ETV Bharat / crime

ఇద్దరి ప్రాణాల్ని బలిగొన్న భూగర్భ డ్రైనేజీ

author img

By

Published : Mar 27, 2021, 8:03 PM IST

drainage deaths, miryalaguda news
భూగర్భ డ్రైనేజీలో మృతి, మిర్యాలగూడ వార్తలు

నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం చోటుచేసుకుంది. భూగర్భ డ్రైనేజీ ఇద్దరి ప్రాణాల్ని బలి తీసుకుంది. డ్రైనేజీలోకి దిగిన బాలుడిని కాపాడి.. చివరకు ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. తోటి కార్మికులు, 108, అగ్నిమాపక సిబ్బంది సాయంతో ఎంత ప్రయత్నించినా వారి ప్రాణాలని కాపాడలేకపోయారు.

మిర్యాలగూడ పట్టణం చైతన్యనగర్ రోడ్ నెంబర్ 10 లో భూగర్భ డ్రైనేజీ కాలువలో పడి.. విషవాయువులు పీల్చి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతులు యాద్గార్​పల్లి గ్రామానికి చెందిన కుంచెం శ్రీనివాస్, దొండవారి గూడేనికి చెందిన సూపర్​వైజర్ పాశం సంతోశ్​ రెడ్డిగా గుర్తించారు.

కుంచెం శ్రీను అనే బాలుడు డ్రైనేజీలోకి దిగి పనిచేస్తుండగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. అతనిని కాపాడడానికి సూపర్​వైజర్ సంతోశ్​ రెడ్డి, మరోవ్యక్తి కుంచెం శ్రీనివాసులు ప్రయత్నించి బాలుడిని పైకి లాగారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఇద్దరు డ్రైనేజీలో పడిపోయారు. విషవాయువుల వల్ల ఊపిరాడక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

పరిస్థితి గమనించిన తోటి కార్మికులు, స్థానికులు, 108, అగ్నిమాపక సిబ్బంది సాయంతో బయటకు తీశారు. చికిత్స కోసం స్థానిక ప్రైవేట్​ ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందారని తెలిపారు. ఇద్దరు వ్యక్తుల మరణంతో వారి వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: సీఎం పీఏనంటూ నమ్మబలికి.. రూ.15 లక్షలు దండుకున్నాడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.