ETV Bharat / crime

ఘోర రోడ్డు ప్రమాదం.. కారు దగ్ధం.. ముగ్గురు సజీవదహనం

author img

By

Published : May 18, 2022, 5:57 AM IST

ROAD ACCIDENT: ఏపీలోని ప్రకాశం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. కారు టైరు పంక్చరై కంటెయినర్‌ను ఢీకొనగా, పెట్రోల్‌ ట్యాంకు పేలి ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. క్షణాల్లో మంటలు చుట్టుముట్టడంతో కారులోని వారంతా కాలి బుగ్గయ్యారు. జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనతో స్థానికులు భీతిల్లారు.

ఘోర రోడ్డు ప్రమాదం.. కారు దగ్ధం.. ముగ్గురు సజీవదహనం
ఘోర రోడ్డు ప్రమాదం.. కారు దగ్ధం.. ముగ్గురు సజీవదహనం

ROAD ACCIDENT: వారు ముగ్గురూ ప్రాణ స్నేహితులు.. ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్తుంటారు. అన్ని విషయాలు ఒకరికొకరు పంచుకుంటారు. వారి స్నేహం చూసి విధికి కన్నుకుట్టిందో ఏమో.. ముగ్గురిని ఒకేసారి తీసుకుపోయింది. ఏపీలోని ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురూ సజీవ దహనమయ్యారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం తిప్పాయపాలెం సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లా కంబం నుంచి మార్కాపురం వైపు వెళుతున్న కారు టైరు పేలి.. లారీని ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన తర్వాత పెట్రోలు ట్యాంక్​కు మంటలంటుకొని.. కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు.

పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతి జిల్లా భాకరాపేటకు చెందిన ఇమ్రాన్‌ (21), బాలాజీ (21), తేజ (29) కారులో కంభం నుంచి మార్కాపురంవైపు వెళ్తున్నారు. అదే సమయంలో చేపల లోడుతో ఉన్న కంటెయినర్‌ మార్కాపురం నుంచి కంభానికి వస్తోంది. తిప్పాయిపాలెం దాటిన తర్వాత కారు టైర్‌ పంక్చరై అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కంటెయినర్‌ను ఢీకొంది. కంటెయినర్‌ దాదాపు 40మీటర్ల వరకూ ఈడ్చుకుపోవడంతో కారు పెట్రోల్‌ ట్యాంక్‌ పగిలి మంటలు వ్యాపించాయి. దీంతో అందులోని వారు ప్రాణాలు కోల్పోయారు. కంభం అగ్నిమాపకశాఖ అధికారి ప్రసాదరావు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నించినా, ఫలితం లేకపోయింది. అప్పటికే కారు పూర్తిగా దగ్ధమై అందులోకి వ్యక్తుల మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. వాహనాలు రెండూ వేగంగా వెళ్తూ ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుందని సీఐ ఆంజనేయరెడ్డి వివరించారు. కారులో ప్రయాణిస్తున్నది ముగ్గురా నలుగురా అన్నది తేలాల్సి ఉందన్నారు. వాహన యజమాని చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలం అదినవారిపల్లికి చెందిన ఈటిమరుపు నరేంద్రగా గుర్తించామని, ఆయన వాహనంలో లేరని స్పష్టం చేశారు.

తిరుపతి జిల్లా భాకరాపేటకు చెందిన ఇమ్రాన్‌, బాలాజీ, తేజ ప్రాణమిత్రులు. ఇమ్రాన్‌ గుంటూరులోని టెలికాంశాఖకు బొలేరో వాహనాన్ని అద్దెకు ఇచ్చి డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. తేజకు వివాహమైంది. అతడికి భార్య, ఆరేళ్ల కుమార్తె ఉన్నారు. అప్పుడప్పుడు షాల్ట్‌ ఫిల్మ్‌లు తీస్తుంటాడని స్థానికులు తెలిపారు. బాలాజీ ప్రస్తుతం ఖాళీగానే ఉన్నారు. ఈ నెలాఖరులో తేజ కువైట్‌ వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉన్నందున ముగ్గురూ కలిసి విజయవాడ వెళ్లగా, తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం వారిని కబళించింది. ముగ్గురి మృతి వార్త తెలియడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.