ETV Bharat / crime

Car crash: పెళ్లింట విషాదం నింపిన 'కారు గల్లంతు' ఘటన

author img

By

Published : Aug 30, 2021, 6:04 PM IST

Updated : Aug 30, 2021, 9:41 PM IST

Car crash: పెళ్లింట విషాదం నింపిన 'కారు గల్లంతు' ఘటన
Car crash: పెళ్లింట విషాదం నింపిన 'కారు గల్లంతు' ఘటన

18:02 August 30

Car crash: పెళ్లింట విషాదం నింపిన 'కారు గల్లంతు' ఘటన

Car crash: పెళ్లింట విషాదం నింపిన 'కారు గల్లంతు' ఘటన

వికారాబాద్ జిల్లాలో ఓ పెళ్లి ఇంట తీరని విషాదం అలుముకుంది. కొత్తజంట ప్రయాణిస్తున్న కారు కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో వరుడు, అతని అక్క ప్రాణాలతో బయటపడగా.. నవ వధువు సహా వరుడి మరో అక్క మృతదేహం 4 కిలోమీటర్ల దూరంలో లభ్యమయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న వరుడి మేనల్లుడు, డ్రైవర్ గల్లంతయ్యారు. అయితే గల్లంతైన డ్రైవర్ బతికే ఉన్నాడని పోలీసులు తెలిపారు. వరుడి మేనల్లుడి కోసం ఇంకా గాలింపు కొనసాగుతోంది.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వికారాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మోమిన్​పేట-మర్పల్లి మండలాల మధ్య తిమ్మాపూర్ వద్ద నిన్న రాత్రి వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో ఆ దారిలో వెళ్తున్న కారు వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. ఘటనలో ఓ నవ వధువు సహా మరో ముగ్గురు గల్లంతయ్యారు.

రావులపల్లికి చెందిన నవాజ్​రెడ్డి అనే వ్యక్తికి మోమిన్​పేటకు చెందిన ప్రవల్లికతో ఈ నెల 26న వివాహం జరిగింది.  విందు కోసం మోమిన్​పేటకు వెళ్లిన కుటుంబసభ్యులు.. వేడుకలు పూర్తి చేసుకొని తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో కారులో కొత్తజంట నవాజ్​రెడ్డి, ప్రవల్లికతోపాటు నవాజ్​రెడ్డి అక్కలు శ్వేత, రాధమ్మ, శ్వేత కుమారుడు త్రిశాంత్​రెడ్డి ఉన్నారు. నవాజ్​రెడ్డి బంధువు రాఘవేందర్ రెడ్డి కారు నడుపుతున్నాడు. ఇంకా గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరం ఉండగా తిమ్మాపూర్ వద్ద కల్వర్టుపై వాగు ఉప్పొంగింది. అయితే వాగు ఉద్ధృతిని తేలిగ్గా తీసుకున్న డ్రైవర్ రాఘవేందర్ రెడ్డి.. కారును ముందుకుపోనిచ్చారు. కల్వర్టు మధ్యలో ఒక్కసారిగా కారు ఆగిపోయింది. వరద ఉద్ధృతి మరింత పెరగడంతో కారు వాగులోకి కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో నవాజ్​రెడ్డితోపాటు అతని పెద్ద అక్క రాధమ్మ సురక్షితంగా బయటపడగా.. నవాజ్​రెడ్డి మరో సోదరి శ్వేత, ఆమె కుమారుడు త్రిశాంత్​రెడ్డి, నవ వధువు ప్రవల్లిక, డ్రైవర్ రాఘవేందర్​రెడ్డి గల్లంతయ్యారు.

ఇద్దరి మృతదేహాలు లభ్యం..

విషయం తెలుసుకున్న సమీప గ్రామస్థులు, కుటుంబసభ్యులు, పోలీసులు ఉదయం వాగు వద్దకు చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. కల్వర్టు నుంచి 4 కిలోమీటర్ల దూరంలో కారు, నవాజ్​రెడ్డి సోదరి శ్వేత, నవాజ్​రెడ్డి భార్య ప్రవల్లిక మృతదేహాలు లభ్యమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ సహాయక చర్యల్లో పాల్గొని బాధిత కుటుంబాలను పరామర్శించారు. వాగు పరివాహక ప్రాంతంలో నాలుగు కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లి మృతదేహాలను మోసుకొచ్చారు. ప్రవల్లిక, శ్వేత మృతదేహాలను మర్పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.

డ్రైవర్​ సురక్షితం..

మిగతా ఇద్దరి కోసం పోలీసులు, కోటిపల్లి ప్రాజెక్టులో పనిచేసే మత్స్యకారులు గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం వరకు గాలించినా వారి ఆచూకీ దొరకలేదు. అయితే అనూహ్యంగా డ్రైవర్ రాఘవేందర్ రెడ్డి బతికే ఉన్నాడని పోలీసులు తెలిపారు. వరదలో కొట్టుకుపోయిన రాఘవేందర్ చెట్టు కొమ్మను పట్టుకొని సురక్షింతగా బయటపడ్డాడని.. తెల్లవారు జామున 5 గంటలకు ఇంటికి చేరుకున్నట్లు వికారాబాద్ డీఎస్పీ సంజీవరావు తెలిపారు. గల్లంతైన బాలుడు త్రిశాంత్ రెడ్డి ఆచూకీ మాత్రం ఇంకా లభ్యం కాలేదని ప్రకటించారు.

రక్షణ చర్యలు లేకపోవడంతోనే..

వధువు కాళ్ల పారాణి ఆరకముందే పెళ్లింట విషాదం నెలకొనడంతో.. మోమిన్ పేట, రావులపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి కారణమైన కల్వర్టుల వద్ద రక్షణ చర్యలు లేకపోవడంతో తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని సమీప గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: వాగులో కారు గల్లంతు... వధువుతో పాటు మరో ఇద్దరి మృతదేహాలు లభ్యం

Last Updated :Aug 30, 2021, 9:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.