ETV Bharat / international

'భయంతోనే ట్రంప్​కు అనుకూలంగా ఓటు'

author img

By

Published : Feb 14, 2021, 11:42 AM IST

Democrats
'అమెరికా చరిత్రలో అపఖ్యాతి ఓటుగా నిలిచిపోతుంది'

అభిశంసన ఓటింగ్​లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​కు మద్దతుగా నిలిచిన రిపబ్లికన్లపై విమర్శలు గుప్పించారు డెమొక్రటిక్​ నేతలు. వారి ఓటు దేశ చరిత్రలో మాయని మచ్చగా నిలచిపోతుందన్నారు. పదవులను కాపాడుకునేందుకు, పిరికితనంతో ఓటు వేశారని ఆరోపించారు హౌస్​ స్పీకర్​ నాన్సీ పెలోసీ.

క్యాపిటల్​ హిల్​పై దాడికి తమ మద్దతుదారులను ప్రేరేపించారన్న అభియోగాలు ఎదుర్కొంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ను నిర్దోషిగా తేల్చింది సెనేట్​. ఈ క్రమంలో ట్రంప్​కు మద్దతుగా నిలిచిన రిపబ్లికన్​ పార్టీ సెనేటర్లపై విమర్శలు గుప్పించింది అధికార డెమొక్రటిక్​ పార్టీ. మాజీ అధ్యక్షుడిని రక్షించేందుకు వేసిన వారి ఓటు అమెరికా సెనేట్​ చరిత్రలో అపఖ్యాతి ఓటుగా నిలిచిపోతుందని పేర్కొంది.

సెనేట్​లో నాలుగు రోజుల పాటు విచారణ చేపట్టిన అనంతరం ఓటింగ్​ నిర్వహించారు. 57-43 ఓట్లతో అభిశంసన వీగిపోయింది. ఏడుగురు రిపబ్లికన్​ సెనేటర్లు ట్రంప్​కు వ్యతిరేకంగా ఓటు వేయగా 43 మంది మద్దతు పలికారు. ఈ క్రమంలో వారిపై విమర్శలు గుప్పించారు సెనేట్​ మెజారిటీ నేత చక్​ షూమర్​.

" అమెరికా చరిత్రలో జనవరి 6వ తేదీ దుర్దినంగా నిలిచిపోతుంది. అలాగే.. డొనాల్డ్​ ట్రంప్​ను దోషిగా తేల్చటంలో విఫలమవటం కూడా సెనేట్​ చరిత్రలో అపఖ్యాతి ఓటుగా ఉండిపోతుంది. రిపబ్లికన్​ నాయకుడితో పాటు.. మెజారిటీ కలిగిన సెనేట్​ రిపబ్లికన్​ కాకస్ ట్రంప్​ను నిర్దోషిగా తేల్చేందుకు ఓటు వేసింది. ఆయనతో పాటు వారి పేర్లు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయేలా లిఖించుకున్నారు. ట్రంప్​ను వదిలేసేందుకు ఏ అంశాన్ని పరిగణించారు? ఎన్నికల ఫలితాలను తారుమారు చేసినందుకు ప్రయత్నించినందుకా? సొంత ప్రభుత్వంపై దాడి చేయాలని ప్రేరేపించినందుకా? "

- చక్​ షూమర్​, సెనేట్​ మెజారిటీ నేత

రిపబ్లికన్లపై పెలోసీ విమర్శలు..

క్యాపిటల్​ దాడి అభియోగంలో ట్రంప్​ను నిర్దోషిగా తేల్చేందుకు సెనేట్​ రిపబ్లికన్లు పిరికితనంతో ఓటు వేశారని ఆరోపించారు స్పీకర్​ నాన్సీ పెలోసీ. 'సెనేట్​లో ఈరోజు చూసిన దృశ్యాలు పిరికితనంతో చేసినట్లు కనిపించాయి. తమ పదవులను కాపాడుకునేందుకు వేరే అవకాశం లేక భయంతో ఓటు వేశారు. ట్రంప్​కు మద్దతుగా ఓటు వేసిన రిపబ్లికన్లు.. తమ ఓటుతో రాజ్యాంగాన్ని, దేశాన్ని, అమెరికా ప్రజలను వదిలివేయాలనుకున్నారు.' అని పేర్కొన్నారు నాన్సీ పెలోసీ

నిజాన్ని రక్షించటం ప్రతి ఒక్కరి విధి..

డొనాల్డ్​ ట్రంప్​ను నిర్దోషిగా తేల్చటం అనేది ప్రజాస్వామ్యం బలహీనంగా ఉందనే విషయాన్ని గుర్తు చేస్తోందన్నారు అధ్యక్షుడు జో బైడెన్​. నిజాన్ని రక్షించటం ప్రతి ఒక్క అమెరికా పౌరుడి విధి అని సూచించారు.

"మన చరిత్రలోని ఈ బాధాకరమైన అధ్యాయం​ ప్రజాస్వామ్యం బలహీనంగా ఉందని గుర్తు చేస్తోంది. దానిని మనం రక్షించుకోవాలి. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. అమెరికాలో హింస, ఉగ్రవాదానికి తావు లేదు. నిజాన్ని రక్షించి, అబద్ధాన్ని ఓడించటం ప్రతి ఒక్క అమెరికా పౌరుడు, ముఖ్యంగా నాయకుల బాధ్యత. ట్రంప్​ను దోషిగా తేల్చటాన్ని వ్యతిరేకించిన వారిలో సెనేటర్​ మైనారిటీ నాయకుడు మెక్ కానెల్​ వంటి వారు మాజీ అధ్యక్షుడు తప్పు చేసినట్లు భావిస్తున్నారు."

-జో బైడెన్​ అమెరికా అధ్యక్షుడు.

ఇదీ చూడండి: ట్రంప్​ను నిర్దోషిగా ప్రకటించిన సెనేట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.