ETV Bharat / international

'బైడెన్​ నెగ్గిన అన్ని చోట్లా కేసులు.. మేమే గెలుస్తాం'

author img

By

Published : Nov 6, 2020, 5:39 AM IST

అధ్యక్ష పీఠానికి ఆరు అడుగులు దూరంలో ఉన్న బైడెన్​ను న్యాయపరంగా అడ్డుకునేందుకు డొనాల్డ్​ ట్రంప్​ ప్రయత్నిస్తున్నారు. బైడెన్​ గెలిచిన అన్ని ప్రాంతాల్లోనూ కేసులు వేస్తానన్నారు. మరోవైపు పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఓట్ల లెక్కింపుపై ట్రంప్​ వేసిన వ్యాజ్యానికి కోర్టు నుంచి సానుకూల తీర్పు వచ్చింది.

Trump
'బైడెన్​ నెగ్గిన అన్ని చోట్లా కేసులు.. మేమే గెలుస్తాం'

డెమొక్రాటిక్​ అభ్యర్థి జో బైడెన్​ నెగ్గానని చెప్పుకుంటున్న అన్ని రాష్ట్రాల్లోనూ న్యాయపోరాటం చేయబోతున్నట్లు రిపబ్లికన్​ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ హెచ్చరించారు. ఇందులో భాగంగా తాజాగా జో విజయాన్ని ఖరారు చేస్తుందనుకుంటున్న నెవాడాలో భారీ స్థాయిలో ఎన్నికల అవకతవకలు చోటు చేసుకున్నాయంటూ రిపబ్లికన్లు గురువారం నాడు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇప్పటికే పెన్సిల్వేనియా, జార్జియా, మిషిగన్​లలో కూడా ట్రంప్​ శిబిరం న్యాయపోరాటానికి దిగింది. అయితే మిషిగన్​, జార్జియాలో వేసిన వ్యాజ్యాలను న్యాయస్థానాలు తిరస్కరించాయి.

"బైడెన్​ గెలిచారని చెప్పుకుంటున్న అన్నిచోట్లా ఓటర్లను మోసం చేసినందుకు, ఎన్నికల్లో మోసానికి పాల్పడినందుకు కేసులు వేయబోతున్నాం. మోసాలు చేశారనేందుకు బోలెడన్ని రుజువులున్నాయి. మీడియావారూ! చూసుకోండి.. మేం గెలవబోతున్నాం.. గెలవబోతున్నాం. అమెరికా ఫస్ట్​.

న్యాయమైన ఓట్లను లెక్కిస్తే నేను గెలుస్తాను. చట్టవ్యతిరేక ఓట్లను లెక్కిస్తే.. మా గెలుపును వారు కొల్లగొట్టేస్తారు."

- డొనాల్డ్​ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

"అధ్యక్ష ఎన్నికను నెవాడా నిర్ణయింస్తుందని మేం ముందు నుంచీ చెబుతూ వస్తున్నాం. ఇప్పుడు న్యాయస్థానం నుంచి అత్వసర ఉపశమనం కోరుతున్నాం. అన్యాయంగా నమోదైన ఓట్ల లెక్కింపును ఆపేయాలని న్యాయమూర్తిని అడుగుతున్నాం. డెమొక్రాట్లు ఇక్కడ ఎన్నికల పద్ధతిని పూర్తిగా మార్చేశారు. మెయిల్​ ఇన్​ బ్యాలెట్ల పేరిట ఒక్కో ఇంటికి ఇబ్బడిముబ్బడిగా బ్యాలెట్​ పేపర్లు పంపించారు. ట్రక్కుల్లో తరలించారు. చాలామందిని పోలింగ్​ కేంద్రాల్లో ఓటు వేయనీయలేదు. నెలరోజులు ఇక్కడ నివాసం ఉన్న వారికి ఓటింగ్​ అర్హత ఇచ్చారు. అలా ఇతర ప్రాంతాల వారు వచ్చి ఓట్లు వేశారు. ఇప్పటిదాకా ఒక్క మెయిల్​ ఇన్​ బ్యాలెట్​ను కూడా పరిశీలించనివ్వట్లేదు. వీటిలో బోలెడంత మోసం ఉంది."

- ఆడమ్, రిపబ్లికన్​ పార్టీ న్యాయవాది

నెవాడాలో 86 శాతం ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి డెమొక్రాటిక్​ అభ్యర్థి జో బైడెన్ 7 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఆధిక్యంలో ఉన్నారు. బైడెెన్​ అధ్యక్ష పీఠం అధిరోహించేందుకు మరో ఆరు ఓట్ల దూరంలో ఉన్నారు. నెవాడాలో మొత్తం ఎలక్టోరల్​ ఓట్లు ఆరే! ఇక్కడ నెగ్గితే బైడెన్ నెగ్గినట్లే అనేది అనేక వార్తాసంస్థలు చెబుతున్న మాట.

అనుకూల తీర్పు...

కౌంటింగ్​ను ఆరు అడుగుల దూరం నుంచి చూసేందుకు పార్టీలకు చెందిన ఎన్నికల పర్యవేక్షకులను అనుమతించాలంటూ కామన్​వెల్త్​ కోర్ట్​ ఆఫ్​ పెన్సిల్వేనియా తాజాగా ఆదేశించింది. బ్యాలెట్లను తెరిచి, లెక్కించే ప్రక్రియను దగ్గరి నుంచి పరిశీలించేలా పర్యవేక్షకులను అనుమతించకపోవడంపై ట్రంప్​ బృందం తొలుత స్థానిక కోర్టును ఆశ్రయించింది. అక్కడ అనుకూల తీర్పు రాకపోవడం వల్ల హైకోర్టుకు వెళ్లిన సంగతి గమనార్హం. తాజా తీర్పుపై ట్రంప్​ హర్షం వ్యక్తం చేశారు. పెన్సిల్వేనియాలో న్యాయపరమైన భారీ విజయం అంటూ ట్వీట్​ చేశారు.

ప్రస్తుతం పెన్సిల్వేనియాలో ట్రంప్​ ముందంజలో ఉన్నా లెక్కింపు సాగేకొద్దీ ఆయన ఆధిక్యం తగ్గుతూ వస్తోంది. కోర్టు తీర్పు నేపథ్యంలో ఇప్పటివరకూ పూర్తయిన కౌంటింగ్​ను సమీక్షించేందుకూ తమకు అనుమతి వచ్చినట్లేనని ట్రంప్​ బృందం తెలిపింది. పెన్సిల్వేనియాలో బ్యాలెట్ల లెక్కింపులో జోక్యం చేసుకోవాలని సుప్రీం కోర్టునూ ట్రంప్​ కోరినట్లు వార్తలు వస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.