రుణయాప్ నిర్వాహకుల వేధింపులకు ఇద్దరు యువకులు బలి

author img

By

Published : Jul 21, 2022, 4:40 PM IST

రుణయాప్ నిర్వాహకుల వేధింపులకు ఇద్దరు యువకులు బలి

Suicide: లోన్‌ యాప్‌లు ప్రాణాలు బలిగొంటున్నాయి. ఆన్​లైన్ ద్వారా డబ్బులు ఇస్తున్న యాప్‌ల నిర్వాహకులు.. ఆ డబ్బు రాబట్టేందుకు వేధింపులకు పాల్పడుతున్నారు. కొందరు రుణం తీర్చినా.. ఇంకా కట్టాలంటూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ పరిస్థితులనే ఎదుర్కొన్న ఏపీలోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన ఇద్దరు యువకులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Suicide: ఓ యువకుడు బ్యాంకులో రుణం తీసుకున్నాడు. అది తీర్చకపోవడంతో సిబ్బంది వచ్చి అడిగారు. తర్వాత ఏమైందో ఏమో.. తాను గోదావరిలో దూకి, చనిపోతున్నట్లు తండ్రికి ఫోన్‌ చేసి చెప్పాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పెద్దేవానికి చెందిన కొడమంచిలి శివకుమార్‌(30) 2021లో రామచంద్రాపురంలోని ఓ ఫైనాన్స్‌ కంపెనీలో పని చేసేవారు. ఆ తర్వాత గ్రామానికి వచ్చి వ్యవసాయం చేసుకునేవారు. కుటుంబ అవసరాల కోసం క్రెడిట్‌ కార్డు ద్వారా రుణం తీసుకున్నారు. అది తీర్చకపోవడంతో ఈనెల 19న బ్యాంకు సిబ్బంది వచ్చి అడిగారు.

ఆ తర్వాత ఇంట్లో ఎవరికీ చెప్పకుండా మంగళవారం అర్ధరాత్రి రోడ్‌కం రైలు వంతెనపైకి వచ్చారు. 12.30ల సమయంలో తండ్రి కొండయ్యకు ఫోన్‌ చేసి గోదావరిలోకి దూకేస్తున్నట్లు చెప్పారు. వంతెన 115వ స్తంభం వద్ద శివ కుమార్‌ ద్విచక్ర వాహనం, చరవాణి, చెప్పులను గుర్తించారు. ఈ ఘటనపై భార్య తులసి బుధవారం ఫిర్యాదు చేశారు. ఆ మేరకు గల్లంతైనట్లు కేసు నమోదు చేశామని హెడ్‌ కానిస్టేబుల్‌ పి.రామకృష్ణ తెలిపారు.

పశ్చిమ గోదావరిలో.. ఆన్​లైన్ యాప్​లో రుణం తీసుకుని చెల్లించినా.. ఆ సంస్థ నిర్వాహకులు ఫోన్​లో వేధించడంతో తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం లక్ష్మణేశ్వరంలో చోటుచేసుకుంది. లక్ష్మణేశ్వరం గ్రామానికి చెందిన భోగిరెడ్డి గిరిప్రసాద్(26) ఎంబీఏ చదివి హైదరాబాద్​లో సాప్ట్​వేర్ ఉద్యోగిగా చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం ఓ యాప్​లో కొంత రుణం తీసుకున్నాడు.

పలు పర్యాయలుగా అధిక మొత్తం వడ్డీ చెల్లించి అప్పు తీర్చినా.. యాప్ నిర్వాహకులు వేధించడం ప్రారంభించారు. విషయం యువకుడు ఉద్యోగం చేస్తున్న కంపెనీకి తెలియడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. ఇటీవల ఇంటికి చేరుకున్న యువకుడికి వేధింపులు మరింత ఎక్కువవ్వటంతో.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబానికి ఆధారమైన ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

ఇవీ చూడండి..:

సీఎం సొంత జిల్లాలో దారుణం.. ట్రాన్స్ జెండర్​పై 15మంది అత్యాచారం

భారీ కటౌట్స్‌, డ్యాన్స్‌లు.. ట్రైలర్‌ వేడుకలో కేక పుట్టించిన 'లైగర్'​​ ఫ్యాన్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.