ETV Bharat / crime

చిట్టీలు కట్టించుకుని ఛీట్​ చేశారు.. రూ.70 లక్షలతో ఉడాయించారు..

author img

By

Published : Oct 17, 2022, 3:44 PM IST

Cheating
Cheating

Cheating in the Name of Mudra Society Chits: ముద్ర పేరుతో సొసైటీ ఏర్పాటు చేశారు. స్థానికులకు మాయమాటలు చెప్పి ఉద్యోగులుగా నియమించుకున్నారు. పబ్లిసిటీ కోసం ప్రజాప్రతినిధులతో సంస్థను ప్రారంభించారు. ఉద్యోగులకు టార్గెట్‌లు పెట్టి.. అధిక సొమ్ము జమయ్యేలా వ్యూహాలు రచించారు. పొదుపు చేయండి.. వడ్డీ కలిపిస్తామంటూ జనాన్ని నమ్మించారు. ప్రజల్లో నమ్మకం కలిగేలా కొందరికి వడ్డీతో కలిపి నగదు ఇచ్చారు. పెద్ద మొత్తంలో జమ అయ్యాక.. కార్యాలయానికి తాళాలేసి ఉడాయించారు. దాదాపు రూ. 70 లక్షలకు పైగా దోచేసిన ఘరానా మోసం.. వరంగల్ జిల్లాలో జరిగింది.

Cheating in the Name of Mudra Society Chits: వరంగల్ జిల్లా పర్వతగిరిలో ముద్ర అగ్రికల్చర్ అండ్‌ స్కిల్ డెవలప్‌మెంట్‌ మల్టీ స్టేట్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ పేరుతో కార్యాలయం ఏర్పాటు చేశారు. స్థానికంగా ఉండేవారిని ఉద్యోగులుగా నియమించుకున్నారు. సంస్థలో నియమించుకున్న వారి నుంచి సెక్యూరిటీ డిపాజిట్‌ పేరుతో రూ.లక్షన్నర వసూలు చేశారు. ఈ ముద్రా సొసైటీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అనుబంధంగా పని చేస్తుందని నమ్మించిన నిర్వాహకులు.. స్థానిక మంత్రి, ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులతో.. ఆర్భాటంగా కార్యాలయాన్ని ప్రారంభించి జనాన్ని ఆకర్షించారు.

చిన్న మొత్తాల్లో పొదుపు చేస్తే అధిక లాభాలుంటాయని ప్రజలను నమ్మించారు. వ్యాపారాలకు రుణాలిస్తామని ప్రకటనలు చేశారు. మండలంలోని 33 గ్రామాలకు చెందిన 640 మంది వద్ద రోజువారీ చిట్టీల రూపంలో రూ.లక్షల్లో వసూలు చేశారు. ఈ మొత్తం దాదాపు రూ.70 లక్షల నుంచి రూ.కోటి ఉంటుందని స్థానికులు తెలిపారు. మొదటి ఏడాదిలో పొదుపు చేసుకున్న డబ్బులను వడ్డీతో సహా ఇచ్చి అక్కడి జనాలను నమ్మించిన నిర్వాహకులు.. పెద్ద మొత్తంలో డబ్బులు జమ అయ్యాక కార్యాలయానికి తాళాలు వేసి పరారయ్యారు.

ఈ సొసైటీ నిర్వాహకులు.. రోజు, వారం, నెల, ఆరు నెలలు, ఏడాది వారీగా డబ్బులు కట్టించుకున్నారు. మొత్తం వడ్డీతో చెల్లిస్తామని నమ్మబలికి.. చివరకు మోసం చేసి పారిపోయారు. రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించుకున్న డబ్బును పైసా పైసా కూడబెడితే ఇలా అన్యాయం చేసి పోయారని.. బాధితులు గోడు వెళ్లబోసుకుంటున్నారు.

రోజువారీ సేవింగ్‌ చేయాలంటూ సొసైటీలో పని చేసే ఉద్యోగులకు నిర్వాహకులు నిబంధన పెట్టారు. వారికి కొంతకాలం పాటు వేతనాలిచ్చిన నిర్వాహకులు.. చివరకు వేతనాలతో పాటు ముందుగా తీసుకున్న సెక్యూరిటీ డిపాజిట్‌ రూ.లక్షన్నర కూడా ఇవ్వకుండా ఉడాయించారు. కష్టం చేసి దాచుకున్న సొమ్మంతా దోచుకున్నారని తెలియడంతో బాధితులు బాధలో మునిగిపోయారు. తమకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.