'శంకరాభరణం'కు మరో అరుదైన గౌరవం

author img

By

Published : Nov 21, 2022, 3:10 PM IST

Shankarabaranam special honour
'శంకరాభరణం'కు మరో అరుదైన గౌరవం ()

తెలుగు సినిమా కీర్తి కెరటాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన కళాత్మక దృశ్య కావ్యం 'శంకరాభరణం'. ఇప్పుడీ చిత్రానికి మరో అరుదైన గౌరవం దక్కింది. ఏంటంటే?

తెలుగు సినీ చరిత్రలో శంకరాభరణం ఒక ఆణిముత్యం. క్లాసిక్‌ మూవీ శంకరాభరణం చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవాల్లో రీస్టోర్డ్‌ ఇండియన్‌ క్లాసిక్‌ విభాగంలో ఎంపికైంది. దేశంలో విడుదలైన గొప్ప చిత్రాలను డిజిటలైజ్‌ చేసి భద్రపరుస్తుంటుంది 'నేషనల్‌ ఫిల్మ్‌ ఆర్కైవ్‌ ఆఫ్‌ ఇండియా'. ఈ పక్రియకు కళా తపస్వి కె.విశ్వనాథ్‌ రూపొందించిన 'శంకరాభరణం' ఎంపికైంది. పూర్ణోదయ ఆర్ట్స్‌క్రియేషన్స్‌ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. జె.వి సోమయాజులు, మంజు భార్గవి, చంద్రమోహన్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. చలన చిత్రోత్సవాల్లో భాగంగా ఈ మూవీని ప్రత్యేక ప్రదర్శన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఏడిద నాగేశ్వరరావు కూమారుడు ఏడిద రాజా ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరవుతారు.

Shankarabaranam
'శంకరాభరణం'కు మరో అరుదైన గౌరవం

ఈ సినిమా ఆడదన్నారు.. ఈ కథతో సినిమా తీయాలనుకున్నప్పుడు దర్శకుడు విశ్వనాథ్‌ మదిలో మెదిలిన ఆలోచన ఒక కొత్త వ్యక్తిని పెట్టి ఈ కథతో తీయాలనుకున్నారు. ఆ సమయంలో 'రారా కృష్ణయ్య'లో నటించిన జొన్నలగడ్డ వెంకట సోమయాజులుని శంకరశాస్త్రి పాత్ర కోసం తీసుకున్నారు. అలాగే మంజు భార్గవి కూడా అప్పటికి పెద్ద పేరున్న నటేమీ కాదు. ఇక షూటింగ్‌కు వెళ్లాక ప్రతి షాటునీ శ్రమతో, ప్రతి దృశ్యాన్ని శ్రద్ధతో తీశారు. మొదటి కాపీ వచ్చిన తర్వాత దగ్గర వాళ్లంతా చూసి విశ్వనాథ్‌కి జేజేలు పలికారు.

ఇక ఆ సినిమా ప్రజల దగ్గరకు వెళ్లాలి. ఆ రోజుల్లో పంపిణీదారులు లేరు. కొనుగోలు దారులే దారి. అప్పట్లో ఆ హీరోల సినిమాలకు జిల్లాల వారీగా కొన్ని ధరలుండేవి. నిర్మాత, కొనుగోలుదారు చేరుతాడనుకొని వ్యాపారం చేసేవారు. 'శంకరాభరణం' కొనుగోలుదారుల ముందుకు వెళ్లింది. 'నడిగర్‌ సంఘం' ఆవరణలోని థియేటర్‌ బుక్‌ చేసి సినిమా వేశారు. కొందరు మిత్రులు, పరిశ్రమలోని ముఖ్యమైన వాళ్లూ వచ్చారు. సినిమా పూర్తయింది. 'బాగుందండీ' అన్నవాళ్లేగానీ, కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. పైగా వ్యాఖ్యానాలు. 'మంజుభార్గవికి పేరు లేదు. జయమాలినిని పెట్టి ఉంటే బాగుండేది' అని ఒకరు. 'కొత్తవాడు కాకుండా అక్కినేని నాగేశ్వరరావుని పెట్టి తీసి ఉంటే ఆయన కోసం కొనేవాళ్లం' అని ఒకరు 'జనం చూడరండీ పాటలు, డ్యాన్సులు ఎవడిక్కావాలి? అట్టర్‌ ఫ్లాప్‌ అవుతుంది. నా చేతులు కాల్చుకోలేను' ఇంకొకరు. ఇలా విమర్శలు చేశారు. కానీ, ఎంతో కొంతకి కొంటామన్నవాళ్లు లేరు.

నిర్మాత ఏడిద నాగేశ్వరరావు డీలా పడిపోయారు. విశ్వనాథ్‌ నిరాశ పడినా జనంలోకి వెళ్తే ఆదరణ లభిస్తుందని నమ్మకం. కానీ వెళ్లడం ఎలా? కనీసం పారితోషికం కూడా తీసుకోలేదు. సినిమా విడుదలై బాగా నడిస్తే వచ్చిన దానిలో లాభం తీసుకుందామనుకున్నారు. అలాగే ఒప్పందం చేసుకున్నారు. ప్రయత్నాలు చేసి చేసి ఏడిద నాగేశ్వరరావు ఎంతకో కొంతకి, నష్టానికే కొన్ని జిల్లాలకు అమ్మేశారు. కొన్ని జిల్లాలు అమ్ముడు పోలేదు. సినిమా విడుదలైంది. సినిమా భాషలో చెప్పాలంటే ఓపెనింగ్స్‌ లేవు. మూడో రోజు, నాలుగో రోజు థియేటర్లు వెలవెల బోయాయి. 'బాగుంది' అన్న మాట మాత్రం వినిపిస్తోంది. నిదానంగా 'బాగుంది.. బాగుంది' అన్న మాటే ప్రచార సాధనమై రెండో వారం నుంచి అందుకుంది.

Shankarabaranam
'శంకరాభరణం'కు మరో అరుదైన గౌరవం

ప్రేక్షకులు ఆనంద పరవశులైపోయారు. రెండోసారీ, మూడోసారి చూడటం ఆరంభించారు. మామూలు హిట్‌ కాదు.. పెద్ద హిట్‌, మూడో వారంలో బ్లాక్‌లో టిక్కెట్లు కొని మరీ చూశారు కొందరు. దర్శక-నిర్మాతల ఆనందానికి అవధులు లేవు. ఎక్కడ చూసినా 'శంకరాభరణం' పాటలే. తమిళ, కన్నడ భాషల్లో కూడా బాగా ఆడింది. మలయాళంలో మాటలు డబ్‌ చేసి, పాటలను తెలుగులోనే ఉంచి విడుదల చేశారు. అక్కడా పెద్ద హిట్‌. కొనలేకపోయినవాళ్లు నెత్తినోరూ కొట్టుకొన్నారు. అమ్ముడుపోక తానే అట్టిపెట్టుకున్న జిల్లాల ద్వారా నిర్మాతకు కలెక్షన్ల పంట పడింది. అది విశ్వనాథ్‌ సినిమా అంటే.

ఇదీ చూడండి: అబుదాబిలో రణ్​వీర్ సింగ్ సందడే సందడి క్రీడా సినీ దిగ్గజాలతో సెల్ఫీలే సెల్ఫీలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.