ETV Bharat / city

Vice President of India: 'మాతృ భాషను విస్మరించొద్దు'

author img

By

Published : Jun 27, 2021, 5:08 PM IST

తెలుగు భాషా పరిరక్షణ కోసం ఉద్యమం రూపు దాల్చాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి (Vice President of India) వెంకయ్యనాయుడు అన్నారు. రాష్ట్రేతర తెలుగు సమాఖ్య (Telugu Samakhya) 6వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన సమావేశంలో వర్చువల్​గా మాట్లాడారు. తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల ఘనతను సగర్వంగా చాటుకునేందుకు తెలుగు వారంతా సంఘటితం కావలసిన అవసరం ఉందన్నారు. అన్ని రకాల తెలుగు సంస్థలను ఏకతాటిపైకి తీసుకు రావాలన్న రాష్ట్రేతర తెలుగు సమాఖ్య ఆశయాన్ని అభినందించారు.

Vice President of India
Vice President of India

మాతృ భాషను విస్మరిస్తే సంస్కృతి, సాహిత్యం, అలవాట్లు, కట్టుబాట్లు అన్ని ముందు తరాలకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఇందుకోసం తెలుగు వారందరూ తెలుగు భాషా పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రేతర తెలుగు సమాఖ్య (Telugu Samakhya) 6వ వార్షికోత్సవంలో వర్చువల్​గా మాట్లాడిన ఆయన.. మాతృభాష, సంస్కృతులను సగర్వంగా ప్రోత్సహించుకోవడమే గాక, ఇతరుల భాషా సంస్కృతులను తప్పని సరిగా గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు.

అలా ఎదిగిన వారే..

ప్రాథమిక విద్య మాతృభాషలో సాగడం వల్ల విద్యార్థులు నేర్చుకోవడం సులభతరం అవుతుందని వెంకయ్య నాయుడు అన్నారు. నూతన విద్యా విధానం మాతృభాషకు పెద్దపీట వేయడం ఆనందించదగిన అంశమని తెలిపారు. మాతృభాషలో చదివితే జీవితంలో ఎదగలేమనే తప్పుడు అపోహ సమాజంలో నాటుకుపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇలా అందరూ మాతృభాషలో విద్యను అభ్యసించి ఎదిగిన వారేనని గుర్తు చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల వెలుపల సుమారు వెయ్యికి పైగా సంస్థలు.. భాష, సంస్కృతుల పరిరక్షణకు పాటుపడుతున్నాయని చెప్పారు.

సాంకేతికకతో భాష అనుసంధానం..

ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారు.. తమ భాషా- సంస్కృతుల గొప్పతనాన్ని చాటుకునే దిశగా చొరవ తీసుకోవాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు. తెలుగు సాహిత్యాన్ని ఇతర భాషాల్లోకి.. ఇతర భాషాలను తెలుగులోకి అనువాదం చేసేలా చూడాలని సూచించారు. భాషను సాంకేతికతతో అనుసంధానించే ప్రయత్నాలు ముమ్మరం చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బంగాల్ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. శశి పంజా, రాష్ట్ర మాజీ ఉపసభాపతి డా. మండలి బుద్ధ ప్రసాద్, ఆల్ ఇండియా తెలుగు ఫెడరేషన్ అధ్యక్షులు డా. సీఎంకే.రెడ్డి, రాష్ట్రేతర తెలుగు సమాఖ్య అధ్యక్షుడు సుందరరావు, కార్యదర్శి పీవీపీసీ ప్రసాద్ తదితరులు అంతర్జాల వేదిక ద్వారా పాల్గొన్నారు.

ఇదీచూడండి: జన్మభూమికి చేరిన వేళ రాష్ట్రపతి భావోద్వేగం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.