ అవే వదంతులు...

కరోనా నివారణ చర్యల్లో భాగంగా కిమ్​ చివరగా ఏప్రిల్​ 11న ప్రజలముందుకొచ్చారు. ఏప్రిల్​ 15న తన తాత, దేశనిర్మాత రెండో కిమ్​ సంగ్​ జయంతి వేడుకలకు కిమ్​.. గైర్హాజరవడం కిమ్​ ఆరోగ్యంపై వదంతులకు కారణమైంది.

kim
కిమ్​ జోంగ్​ ఉన్​

ఉత్తర కొరియా మీడియా మాత్రం కిమ్​ తన వ్యక్తిగత పనులకే పరిమితమయ్యారని నివేదించింది. సిరియా, క్యూబా, దక్షిణాఫ్రికా దేశాధినేతలకు కిమ్​ పలు సందేశాలు పంపించినట్లు పేర్కొంది. దేశంలోని వాన్సాన్​ సిటీలో పర్యటక భవనాలు నిర్మిస్తున్న కార్మికులకు కృతజ్ఞతలు తెలిపినట్లూ వెల్లడించింది. ఈ సందర్భంగా కిమ్​ అక్కడే ఉన్నట్లు పలు వార్తాపత్రికలు కథనాలు వెలువరించాయి. ఆయనదిగా భావిస్తున్న రైలు కూడా ఇటీవల అక్కడ కనిపించడం ఆ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది.

అయితే కిమ్​ తన తండ్రి, తాతల్లాగే తిరిగి కనిపిస్తారని పలువురు నమ్మకంగా ఉన్నప్పటికీ.. కొందరు విశ్లేషకులు మాత్రం ధూమపాన అలవాట్లు, బరువు పెరగడం, ఇతర ఆరోగ్య సమస్యలు కిమ్​కు ముప్పుగా పరిణమించాయని అంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ మాత్రం.. తనకు కిమ్​ గురించి సమాచారం ఉందని, కానీ ఇప్పుడు చెప్పలేనని ఇటీవల వ్యాఖ్యలు చేశారు. ఉత్తర కొరియా పొరుగున ఉన్న దక్షిణ కొరియా.. కిమ్​ ఆరోగ్యంగానే ఉన్నట్లు భావిస్తోంది. ఈ తరుణంలో కిమ్​ జోంగ్​ ఉన్​.. ఎక్కడ ఎలా ఉన్నారో ఎలాంటి స్పష్టమైన ఆధారాల్లేవు. ఆయన ప్రత్యక్షమైనప్పుడే ఈ వదంతులు, ఊహాగానాలకు ముగింపు పడుతుంది.

Last Updated : May 1, 2020, 9:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.