మద్యం మత్తులో లారీని ఢీ కొని యువకుడు మృతి

author img

By

Published : Aug 22, 2022, 12:36 PM IST

road accident

Karimnagar Accident Today మద్యం మత్తు ఒక యువకుడి ప్రాణాలను బలి తీసుకుంది. ఆగి ఉన్న లారీని ఢీ కొట్టడం వల్ల అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుని స్నేహితుడికి గాయాలవడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Karimnagar Accident Today: మద్యం మత్తులో యువకులు తమ ప్రాణాలను తామే తీసుకుంటున్నారు. యుక్త వయసు రాగానే కొందరు యువకులు మద్యానికి బానిసై నిండు ప్రాణాలను కోల్పోతున్నారు. తల్లిదండ్రులను చూసుకోవాల్సిన వయసులో మత్తులో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురై వారి నుంచి దూరం అవుతున్నారు. తాగిన మైకంలో ప్రాణాలను లెక్కచేయకుండా బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ కన్నవాళ్లకు పుట్టెడు దుఃఖం మిగులుస్తున్నారు.

మద్యం సేవించిన ఇద్దరు యువకులు బీరు సీసాలు పట్టుకుని ఇంటికి వెళ్తూ ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ఘటన కరీంనగర్​ జిల్లాలో చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలానికి చెందిన కామారపు సూర్యతేజ, బండి నవదీప్ కుమార్ అనే యువకులు ఆదివారం రాత్రి కరీంనగర్​లోని స్నేహితుని వివాహానికి హాజరయ్యారు. ఉదయం ఇంటికి వెళ్తుండగా ఆర్టీసీ వర్క్ షాప్ సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీ కొన్నారు.

అతి వేగంగా బైక్​ను నడపడం, తలకు హెల్మెట్ లేకపోవడంతో సూర్యతేజ అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి స్నేహితుడు నవదీప్​ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. టూ టౌన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.