నీట మునిగి ఒకే కుటుంబంలో నలుగురు మృతి, ఆడుకోవడానికి వెళ్లి మరో ఏడుగురు పిల్లలు బలి

author img

By

Published : Aug 22, 2022, 8:14 AM IST

child death by drowning
child death by drowning ()

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కుంటలో పడి మృతి చెందారు. ఈ ఘటన బిహార్​లోని పశ్చిమ చంపారన్​ జిల్లాలో జరిగింది. ఝార్ఖండ్​లో జరిగిన వేర్వేరు ఘటనల్లో నీట మునిగి ఏడుగురు చిన్నారులు మరణించారు.

బిహార్​ పశ్చిమ చంపారన్​ జిల్లాలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కుంటలో పడి మృతిచెందారు. మఝోలియా పోలీస్​ స్టేషన్​ పరిధిలోని డుమారియా గ్రామంలో జరిగింది. కుంట పూడిక తీస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. మృతులను బహువార్వా గ్రామానికి చెందిన ఈట్వరి దేవి(50), అమె మనుమరాళ్లు సరితా కుమారి(13), ఖషికుమారి(8), హంసి కుమారి(6)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికితీసి శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించడం వల్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఝార్ఖండ్​లో వేర్వేరు ఘటనల్లో ఏడుగురు చిన్నారులు: ఝార్ఖండ్​ జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు చిన్నారులు మరణించారు. పలాము, హజారీబాగ్​, కొడారియా, చతరా జిల్లాలో ఈ ఘటనలు జరగగా.. వీరందరూ నీటిలో మునిగిపోయి మృతిచెందారు. సత్​బార్వా పోలీస్ స్టేషన్​ పరిధిలోని తాబర్​ గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులు పక్కనే ఉన్న గ్రాఫైట్​ గనుల్లో ఆడుకునేందుకు వెళ్లారు. గనుల తవ్వకాల గుంతలో స్నానానికి దిగిన పిల్లలు.. అదుపుతప్పి అందులో పడి మరణించారు. మృతులను మన్ను(13), అమన్​(11), అక్మల్​​(10)గా గుర్తించారు.

హజారీబాగ్​ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు మరణించారు. ముఫాసిల్​ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెహడా డ్యామ్​లో స్నానం చేసేందుకు దిగారు ముగ్గురు పిల్లలు. లోతు గమనించకుండా దిగడం వల్ల నీట మునిగిపోయారు. సమాచారం అందుకున్న గ్రామస్థులు.. సహాయక చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను వెలికితీసి శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులను అజయ్​ ప్రసాద్​ అనే బీఎస్​ఎఫ్​ జవాన్​ పిల్లలుగా గుర్తించారు.

చతరా జిల్లాలో తాండ్వా పోలీస్​ స్టేషన్ పరిధిలోని సత్​బహాని నదిలో ముగ్గురు చిన్నారులు పడిపోయారు. దీనిని గమనించిన స్థానికులు ఇద్దరు చిన్నారులను రక్షించారు. మరో చిన్నారి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
కొడారియా జిల్లాలో నీటిలో పడి ఓ చిన్నారి మరణించాడు. లొకాయి గోసాయ్​ గ్రామానికి చెందిన నలుగురు చిన్నారులు కుంటలో పడి మునిగిపోయారు. దీనిని గమనించిన స్థానికులు ముగ్గురు చిన్నారులను రక్షించగా.. ఓ చిన్నారి మునిగిపోయాడు.

ఇవీ చదవండి: 14 ఏళ్ల బాలికపై అత్యాచార యత్నం, తీవ్రంగా కొట్టి, రోడ్డుపై వదిలేసి

ఒకేరోజు మూడు ఉగ్ర ఘటనలు, పౌరులపై గ్రెనేడ్ అటాక్, సైన్యంపై ఆత్మాహుతి దాడికి యత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.