ETV Bharat / crime

Fire Accident in Timber Depot : టింబర్‌ డిపోలో ఘోర అగ్నిప్రమాదం.. 11 మంది మృతి

author img

By

Published : Mar 23, 2022, 7:05 AM IST

Updated : Mar 23, 2022, 11:42 AM IST

Fire Accident in Timber Depot
Fire Accident in Timber Depot

07:01 March 23

బోయగూడలో టింబర్‌ డిపోలో అగ్నిప్రమాదం

బోయగూడలో టింబర్‌ డిపోలో అగ్నిప్రమాదం

Fire Accident at Boyaguda Today : బతుకుదెరువు కోసం పొట్ట చేతపట్టుకుని వలస వచ్చారు. కానీ వాళ్ల బతుకులు బుగ్గిపాలవుతాయని ఊహించలేదు. కుటుంబాన్ని పోషించుకోవడానికి రాత్రింబవళ్లు రెక్కలు ముక్కలు చేసుకుని శ్రమించారు. ఇలా ఓ ప్రమాదం వారి శ్రమతో పాటు వాళ్లను కూడా బూడిద చేసి.. వారి కుటుంబాలను రోడ్డున పడేస్తుందని అనుకోలేదు. పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వడం కోసం ఎండనక.. వాననక కష్టపడ్డారు. కానీ వారితో పాటు వారి పిల్లల జీవితాలు కూడా అగ్గిలో బూడిదవుతాయని ఆలోచించలేకపోయారు. రాత్రంతా కష్టపడి.. రేపటి మీద ఆశతో.. రెట్టింపు కష్టపడాలని ఆలోచిస్తూ.. జీవితం గురించి కలలు కంటూ నిద్రపోయిన వాళ్లంతా.. అదే వారికి ఆఖరి రాత్రి అవుతుందని ఊహించలేకపోయారు. తెల్లవారుజామున సికింద్రాబాద్ బోయగూడ టింబర్‌డిపోలో జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది బిహార్ కార్మికులు అక్కడికక్కడే బూడిదయ్యారు.

Fire Accident in Timber Depot : సికింద్రాబాద్ బోయగూడలో తెల్లవారుజామున 4 గంటలకు ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ భవనంలోని తుక్కు గోదాములో మంటలు చెలరేగి.. పైనున్న టింబర్‌ డిపోకు వ్యాపించాయి. డిపో నిండా కట్టెలు ఉండటం వల్ల మంటలు వేగంగా వ్యాపించి అక్కడే నిద్రిస్తున్న 11 మంది కార్మికులు మృతి చెందారు. ఇందులో కొంత మంది సజీవదహనం కాగా.. మరికొంత మంది పొగతో ఊపిరాడక చనిపోయారు.

ఘటన జరిగిన సమయంలో టింబర్ డిపోలో 12 మంది కార్మికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారిలో ఓ వ్యక్తి మంటలు వ్యాపించగానే అప్రమత్తమై భవనంపై నుంచి దూకాడాని చెప్పారు. ఆ విధంగా మంటల నుంచి సురక్షితంగా బయటపడ్డాడని వెల్లడించారు. భవనంపై నుంచి దూకడం వల్ల గాయపడిన ఆ వ్యక్తికి వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. మృతులంతా బిహార్‌కు చెందిన వలస కార్మికులను పోలీసులు పేర్కొన్నారు.

స్క్రాప్ గోదాము నుంచి టింబర్ డిపోకు..

Boyaguda Fire Accident : స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన భవనంలో టింబర్ డిపో, స్క్రాప్ గోదాం ఉండటం వల్ల తుక్కు గోదాము నుంచి మంటలు టింబర్ డిపోకు వ్యాపించినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఐదు ఫైరింజన్లతో మంటలు ఆర్పినట్లు వెల్లడించారు. దట్టంగా వ్యాపించిన పొగ వల్ల మృతదేహాల వెలికితీతలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. మృతదేహాలు గుర్తించలేని స్థితిలో ఉన్నాయని అన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు.

ఎయిర్ అంబులెన్స్‌లో స్వస్థలాలకు మృతదేహాలు

బోయగూడ అగ్నిప్రమాద స్థలిని హోంమంత్రి పరిశీలించారు. గాంధీ మార్చురీలో మృతదేహాల గుర్తింపు జరుగుతోందని తెలిపారు. ఇప్పటికే ఆరుగురి మృతదేహాల గుర్తింపు పూర్తైందని చెప్పారు. ఇంకా ఐదుగురి మృతదేహాల గుర్తింపు జరగాల్సి ఉందని అన్నారు. మృతదేహాలను ఎయిర్ అంబులెన్స్‌లో స్వస్థలాలకు పంపిస్తామని వెల్లడించారు. అనధికరికంగా ఉన్న గోదాంలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

గుర్తుపట్టలేనంత కాలిపోయాయి..

Boyaguda Fire Accident News : 11 మంది మృతదేహాలు సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఆస్పత్రి వద్ద అదనపు బలగాలతో పోలీసులు భారీ బందో బస్తు నిర్వహించారు. అగ్నిప్రమాద మృతుల్లో ఇద్దరు మినహా మిగతా వాళ్లు మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలి పోయాయని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాజారావు తెలిపారు. నాలుగు బృందాలను ఏర్పాటు చేసి పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నామని చెప్పారు.

మృతులంతా యువకులే..

మృతులు సికిందర్‌‍‌(40), బిట్టు(23), సత్యేందర్‌(35), గోలు(28), దామోదర్‌‍‌(27), రాజేశ్‌‍‌(25), దినేశ్‌(35), రాజేశ్‌(25), చింటు(27), దీపక్‌(26), పంకజ్‌(26)గా గుర్తింపు.

బాధిత కుటుంబాలకు మంత్రి తలసాని భరోసా..

Boyaguda Fire Accident Updates : అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాన్ని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. ప్రమాదంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై విచారణకు పోలీసులను ఆదేశించినట్లు తలసాని తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసా కల్పించారు.

ప్రమాదస్థలిని హైదరాబాద్ కలెక్టర్ శర్మన్‌తో పాటు సీపీ సీవీ ఆనంద్ పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగిందోనని ఆరా తీశారు. ఘటనపై వీలైంత త్వరగా విచారణ చేసి పూర్తి వివరాలు అందిస్తామని తెలిపారు.

"సమాచారం అందగానే అధికారులు స్పందించారు. కింద ఫ్లోర్‌లో తుక్కు సామాను వల్ల ప్రమాద తీవ్రత పెరిగింది. కార్మికులంతా నిద్రలో ఉన్నప్పుడు అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇద్దరు యువకులు పైనుంచి దూకి ప్రాణాలు రక్షించుకున్నారు. గోదాముకు ఎలాంటి అనుమతులు లేవు. గోదాం విషయంలో నిబంధనలు పాటించలేదు. గోదాంలో ప్రమాద నివారణ చర్యలు ఏమీ లేవు. ఘటనపై దర్యాప్తు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తాం."

- సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ

Last Updated :Mar 23, 2022, 11:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.