ETV Bharat / entertainment

ఈ ముద్దుగుమ్మల పరిస్థితి ఏంటో, కనీసం ఈసారైనా

author img

By

Published : Aug 27, 2022, 6:41 AM IST

Updated : Aug 27, 2022, 6:54 AM IST

kritishetty
కృతిశెట్టి

చిత్రసీమలో ప్రతిభ కంటే విజయాలే కీలకం. ఎవరికి ఎక్కువ విజయాలు ఉంటే వాళ్లనే అవకాశాలు వరిస్తుంటాయి. మార్కెట్‌ సమీకరణాలే అంత! ఒక్క విజయంతో ఆయా తారలకి బోలెడంత మైలేజీ లభిస్తుంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ విజయం కోసమే పరితపిస్తుంటారు. ఎంత మంచి అవకాశం దక్కించుకున్నా... టన్నులకొద్దీ ప్రతిభని ప్రదర్శించినా... కొన్నిసార్లు విజయాలు మొహం చాటేస్తుంటాయి. అలాంటి కొద్దిమంది కథానాయికలకి రానున్న సెప్టెంబర్‌ మాసం కీలకంగా మారింది. పరాజయాలతో సతమతమవుతున్న పలువురు భామలు ఈ నెలలో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరి ఈసారైనా విజయం దక్కేనా?

చిత్రసీమలో అవకాశాలు ఎంత ముఖ్యమో... వాటిని నిలబెట్టుకోవడం అంతే ముఖ్యం. అందుకే కాస్త నిలదొక్కుకున్నాక ప్రతి ఒక్కరూ మంచి కథల్ని ఎంపిక చేసుకోవడంపైనే దృష్టిపెడుతుంటారు. ఆచితూచి అడుగులు వేస్తుంటారు. రీతూవర్మ, నివేదా థామస్‌, రెజీనా... వీళ్లంతా ఆ రకమే. కథాబలం ఉన్న చిత్రాల్లో నటించడానికే ఇష్టపడుతుంటారు. నటులుగా ప్రతిభావంతులు అనే పేరు తెచ్చుకున్నా వీళ్లకి ఈమధ్య తెలుగులో ఆశించిన స్థాయి ఫలితాలు లేవు. 'శాకిని ఢాకిని'తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకొస్తున్నారు రెజీనా, నివేదా థామస్‌. కొరియన్‌ చిత్రం 'మిడ్‌నైట్‌ రన్నర్స్‌'కి రీమేక్‌గా రూపొందిన చిత్రమిది. అక్కడ అబ్బాయిలతో తెరకెక్కగా, తెలుగులో అమ్మాయిలు ప్రధాన పాత్రధారులుగా కనిపిస్తారు. ఇటీవల విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని రేకెత్తించాయి. రెజీనా, నివేదా థామస్‌కి కీలకమైన ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందనేది చూడాలి. తెలుగమ్మాయి రీతూ వర్మ కూడా ప్రతిభగల నటి. ఈమధ్య ‘టక్‌ జగదీష్‌’, ‘వరుడు కావలెను’ చిత్రాల్లో నటించింది. అవి పెద్దగా ప్రభావం చూపించలేదు. వచ్చే నెలలో 'ఒకే ఒక జీవితం'తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈమె కెరీర్‌ మళ్లీ ఊపందుకోవాలంటే ఈ సినిమానే కీలకం. ప్రస్తుతం రీతూ చేతిలో సినిమాలేమీ లేవు. 'ఒకే ఒక జీవితం' తర్వాత మళ్లీ జోరు పెంచుతుందేమో చూడాలి.

regina thomas
రెజీనా, థామస్​

తొలి సినిమా 'ఉప్పెన'తోనే ప్రభావం చూపించడం మొదలుపెట్టింది కృతిశెట్టి. ఆమెకి అవకాశాలకి కొదవలేదు. అగ్ర కథానాయకులకి జోడీగా నటిస్తోంది. అయితే ‘ఉప్పెన’ తర్వాత ఆ స్థాయి విజయం కృతిశెట్టికి దక్కలేదు. ఇటీవల 'మాచర్ల నియోజకవర్గం'తో సందడి చేసింది. ఆ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. వచ్చే నెలలో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సుధీర్‌బాబుకి జోడీగా నటించింది కృతిశెట్టి. మరి ఈ ప్రేమ కథతో ఆమె మళ్లీ ఫామ్‌ అందుకుంటుందేమో చూడాలి. దిల్లీ భామ కేతికశర్మకి అవకాశాలకి కొదవలేదు. 'రొమాంటిక్‌' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె, నాగశౌర్యతో కలిసి ‘లక్ష్య’లోనూ మెరిసింది. ఇప్పటిదాకా విజయం రుచి చూడని ఈమె, ‘రంగ రంగ వైభవంగా’ అంటూ వైష్ణవ్‌తేజ్‌తో కలిసి ప్రేక్షకుల ముందుకొస్తోంది. వచ్చే నెలలోనే ఈ చిత్రం విడుదల అవుతోంది. ఈ సినిమా కేతికశర్మకి చాలా ముఖ్యం. మరిన్ని అవకాశాలు అందుకోవాలంటే హిట్‌ భామ అనిపించుకోవల్సిందే.

kriti ritu
కృతి, రీతూ
Last Updated :Aug 27, 2022, 6:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.