ETV Bharat / international

అమెరికాలో భారీగా కేసులు- టీకా ఉత్పత్తికి 'క్వాడ్'​ సన్నాహాలు

author img

By

Published : Aug 5, 2021, 7:48 AM IST

cases, covid
కేసులు, కొవిడ్

అమెరికాలో కొవిడ్​ కేసులు అమాంతం పెరుగుతుండటం ఆందోళనకరంగా మారింది. బ్రెజిల్​లోనూ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో టీకా ఉత్పత్తిని పెంచేందుకు కృషి చేస్తున్నాయి క్వాడ్ దేశాలు. మరోవైపు.. భారత్​ను రెడ్​ లిస్ట్​ నుంచి తొలగించనున్నట్లు బ్రిటన్​ ప్రకటించింది.

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ వ్యాప్తి మళ్లీ తీవ్రమవుతోంది. అమెరికా, బ్రెజిల్​లో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. అమెరికాలో కొత్తగా లక్షకుపైగా కేసులు నమోదవ్వగా, బ్రెజిల్​లో 40వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్​ ప్రక్రియను వేగవంతం చేసే దిశగా అడుగులేస్తున్నాయి ఆయా దేశాలు.

2022 చివరినాటికి 100 కోట్ల కొవిడ్​ టీకా డోసులు అభివృద్ధి చేసేందుకు క్వాడ్ దేశాలు ప్రయత్నం చేస్తున్నట్లు శ్వేతసౌధం పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా టీకాలు అత్యవసరమున్న దేశాలకు వ్యాక్సిన్లు అందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్వేతసౌధం మీడియా ప్రతినిధి జెన్ సాకి తెలిపారు.

మరోవైపు.. 13 లక్షల ఆస్ట్రాజెనెకా డోసులను 'కొవాక్స్​' వ్యాక్సినేషన్​ కార్యక్రమం కోసం అందించనున్నట్లు జర్మనీ పేర్కొంది. అమెరికా సాయంతో ఈ డోసులు అందించనున్నట్లు స్పష్టం చేసింది.

రెడ్​ లిస్ట్ నుంచి తొలగింపు!

కొవిడ్​ నేపథ్యంలో ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తూ.. భారత్​ను రెడ్​ లిస్ట్​లో చేర్చిన బ్రిటన్​ మరో నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 8న రెడ్​ లిస్ట్​ నుంచి తొలగించి అంబెర్​ లిస్ట్​లో చేర్చనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ప్రయాణికులు.. బ్రిటన్​ వెళ్లేందుకు మూడు రోజుల ముందు కొవిడ్ టెస్టు చేయించుకోవాలని, ఇంగ్లాండ్​ వెళ్లాక 10 రోజుల పాటు క్వారంటైన్​లో ఉండాలని ఆ దేశ ప్రభుత్వం ఆదేశించింది.

ఆయా దేశాల్లో కేసుల వివరాలు..

  • అగ్రరాజ్యంలో వైరస్​ కేసులు అమాంతం పెరిగాయి. కొత్తగా 1,12, 229 మంది వైరస్​ బారిన పడ్డారు. 654 మంది మృతిచెందారు.
  • బ్రెజిల్​లో కొత్తగా 40,460 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 1,118 మంది కొవిడ్​ కాటుకు బలయ్యారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య రెండు కోట్లు దాటింది.
  • ఫ్రాన్స్​లో సుమారు 28వేల కేసులు నమోదు కాగా.. 53 మంది మృత్యువాత పడ్డారు.
  • టర్కీలో కొత్తగా 26 వేల కేసులు వెలుగు చూశాయి. 122 మంది చనిపోయారు.
  • ఇరాన్​లో కొత్తగా 39వేల కేసులు వెలుగు చూశాయి. 409 మరణాలు నమోదయ్యాయి.
  • ఇండోనేషియాలో ప్రపంచంలోనే అత్యధికంగా 1,747 మంది వైరస్​ ధాటికి చనిపోయారు. సుమారు 35 వేల కొత్తకేసులు నిర్ధరణ అయ్యాయి.

ఇదీ చదవండి:కరోనా దెబ్బకు ఆ నగరం బంద్- అధికారులకు శిక్షలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.