ETV Bharat / crime

విద్యుత్ బిల్లు చెల్లించాలంటూ సందేశం, నమ్మి ఫోన్ చేస్తే

author img

By

Published : Aug 13, 2022, 1:29 PM IST

CYBER FRAUD
CYBER FRAUD

CYBER FRAUD ఓటరు గుర్తింపుకార్డు.. ఆధార్‌ మార్పులు.. బహుమతులు.. వివాహ పరిచయ వేదికలు కావేవీ మోసానికి అనర్హం అన్నట్టుగా సైబర్‌ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త మార్గాలను ఎంచుకొని జనాన్ని తేలికగా బురిడీ కొట్టిస్తున్నారు. కష్టపడి బ్యాంకు ఖాతాల్లోని దాచుకున్న సొమ్మునంతా క్షణాల్లో స్వాహా చేస్తున్నారు. ప్రస్తుతం సైబర్‌ నేరస్తులు విద్యుత్‌ బిల్లులు బకాయిలు చెల్లించాలంటూ మోసాలకు తెరలేపారు. వెంటనే చెల్లించకపోతే రాత్రికి రాత్రే విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తామంటూ బెదిరిస్తున్నారు. ఇదంతా నిజమని భావించి వారు చెప్పినట్టు చేసి కొందరు బ్యాంకు ఖాతాలు గుల్ల చేసుకుంటున్నారు.

CYBER FRAUD: మీరు చెల్లించాల్సిన విద్యుత్‌ బిల్లులు సకాలంలో చెల్లించలేదు. ఒకవేళ చెల్లించినట్టయితే రికార్డుల్లో సర్దుబాటు కాలేదని గమనించాలి. ఈ రోజు రాత్రి 10 గంటల్లోపు బకాయిలు జమ చేయకుంటే విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తాం. పనిఒత్తిడిలో ఉన్నపుడు ఏ మధ్యాహ్నమో.. రాత్రివేళనో చరవాణికి ఇటువంటి సందేశం వస్తే సహజంగానే ఉలిక్కి పడతారు. వర్క్‌ఫ్రంహోం నిబంధనతో ఇంటి వద్ద నుంచే విధులు నిర్వర్తిస్తున్న ఐటీ ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరవుతారు.

ఈ బలహీనతే మాయగాళ్లు అవకాశంగా మార్చుకుంటున్నారు. ఫోన్‌ నెంబర్లకు సందేశం రాగానే బాధితులు బకాయి చెల్లిద్దామనే ఉద్దేశంతో సైబర్‌ నేరస్థులు పంపిన నెంబర్‌కు ఫోన్‌ చేశారో అంతే సంగతులు. ఆన్‌లైన్‌ ద్వారా నగదు చెల్లించే అవకాశం ఉందంటూ నమ్మబలికి మొబైల్‌కు లింకు పంపుతారు. అది క్లిక్‌ చేయగానే టైమ్‌వ్యూయర్, ఎనీడెస్క్‌,క్విక్‌షేర్‌ డౌన్‌లోడ్‌ అవుతాయి. వెంటనే బాధితుల ఆన్‌లైన్‌ లావాదేవీలు మోసగాళ్ల చేతిలోకి చేరతాయి.

బాధితులు నగదు చెల్లింపులకు ఉపయోగించే క్రెడిట్‌, డెబిట్‌కార్డు వివరాలు. ఓటీపీ నెంబర్లు ఎక్కడో ఉన్న మాయగాళ్లు పసిగడుతుంటారు. నగదు జమచేయగానే బాధితుల ఫోన్‌నెంబర్లు బ్యాంకులు పంపే సందేశాలను తొలగిస్తూ జాగ్రత్తపడతారు. బ్యాంకులో ఎంత నగదు నిల్వ ఉందనేది పసిగట్టి సొమ్మంతా కాజేసేంత వరకూ లావాదేవీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌ బేగంపేట్‌కు చెందిన విశ్రాంత ఉద్యోగికి ఇలానే మూడున్నర లక్షలు పోగొట్టుకున్నారు. హబ్సీగూడ వాసి శ్రీనివాస్‌, తార్నాకకు చెందిన శాస్త్రి ఇదే తరహాలో క్విక్‌షేర్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని లక్షన్నర నష్టపోయారు. సైబర్‌ నేరస్తులు దాదాపు పాతిక లక్షలు కొట్టేసినట్టు పోలీసులు తెలిపారు.

కరెంట్‌ బిల్లుల చెల్లింపు విషయంలో విద్యుత్‌శాఖ నుంచి ఫోన్‌నెంబర్లకు ఎలాంటి సందేశాలు రావని గుర్తుంచుకోవాలని సైబర్‌ క్రైం పోలీసులు చెబుతున్నారు. మోసగాళ్లు పంపే లింకులను క్లిక్‌ చేస్తే బ్యాంకు ఖాతా సొమ్మంతా ఊడ్చేస్తారని హెచ్చరిస్తున్నారు. మోసపోయినట్టు గ్రహించగానే డయల్‌ 100,1930 నంబర్లకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.

ఇవీ చదవండి: Singareni: ఉద్యోగాల పేరిట వల.. కోల్‌బెల్టులో దళారుల దందా

ఎమ్మెల్యే అల్లుడి కారు బీభత్సం- ఆరుగురు బలి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.