ETV Bharat / entertainment

ప్రముఖ సింగర్ ఇంట్లో భారీ చోరీ.. 60 సవర్ల బంగారం మాయం.. వారిపైనే డౌట్

author img

By

Published : Apr 1, 2023, 7:02 PM IST

Updated : Apr 1, 2023, 7:23 PM IST

ప్రముఖ గాయకుడు​ ఏసుదాసు కుమారుడు, యువ గాయకుడు విజయ్‌ ఏసుదాసు ఇంట్లో భారీ చోరీ జరిగింది. తన ఇంట్లో ఉన్న 60 సవర్ల బంగారం, వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయంటూ విజయ్ చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

vijay yesudas latest news
vijay yesudas latest news

ప్రముఖ సింగర్​ ఏసుదాసు కుమారుడు, యువ గాయకుడు విజయ్‌ ఏసుదాసు ఇంట్లో భారీ చోరీ జరిగింది. తన ఇంట్లో ఉన్న 60 సవర్ల బంగారం, వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయంటూ విజయ్ ఏసుదాసు చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో పనిచేసే సిబ్బందిపై అనుమానం ఉన్నట్లు విజయ్​ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ చోరీపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ప్రముఖ గాయకుడు కేజే ఏసుదాసు తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయమైనా గాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్ ఏసుదాస్​. 2002లో నీతో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు విజయ్ ఏసుదాస్​. నందమూరి హరికృష్ణ హీరోగా నటించిన సీతయ్య చిత్రంలో 'సమయానికి తగు సేవలు' అనే పాటతో తెలుగు ప్రజల గుండెల్లో తనదైన ముద్ర వేశారు. 2006లో కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీరామదాసు చిత్రంలో 'అల్లా' అనే పాటకు తన గాత్రంతో ప్రాణం పోశారు విజయ్​. శ్రీరామదాసు చిత్రానికి ఎం.ఎం కీరవాణి సంగీతం అందించారు.

సూపర్​స్టార్ కుమార్తె ఇంట్లో..
తమిళనాడులోని చెన్నైలో.. సూపర్​స్టార్​ రజనీకాంత్​ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్​ ఇంట్లో ఇటీవల భారీ చోరీ జరిగింది. ఈ కేసును పోలీసులు ఛేదించారు. బంగారు, వజ్రాభరణాలు దొంగిలించినందుకు గాను ఐశ్వర్య ఇంట్లో పనిమనిషి, కారు డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కాగా.. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. జీతం సరిపోకపోవడం వల్లే తాను చోరీలకు పాల్పడినట్లు నిందితురాలు ఈశ్వరి పోలీసుల ఎదుట చెప్పింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐశ్వర్య కారు డ్రైవర్ వెంకటేశన్​ సహకారంతో పనిమనిషి ఈశ్వరి సుమారు 100 తులాల బంగారు ఆభరణాలు, 30 గ్రాముల వజ్రాభరణాలు, నాలుగు కిలోల వెండి ఆభరణాలను అపహరించింది. 18 ఏళ్లుగా పనిమనిషిగా పనిచేసిన ఈశ్వరికి ఐశ్వర్య రజనీకాంత్ ఇంటిపై పూర్తి అవగాహన ఉంది. దీంతో 2019 నుంచి పలుమార్లు లాకర్ తెరిచి నగలను దొంగిలించింది.

ఐశ్వర్య నగలు దొంగలించిన ఈశ్వరి.. వాటిని అమ్మి ఇల్లు కొనుగోలు చేసింది. దొంగిలించిన బంగారంలో కొంత భాగం.. కారు డ్రైవర్​ వెంకటేశన్​కు కూడా ఇచ్చింది. అయితే ఈశ్వరి, వెంకటేశన్​ను పోలీసులు విచారించగా.. వారిద్దరూ నిజాన్ని ఒప్పుకున్నారు. దీంతో ఈశ్వరి నుంచి ఇంటి కొనుగోలుకు సంబంధించిన పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Last Updated : Apr 1, 2023, 7:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.