ETV Bharat / crime

Murders Due to Alcohol : తప్ప తాగుతున్నారు.. విచక్షణ కోల్పోయి చంపుతున్నారు

author img

By

Published : Dec 30, 2021, 8:37 AM IST

Murders Due to Alcohol : మద్యం మత్తు విచక్షణను చంపేసి, క్రూరత్వాన్ని, శత్రుత్వాన్ని పెంచేస్తోంది. వెరసి మైకం కొందరిలో నేర ప్రవృత్తిని పెంచుతోంది. మామూలుగా ఉన్నప్పుడు మంచివాళ్లుగా ఉండే కొందరు చుక్కపడగానే ‘తేనె పూసిన కత్తుల్లా’ మారుతున్నారు. అత్యాచారాలు, హత్యలు సహా పలు నేరాలకు పాల్పడుతున్నారు. తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిలో మూడొంతుల మంది మద్యం తాగినవారే ఉంటున్నారని పోలీసులే చెబుతున్నారు.

Murders Due to Alcohol
Murders Due to Alcohol

  • Murders Due to Alcohol : పక్షవాతంతో కదల్లేని స్థితిలో ఉన్న తల్లి ఎదుటే మద్యం మత్తులో అన్నదమ్ములు గొడవపడ్డారు. తమ్ముడు చేసిన దాడిలో అన్న మృత్యువాతపడ్డాడు. మరింత ఘోరం ఏమిటంటే తాగిన మైకంలో ఉన్న ఆ వ్యక్తి సోదరుడు మరణించిన విషయాన్ని కూడా గుర్తించలేక అక్కడే నిద్రపోయాడు. ఉదయం మత్తు దిగాక జరిగిన ఘోరాన్ని గుర్తించి పరారయ్యాడు. ఆ తల్లి మాత్రం కళ్లెదుటే జరిగిన దారుణాన్ని చూసి రాత్రంతా కన్నీళ్లు కారుస్తూ మౌనసాక్షిగా ఉండిపోయారు. మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగిందీ ఘటన.
  • Crime Due to Alcohol : మామతో గొడవ పెట్టుకున్న పరమేశ్వరి అనే మహిళ మద్యం మత్తులో క్రూరంగా మారింది. రెండేళ్ల కన్నబిడ్డ ధనుష్‌ గొంతు నులిమి చంపింది. చేవెళ్ల సమీపంలోని రామన్నగూడ గ్రామంలో ఇటీవల జరిగిందీ ఘటన.
  • Alcohol Related Crimes : అల్లరి చేస్తున్నాడని ఎనిమిదేళ్ల కన్న బిడ్డను కర్రతో చితకబాదాడు మద్యం మత్తు తలకెక్కిన ఓ తండ్రి. దీన్ని వీడియోలో చిత్రీకరించి పైశాచిక ఆనందం పొందాడు కూడా. చత్రినాక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఘటనపై కేసు నమోదైంది.

Alcohol Related Crimes in Telangana :మద్యపానం సమాజానికి రెండు విధాలుగా నష్టంచేస్తోంది. ఆరోగ్యం దెబ్బతినడం అటుంచి ఎవర్నయినా హత్య చేయాలంటే ముందు సదరు వ్యక్తికి మద్యం తాగిస్తున్నారు. మత్తులో ఉండగా చంపేస్తున్నారు. ముఖ్యంగా వివాహేతర సంబంధాలు, ఆస్తి వివాదాలు, వ్యాపార లావాదేవీల విషయాల్లో ఇలాంటివి జరుగుతున్నాయి. ‘‘మద్యం తాగితే ప్రతిఘటించే శక్తి సన్నగిల్లుతుంది. ప్రత్యర్థులు దీన్ని ఆయుధంగా చేసుకుని హత్యలకు పాల్పడుతున్నారు’ అని పోలీసులు విశ్లేషిస్తున్నారు.

హత్యలే కాదు..ఆత్మహత్యలూ పెరుగుతున్నాయ్‌

Alcohol Related Murders in Telangana : తాగుడు వ్యసనం మనసుపై తీవ్ర ప్రభావం చూపుతుందని, మంచీచెడుల మధ్య విచక్షణను నశింపజేస్తుందని ఎదుటివారిని చంపే లేదా చచ్చే తెగింపును తెచ్చిపెడుతుందని పలు అధ్యయనాలు తేల్చాయి. ‘‘మద్యపానం వల్ల దేశంలో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని, 2018లో 7,193 మంది ఈ కారణంలో ఆత్మహత్య చేసుకోగా 2020 నాటికి ఇవి 9,169కి పెరిగాయని’’ జాతీయ నేరాల నమోదు సంస్థ (ఎన్‌సీఆర్బీ) ఇటీవల విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. మామూలు సమయంలో ప్రాణం తీసుకునేందుకు వెనకాడే వ్యక్తి, మద్యం తాగిన తర్వాత మొండి ధైర్యంతో ముందుకు వెళతాడని, ఆత్మహత్యలకు ఇదే కారణంగా కన్పిస్తోందని ఎన్‌సీఆర్బీ తన విశ్లేషణలో పేర్కొంది. ఇదే సూత్రం ఇతర నేరాలకూ వర్తిస్తోంది.

లైంగిక నేరాల్లోనూ ఇదే కీలకం

Murders due to Alcohol in Telangana : రాష్ట్రంలో సంచలనమైన ‘దిశ’ ఉదంతం, ఆసిఫాబాద్‌లో సమతపై అత్యాచారం, సెప్టెంబరు నెలలో హైదరాబాద్‌ నగరంలోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన హత్యాచారం వంటివన్నీ మద్యం మత్తులో జరిగినవే. మత్తులో ఏంచేస్తున్నారో తెలియని స్థితిలో ఉన్మాదులు చిన్నారులనూ వదిలిపెట్టడంలేదు. రాష్ట్రంలో ఏడాది కాలంలో చిన్నారులపై జరిగిన అఘాయిత్యాఅన్నీ మద్యం మత్తులో ఉన్న వ్యక్తుల వల్లనే జరిగినట్టు పోలీసుల విచారణలో తేలింది.

తొలి ముద్దాయి మద్యమే

Crimes Due to Alcohol Consumption : 'గృహహింసపై నమోదవుతున్న కేసుల్లో తొలిముద్దాయి మద్యమే. ఎక్కువ మంది బాధితురాళ్లు ఇదే విషయమై ఫిర్యాదు చేస్తున్నారు. మత్తు ఎక్కువైనప్పుడే తమను హింసిస్తున్నారని చెబుతున్నారు. వరకట్న వేధింపులు, అనుమానాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉంటున్నాయి.'

- మహేశ్‌ భగవత్‌, రాచకొండ కమిషనర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.