ETV Bharat / crime

చోరీ జరిగి ఏడాది.. నేరస్థుల జాడేది!

author img

By

Published : Jul 28, 2022, 11:47 AM IST

సైబర్‌ నేరస్థులు
సైబర్‌ నేరస్థులు

రాష్ట్రంలో ఏడు నెలల వ్యవధిలో హైదరాబాద్​లోని రెండు బ్యాంకుల నుంచి దాదాపు రూ.14కోట్లు సైబర్‌ నేరస్థులు కొలగొట్టారు. ఇప్పటి వరకూ వారు ఎవరన్నది తేలలేదు. భద్రతా వ్యవస్థలో లోపాలతోనే బ్యాంకుల నుంచి రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. కానీ వారి ఉనికి బయటపడకుండా నేరస్థులు తీసుకుంటున్న జాగ్రత్తలు పోలీసులను ఆశ్చర్యపరుస్తున్నాయి.

ఈ-దొంగల్ని’ పట్టేదెలా? ఇప్పుడు పోలీసుల శాఖను వేధిస్తున్న ప్రశ్న ఇదే. ఏడు నెలల వ్యవధిలో రాజధాని నగరంలోని రెండు బ్యాంకుల నుంచి దాదాపు రూ.14కోట్లు కొల్లగొట్టిన సైబర్‌ నేరస్థులు ఎవరన్నది తేలలేదు. తెలంగాణ రాష్ట్ర కోపరేటివ్‌ అపెక్స్‌ బ్యాంకులో రూ.1.96 కోట్లు కొల్లగొట్టి ఏడాది దాటినా దళారులు దొరికారు.. అసలు నేరస్థులు ఎవరన్నది మిస్టరీగానే మిగిలింది. రెండు బ్యాంకుల్ని దోచుకున్న విధానం ఒకేలా ఉండటం, దీనికి పాల్పడ్డ నిందితులు దొరక్కపోవడంతో పోలీసులు ఆందోళన చెందుతున్నారు.

రాష్ట్రంలో సైబర్‌ నేరాల పెరుగుదల మిగతా వాటితో పోల్చుకుంటే వందశాతం పైగానే ఉంటోంది. మాయమాటలతో వ్యక్తిగత ఖాతాల్లో డబ్బు కొల్లగొట్టడం, ఓఎల్‌ఎక్స్‌ మోసాల వంటి వాటి విషయంలో పోలీసులు నిందితులను గుర్తించగలుగుతున్నారు. చాలా కేసులలో అరెస్టు చేయగలుగుతున్నారు. కానీ, బ్యాంకులనే కొల్లగొడుతున్న సైబర్‌ నేరగాళ్లను గుర్తించడంలోనే దర్యాప్తు ముందుకెళ్లడంలేదు. ఇందులో బ్యాంకుల నిర్లక్ష్యం ఉన్నా.. ఉనికి బయటపడకుండా నేరస్థులు తీసుకుంటున్న జాగ్రత్తలు పోలీసులను ఆశ్చర్యపరుస్తున్నాయి.

తెలంగాణ అపెక్స్‌ బ్యాంకు ఉదంతమే ఇందుకు నిదర్శనం. శేరిలింగంపల్లికి చెందిన ఇద్దరు సోదరులతో ఆన్‌లైన్‌లో పరిచయం పెంచుకున్న అజ్ఞాత వ్యక్తులు వారి ద్వారా బ్యాంకు ఖాతాలు తెరిపించారు. వాటి ద్వారా బ్యాంకు సర్వర్‌లోకి చొరబడ్డారు. ఈ సోదరుల ఖాతాలోకి రూ.2 లక్షలు, సికింద్రాబాద్‌లోని మరో ఖాతాలోకి రూ.1.94 లక్షలు మళ్లించారు. మళ్ళీ ఈ రూ.1.94 లక్షలను అక్కడ నుంచి దేశంలోని పది వేరువేరు ఖాతాల్లోకి బదిలీ చేశారు. పోలీసు దర్యాప్తులో బ్యాంకు సర్వర్‌లోకి చొరబడ్డ ఖాతాలను గుర్తించారు.

అజ్ఞాత వ్యక్తి తమకు కమిషన్‌ ఇస్తామంటే వీటిని తెరిచామని, అంతకు మించి తమకేమీ తెలియదని ఆ సోదరులు తెలిపారు. రూ.1.94 లక్షల డబ్బు బదిలీ అయిన ఖాతా నకిలీదని, తప్పుడు పత్రాలతో ఓ మహిళ దీన్ని తెరిచి, డబ్బు కొల్లగొట్టాక పరారయిందని తేలింది. దర్యాప్తులో అంతకు మించిన వివరాలు తెలియలేదు. 2022 జనవరిలో ఇంచుమించు ఇలాగే ఆంధ్రప్రదేశ్‌ మహేష్‌ కోఅపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకు ఖాతా నుంచి ఏకంగా రూ.12కోట్లు కొల్లగొట్టారు. దర్యాప్తులో దళారులు దొరికారు తప్ప అసలు దొంగలు ఎవరన్నది తెలియలేదు.

ఎందుకిలా: ఏదైనా నేరం జరిగినప్పుడు నేరస్థులను పట్టుకొని శిక్షించినప్పుడే ప్రజలకు భరోసా ఉంటుంది. కానీ, రూ.కోట్లు కొల్లగొడుతున్న సైబర్‌ నేరస్థులు ఎవరన్నది కూడా పోలీసులు తెలుసుకోలేకపోవడం చర్చనీయాంశంగా మారింది. చాలా సైబర్‌ నేరాల్లో నేరస్థులు దొరక్కపోయినా వారు ఎవరన్నది తెలుసుకోలుగుతున్నారు. ఇక్కడి బ్యాంకుల్లో ఉపయోగిస్తున్న సాఫ్ట్‌వేర్‌, వాటిలోని లోపాలను గుర్తించి మరీ దోచుకుంటున్నారు. ఆందోళన రేకెత్తిస్తున్న అంశం ఇదే.

నిజానికి తెలంగాణ అపెక్స్‌ బ్యాంకు, మహేష్‌ కోఅపరేటివ్‌ బ్యాంకు దోపిడీలకు మధ్య ఇంకో ప్రైవేటు బ్యాంకు నుంచీ దాదాపు రూ.40 లక్షలు కొల్లగొట్టారు. ఈ మూడు బ్యాంకుల్లో నేరం జరిగిన తీరును బట్టి వీటికి పాల్పడిన ముఠా ఒక్కటే అని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. పోలీసులు, బ్యాంకుల దృష్టి మళ్లించేందుకే నేరస్థులు కావాలనే కొంత కాలం మిన్నకుంటున్నారని, ఈలోపు బ్యాంకుల సైబర్‌ భద్రత వ్యవస్థను పరిశీలిస్తున్నారని, బలహీనంగా ఉన్న బ్యాంకులను ఎంచుకుంటున్నారని ఓ అధికారి వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.