కరెంట్‌ షాక్‌ ఇచ్చింది, కారుతో గుద్దించింది, చివరికి తుపాకీతో కాల్పించి భర్తను చంపించింది

author img

By

Published : Aug 21, 2022, 8:31 AM IST

కరెంట్‌ షాక్‌ ఇచ్చింది, కారుతో గుద్దించింది, చివరికి తుపాకితో కాల్పించి భర్తను చంపించింది

ఏడేళ్ల వైవాహిక బంధం, ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలు, హాయిగా సాగాల్సిన జీవితం. అయినా, ఓ అనుచిత సంబంధం వారి అనుబంధాన్ని ఛిద్రం చేసింది. భార్య పన్నిన పన్నాగం నిద్రలో ఉన్న ఆ భర్త ప్రాణాలు తోడేసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే అక్కసుతో తాళి కట్టిన భర్తనే ప్రియుడితో హత్య చేయించింది ఆ ఇల్లాలు. ఇంట్లో నిద్రిస్తున్న భర్తపై తుపాకీతో కాల్పులు జరిపించి దారుణానికి ఒడిగట్టింది. సొంత మేనబావన్న కనికరం లేకుండా కళ్ల ముందే కట్టుకున్నోడి ప్రాణాలు తీయించింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని గంగానగర్‌లో శనివారం తెల్లవారుజామున ఈ ఘోరం చోటుచేసుకుంది.

మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేటకు చెందిన రవళితో కొరకొప్పుల రాజేందర్‌(28)కు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. అయినా రాజేందర్‌కు రవళి దూరంగా ఉంటూ వచ్చింది. ఆమెకు మరో వ్యక్తితో సాన్నిహిత్యం ఉన్నట్లు గుర్తించిన భర్త అనేకసార్లు నిలదీశాడు. ఇటీవలే జరిగిన పంచాయితీలో ఇకపై కలిసి జీవిస్తామని ఆమె అంగీకరించింది. తన తల్లిదండ్రులతో కలిసి ఉండటం రవళికి ఇష్టం లేకపోవడంతో రాజేందర్‌ పక్కనే వేరు కాపురం పెట్టాడు. ఆర్నెల్ల క్రితమే తండ్రి వారసత్వంగా సింగరేణి ఉద్యోగంలో చేరి శ్రీరాంపూర్‌ ప్రాంతంలో పనిచేస్తున్నాడు. శుక్రవారం విధులకెళ్లి వచ్చి రాత్రి ఇంట్లో నిద్రిస్తున్నాడు. తెల్లవారుజామున పథకం ప్రకారం రవళి ఇంటి తలుపులు తెరిచిపెట్టింది. ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చారు. ఒకడు లోపలికి వెళ్లి రాజేందర్‌ కుడి కణతపై రెండు రౌండ్లు కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే వచ్చిన ఇద్దరూ పరారయ్యారు.

తుపాకీ శబ్దానికి పక్కనే ఉంటున్న తల్లిదండ్రులు, చుట్టుపక్కలవారు బయటకు వచ్చి రాజేందర్‌ ఇంట్లోకి వెళ్లి చూసేసరికి మంచంపై రక్తపుమడుగులో పడి ఉన్నాడు. దారుణమంతా పది నిమిషాల్లోనే జరిగినట్లు తెలుస్తోంది. వీధిలోని సీసీ కెమెరాలో నిందితులు వచ్చి వెళ్తున్న దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి. తాను టాయిలెట్‌కని లేచి బయటకు వచ్చి, లోపలికి వెళ్లేసరికే హెల్మెట్‌ పెట్టుకున్న వ్యక్తి తుపాకితో కాల్పులు జరిపి పరారైనట్లు రవళి నమ్మించే ప్రయత్నం చేసింది. పోలీసులు రంగప్రవేశం చేయడంతో హత్యా పథకం వెల్లడైంది.

....

రెండుసార్లు హత్యాయత్నం..: భర్తను హతమార్చేందుకు రవళి ఇప్పటికే రెండుసార్లు ప్రయత్నించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఒకసారి ఇంటిగేటుకు విద్యుత్తు తీగను కలిపి పెట్టిందని తెలిపారు. ఆ సమయంలో అక్కడకు మరో వ్యక్తి రాగా చిన్న షాక్‌తో బయటపడ్డాడు. ఇటీవల ఓ కారు ఢీకొట్టడంతో రాజేందర్‌ గాయపడ్డాడు. దీని వెనకా భార్య పథకం ఉందంటున్నారు. హత్యకు గురైన రాజేందర్‌ ఇంటిని పెద్దపల్లి ఇన్‌ఛార్జి డీసీపీ రూపేశ్‌ పరిశీలించారు. రెండు తూటాలను, నిందితుడి హెల్మెట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్యలో భాగస్వాములైన చెన్నూరు మండలం కిష్టంపేటకు చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకొని విచారిస్తున్నట్లు సమాచారం. రవళిని కూడా అదుపులోకి తీసుకొని మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.

తన కోడలు రవళి.. సన్నిహితుడు బందం రాజు, సయ్యద్‌తో కలిసి హత్య చేయించిందని మృతుడి తండ్రి మొండయ్య ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేస్తున్నట్లు సీఐ రమేశ్‌బాబు తెలిపారు. కిష్టంపేటకు చెందిన రాజు అక్కడ మద్యం బెల్టు దుకాణం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. నిందితుడు హత్యకు వినియోగించిన తుపాకీ బిహార్‌ నుంచి కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయుధాన్ని రాజేందర్‌ను హత్య చేయడానికే కొన్నాడా..? మరేమైనా దందాకు వినియోగిస్తున్నాడా అన్న అంశంపై పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. తండ్రి హత్య విషయం తెలియని ఆరు, ఏడాదిన్నర వయసున్న పిల్లలు అమాయకంగా నిలబడిన దృశ్యం పలువురిని కంటతడి పెట్టించింది.

ఇవీ చూడండి..

యూట్యూబ్​లో చూసి దొంగతనం చేసి, ఇద్దరు మైనర్ల ఆన్​లైన్​ చోరీ

రైలు పట్టాలపై ఐఐటీ విద్యార్థిని మృతదేహం, కారణాలేంటి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.