ETV Bharat / crime

గుర్తు పెట్టుకోండి.. అంధ విశ్వాసాలు మిగిల్చేది.. విషాదాలే!

author img

By

Published : Jan 26, 2021, 5:10 PM IST

చనిపోయిన వాళ్లు మళ్లీ బతుకుతారా? పూజలు చేస్తే.. పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా..? ఈ ప్రశ్నలు ఎవరిని అడిగినా... అసాధ్యమనే అంటారు. ఈ విషయం ఆ దంపతులకు తెలియకుండా పోయింది. అత్యంత నిష్ఠతో, భక్తితో పూజలు చేస్తే... చనిపోయిన వారిని బతికించొచ్చని గుడ్డిగా నమ్మారు. ఈ మూఢ విశ్వాసంతోనే సొంత పిల్లల్నే దారుణంగా హత మార్చారు. ఈ ఘటనతో దురాచారాలు ఏ స్థాయిలో ఉన్నాయో రుజువు చేసింది. అంధ విశ్వాసాలు మిగిల్చేది.. విషాదమేనని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది.

madanapally incident
madanapally incident

గుర్తు పెట్టుకోండి.. అంధ విశ్వాసాలు మిగిల్చేది.. విషాదాలే!

వాళ్లిద్దరూ విద్యావంతులు. పది మందికి.. మంచి చెడు చెప్పాల్సిన బాధ్యత గల స్థానంలో ఉన్నారు. పిల్లలకు విద్యాబుద్ధులు అందించాల్సిన వృత్తి వారిది. ఈ హోదా, విచక్షణ ఏదీ... మూఢ నమ్మకాల ముందు నిలవలేదు. ఇప్పుడున్న ప్రశాంత జీవితాన్ని కాదని... ఇంకేదో కావాలని అత్యంత దారుణంగా... కన్న పిల్లల్నే చంపుకొన్నారు ఆ దంపతులు. క్షుద్ర పూజలు చేసి ఈ అకృత్యానికి పాల్పడ్డారు. చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణ మండలం అంకిశెట్టిపల్లె పంచాయతీ శివనగర్‌లో ఆదివారం రాత్రి వెలుగు చూసిన ఈ అమానుష ఘటన కలకలం రేపింది. మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా మూఢనమ్మకాలు, ఆ పేరున సాగే దారుణాలు... అంతకంటే ఒక మెట్టు పైనే ఉంటాయని మరోసారి నిరూపించింది... ఈ దారుణం.

మంత్రాలకు బలి!

ఆ తండ్రి సాధారణ వ్యక్తి కూడా కాదు. మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వైస్‌ ప్రిన్సిపల్‌గా పని చేస్తున్నారు.. నిందితుడు ఎన్‌.పురుషోత్తంనాయుడు. భార్య పద్మజ ఓ విద్యాసంస్థ కరస్పాండెంట్‌, ప్రిన్సిపల్‌. పిల్లలు కూడా మంచి విద్యావంతులే. పెద్దమ్మాయి అలేఖ్య, చిన్నమ్మాయి సాయిదివ్య. పెద్దామె భోపాల్‌లో పీజీ చేస్తుండగా.. చిన్నామె బీబీఏ చేసి ఏఆర్‌ రెహమాన్‌ మ్యూజిక్‌ అకాడమీలో సంగీతం నేర్చుకుంటోంది. గతేడాది ఆగస్టులోనే కొత్తగా కట్టుకున్న ఇంట్లోకి వచ్చారు. ఇలా సాఫీగా సాగిపోతున్న వారి జీవితాలను ఒక్కసారిగా తలకిందులు చేశాయి... మూఢనమ్మకాలు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తెలను... అవన్నీ మరిచి నిర్థయగా మంత్రాలకు బలి ఇచ్చారు ఆ తల్లిదండ్రులు.

శూలంతో పొడిచి.. చెంబుతో కొట్టి

నిజానికి వాళ్లు ఇలా పూజలు చేయటం ఇదే మొదటిసారి కాదు. ఇంట్లోకి వచ్చినప్పటి నుంచీ... తరచూ పూజలు చేసేవారని స్థానికులు చెబుతున్నారు. అలానే ఆదివారం రాత్రి కూడా ఇంట్లో పూజలు నిర్వహించారు. కానీ ఈసారి మూఢత్వం మరింత పతాకస్థాయికి చేరింది. అంత చదువుకున్న ఆ కన్నవారు ఎలా ఈ ఘాతుకానికి ఒడిగట్టారు? మంచి చదువులు చదువుకున్న ఆ పిల్లలు మాత్రం వారి చర్యలను ఎలా అంగీకరించారు? అసలు వాళ్లను ఆ మానసిక ఉన్మాదస్థితికి తీసుకుని వెళ్లిన వ్యక్తులు ఎవరు? పరిస్థితులు ఏమిటి? ఇవన్నీ ఎలా ఉన్నా రెండు నిండు ప్రాణాలు అన్యాయంగా బలి అయిపోయాయి. మొదట చిన్న కుమార్తె సాయిదివ్యను శూలంతో పొడిచి చంపారు. తర్వాత పెద్దకుమార్తె అలేఖ్య నోటిలో రాగి చెంబు పెట్టి డంబెల్‌తో కొట్టి హతమార్చారు.

దైవభక్తిలో లీనమై..

విషయాన్ని పురుషోత్తం నాయుడు తాను పనిచేసే కళాశాలలో ఓ అధ్యాపకుడికి ఫోన్‌ చేసి మరీ చెప్పాడు. ఆయన ఇంటి వద్దకు చేరుకుని పరిస్థితి గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మదనపల్లె డీఎస్పీ సహా.. పలువురు పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇక్కడే విస్తుగొలిపే విషయాలు కొన్ని వెలుగుచూశాయి. హత్యకు గురైన పిల్లలు, చంపిన తల్లిదండ్రులు...పూర్తిగా దైవభక్తిలో లీనమై పోయారని, వారు తమ బిడ్డలు మళ్లీ బతుకుతారని చంపేసినట్లు ప్రాథమికంగా తేలింది. పద్మజ బిడ్డలను కొట్టి చంపినట్లు, ఈ ఘటన జరిగినప్పుడు తండ్రి పురుషోత్తం నాయుడు కూడా అక్కడే ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. వారిద్దరూ మానసికంగా సతమతమవుతున్నట్లు గుర్తించారు పోలీసులు.

'శివ ఈజ్ కమ్.. వర్క్ ఈజ్ డన్'

తల్లిదండ్రులిద్దరూ బాగా చదువుకుని విద్యాసంస్థల్లో పని చేస్తున్నారు. మంత్ర తంత్రాలకు అలవాటు పడి ఇలా.. పిల్లల్నే పొట్టన పెట్టుకున్నారు. ఈ జంట హత్యల ఘటనకు సంబంధించి పోలీసుల విచారణలో మరికొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతుల్లో ఒకరైన సాయిదివ్య...మూడు రోజుల కిందట సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినట్లు విచారణలో తేలింది. "శివ ఈజ్‌ కమ్..వర్క్‌ ఈజ్ డన్" అంటూ పెట్టిన పోస్టులు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వ్యక్తులు వచ్చి తరచూ ఘటన జరిగిన ఇంట్లో పూజలు చేసేవారని పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు...సీసీ టీవీ దృశ్యాలు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే మృతుల తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇంట్లోనే ఉంచి విచారణ చేపడుతున్నారు.

తననూ చంపాలని కోరింది

ఆ ఇంట్లో దేవుళ్లతో పాటు అనుమానాస్పదంగా ఉన్న ఫొటోలను పోలీసులు గమనించారు. నిందితులకు వైద్య పరీక్షలు చేసిన తర్వాత వైద్యుల సలహాతోనే వారిని అరెస్టు చేస్తామని చెబుతున్నారు. ఘటనకు గల ఆధారాలు సేకరించేందుకు క్లూస్‌ టీం చిత్తూరు నుంచి మదనపల్లె బయల్దేరింది. మృతదేహాలను మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే.. ఈ జంట హత్యల కేసులో విచారణ జరుపుతున్న కొద్ది కొత్త విషయాలు వెల్లడవుతున్నాయి. పోలీసుల విచారణలో తల్లిదండ్రులు కొన్ని కీలక విషయాలు తెలిపారు. చిన్నకుమార్తెను పెద్ద కుమార్తె అలేఖ్య హతమార్చిందని.. చిన్న కుమార్తె హత్య తర్వాత తననూ చంపాలని అలేఖ్య తల్లిని కోరిందని...ఆమె చెప్పినట్లు తాము చేసినట్టు తల్లిదండ్రులు చెబుతున్నారు. పూర్తిస్థాయి విచారణ తర్వాతే వివరాలు వెల్లడిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.

తరచూ పూజలు

ఈ ఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురి చేసినా... పురుషోత్తం నాయుడు, పద్మజ దంపతులు ఇంత దారుణానికి ఒడిగట్టారన్న నిజాన్ని వాళ్లు ఇంకా నమ్మలేకపోతున్నారు. పేద పిల్లలకు సహకారం అందించటంలో ముందుండే వారని చెబుతున్నారు. ప్రాథమిక విచారణ ప్రకారం... తమ పిల్లలు బతికి వస్తారన్న నమ్మకంతోనే దంపతులు ఇలా చేసినట్టు తెలుస్తోంది. ఇంట్లో తరచూ పూజలు నిర్వహించిన మాట నిజమే అయినా.. వారి భక్తి మరీ ఇంత మూఢంగా మారుతుందని ఎవరూ ఊహించలేదు. అంతా జరిగిపోయాక..ఇప్పుడు వారిద్దరూ పశ్చాత్తాపానికి గురవుతున్నారు.

ఇదీ చదవండి: ఆ అక్కాచెల్లెళ్లకు ముందే తెలుసా చనిపోతున్నామని?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.