ETV Bharat / crime

వాగులో కారు గల్లంతు... వధువుతో పాటు మరో ఇద్దరి మృతదేహాలు లభ్యం

author img

By

Published : Aug 30, 2021, 9:06 AM IST

Updated : Aug 30, 2021, 10:59 AM IST

three-bodies-were-found-in-thimmappur-wagu-in-vikarabad-district
వాగులో కారు గల్లంతు... వధువుతో పాటు మరో ఇద్దరి మృతదేహాలు లభ్యం

09:04 August 30

తిమ్మాపూర్ వాగులో ముగ్గురి మృతదేహాల లభ్యం

వాగులో కారు గల్లంతు... వధువుతో పాటు మరో ఇద్దరి మృతదేహాలు లభ్యం

          మూడురోజుల క్రితమే పెళ్లయింది. పెళ్లి పందిళ్లు విప్పకముందే.. కాళ్ల పారాణి ఆరకముందే ఆ పెళ్లిళ్లలో విషాదం నిండింది. ఎంతో ఆనందంగా జరిపించిన వివాహం స్మృతులు ఇంకా మనసులో కదలాడుతుండగానే... ఒడిబియ్యం పోసుకొని నూతన వధూవరులొస్తున్న కారు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. కారులో వధూవరులతో పాటు వరుడి ఇద్దరు అక్కలు, మేనల్లుడు, డ్రైవర్ ఉన్నారు. కొత్తగా వచ్చిన మరదలిని... ఆడపడుచులిద్దరూ ఆటపట్టిస్తూ సరదాగా గడుపుతున్నారు. ఒక్కసారిగా కారు నీటిలోకి వెళ్లిపోయింది. ఏమైందో తెలిసుకునేలోపే వారందరూ నీటిలో మునిగిపోయారు. అదృష్టవశాత్తు వరుడు, ఆమె పెద్ద అక్క ప్రాణాలతో బయటపడ్డారు.  

వాళ్లొచ్చారనే ఆనందం కంటే..

         కొడుకు, కొత్త కోడలు, కూతుళ్లు, మనుమడు వస్తున్న కారు గల్లంతైందని తెలిసి అబ్బాయి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. పెద్ద కూతురు, కుమారుడు బతికే ఉన్నారనే... ఆనందం కంటే చిన్న కూతురు, మనుమడు, కోడలు అందులోనే చిక్కుకుపోయారనే వార్తే వాళ్లని చిత్రవథ చేసింది. కుమిలికుమిలి ఏడుస్తూనే.. నవవధువు తల్లిదండ్రులకు విషయం చెప్పారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురును... ఓ అయ్యచేతిలో పెట్టిన మూడ్రోజులకే ఆమె జీవితం ముగిసిపోవడాన్ని జీర్ణించుకోలేక వెక్కివెక్కి ఏడుస్తున్నారు.

చిన్న వాగే కదా అని దాటబోయి... ప్రవాహంలో కొట్టుకుపోయిన కారు

         వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం రావులపల్లికి చెందిన నవాజ్‌రెడ్డి, మోమిన్‌పేట మండలానికి చెందిన సింగిడి దర్శన్‌రెడ్డి కుమార్తె ప్రవల్లికతో ఈ నెల 26న వివాహం జరిగింది. ఆదివారం ఒడి బియ్యం పోసుకోవడానికి మోమిన్‌పేటకు వచ్చారు. సాయంత్రం నూతన దంపతులతో పాటు పెళ్లి కుమారుడి అక్కలు రాధమ్మ, శ్వేత, శ్వేత కొడుకు ఇషాంత్, డ్రైవర్ రాఘవేందర్‌రెడ్డి రావులపల్లికి కారులో బయలుదేరారు. తిమ్మాపూర్‌ సమీపంలో వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండగా చిన్న వాగే కదా అని ముందుకు సాగారు. నీటి ఉద్ధృతికి కారు వాగులో కొట్టుకుపోయింది. అదృష్టవశాత్తు పెళ్లి కుమారుడు నవాజ్‌రెడ్డి, అతని అక్క రాధమ్మలు కారు డోర్‌ తెరిచుకుని కాలువలోకి దూకారు. వారిని స్థానికులు ఒడ్డుకు చేర్చారు.

ముగ్గురి మృతదేహాల లభ్యం.. బాలుడి కోసం గాలింపు

          గల్లంతైన నలుగురి కోసం పోలీసులు నిన్నటి నుంచి గలిస్తుండగా... ప్రమాద ఘటనకు కిలోమీటరు దూరంలో ఈరోజు ఉదయం కారు లభ్యమైంది. ఆ తర్వాత కాసేపటికి వధువు ప్రవల్లిక, వరుడి సోదరి శ్వేతతో పాటు డ్రైవర్ రాఘవేందర్ రెడ్డి మృతదేహాలు లభ్యమయ్యాయి. బాలుడు ఇషాంత్ కోసం పోలీసులు ఇప్పటికీ గాలిస్తున్నారు. 

ఇదీ చూడండి: వాగు ఉద్ధృతికి కొట్టుకుపోయిన కార్లు.. నవవధువు సహా ఆరుగురు గల్లంతు

Last Updated :Aug 30, 2021, 10:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.