ETV Bharat / city

రేపు తెరాస ప్లీనరీ.. 2023 లక్ష్యంగా పార్టీ శ్రేణులకు అధినేత దిశానిర్దేశం..

author img

By

Published : Apr 26, 2022, 6:08 AM IST

తెలంగాణ రాష్ట్ర సమితి 21వ వార్షికోత్సవానికి రంగం సిద్ధమైంది. వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికల నేపథ్యం.. రాష్ట్రస్థాయిలో తెరాస బలాబలాలపై విస్తృతస్థాయి సర్వేలు... ప్రశాంత్‌కిశోర్‌ రంగ ప్రవేశం.. కేంద్రంతో ఢీ అంటే ఢీ.. అధికార, విపక్షాల మధ్య వాడీవేడి విమర్శలు, ప్రతివిమర్శలకు తోడు ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటుకు కేసీఆర్‌ సన్నాహాల నేపథ్యంలో ఈ ప్లీనరీ జరుగుతోంది.

trs 21st plenary meeting tomorrow in hitex
trs 21st plenary meeting tomorrow in hitex

తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన బుధవారం హెచ్‌ఐసీసీలో రాష్ట్ర ప్రతినిధుల మహాసభ జరగనుంది. గత అక్టోబరులోనే తెరాస ద్విదశాబ్ది వార్షికోత్సవ ప్లీనరీ జరగ్గా... ఆరు నెలల వ్యవధిలో మరో ప్లీనరీని తెరాస నిర్వహిస్తోంది. ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులను సమాయత్తంచేసి, వారిలో నూతనోత్తేజం నింపేలా పార్టీ అధిష్ఠానం ఘనంగా ప్లీనరీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఉదయం పది గంటలకు జరిగే ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రివర్గం, రాజ్యసభ, లోక్‌సభల సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సహా మొత్తం మూడు వేలమందికి ఆహ్వానం పంపించారు. పురుషులు గులాబీరంగు దుస్తులు, మహిళలు అదే రంగు చీరలతో హాజరు కావాలని పార్టీ అధిష్ఠానం నిర్దేశించింది. ఉదయం 10-11 గంటల మధ్య ప్రతినిధుల నమోదు...ఆ తర్వాత స్వాగతోపన్యాసం, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ తొలి పలుకులుంటాయి.

..

11 తీర్మానాలు..: రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో జరిగే ప్లీనరీలో తీర్మానాలకు ప్రాధాన్యం ఉంది. ఈసారి 11 తీర్మానాలు ప్రవేశపెట్టాలని అధిష్ఠానం నిర్ణయించింది. ఇందులో మూడు రాజకీయ తీర్మానాలున్నట్లు తెలిసింది. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వివక్ష, జాతీయ ప్రత్యామ్నాయ వేదిక లేదా కొత్త పార్టీ, దేశ పాలనలో కేంద్ర వైఫల్యాలపై ఇవి ఉండనున్నాయి. వీటితో పాటు తెరాస అభివృద్ధి, సంక్షేమం, దళితబంధు, భారీగా ఉద్యోగ నియామకాలు, విజయాలు, పురస్కారాలు, తదితర అంశాలపై తీర్మానాలుంటాయని తెలుస్తోంది.

..

పార్టీ శ్రేణులకు మార్గసూచి..: ఇప్పటికే రెండు దఫాలుగా అధికారంలో ఉన్న తెరాస మూడోసారీ విజయపంథాను కొనసాగించాలనే సంకల్పంతో ఉంది. దీనికి అనుగుణంగా కార్యాచరణ అమలు చేస్తోంది. 80,039 ఉద్యోగ నియామకాల ప్రకటన.. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ.. సొంతంగా ఇల్లు కట్టుకునే వారికి రూ. 3 లక్షల సాయం... 57 ఏళ్లు దాటిన వారికి పింఛన్లు.. జీవో 111 రద్దు... ధాన్యం కొనుగోళ్లు.. తదితర అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు అధినేత దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.

ట్రాఫిక్​ ఆంక్షలు..: రేపు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్​లో నిర్వహించనున్న తెరాస ప్లీనరీ సందర్భంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పలు ఆంక్షలు విధించనున్నారు. హైటెక్స్ - కొత్తగూడా, సైబర్ టవర్స్-ఐకియా రోటరీ, గచ్చిబౌలి నుంచి కొత్తగూడ ప్రాంతాల్లో ఉన్న కార్యలయాలకు పనివేళల్లో స్వల్ప మార్పులు చేసుకోవాలని సూచించారు. ఉదయం 8.30 నుంచి 11 వరకు... సాయంత్రం 4 నుంచి 7 వరకూ ట్రాఫిక్ రద్దీ ఎక్కువ ఉంటుందన్న పోలీసులు.. రద్దీగా ఉండే ప్రాంతాల వివరాలు తెలిపారు. నీరూస్ జంక్షన్- సైబర్ టవర్స్- గూగుల్- కొత్తగూడ వైపు, మెటల్ చార్మినార్ జంక్షన్-ఖానామెట్- హైటెక్స్ వైపు, జెఎన్టీయూ- సైబర్ టవర్స్- బయో డైవర్సిటీ జంక్షన్, గచ్చిబౌలి జంక్షన్- బొటానికల్ గార్డెన్- కొండాపూర్ జంక్షన్ మార్గాల్లో వాహానాల రద్దీ ఎక్కుగా ఉంటుందని వెల్లడించారు. ఈ మార్గాల్లో వెళ్లొద్దని తెలిపిన పోలీసులు.. ప్రత్యామ్నాయ మార్గాలు సూచించారు. నీరూస్ జంక్షన్ నుంచి గచ్చిబౌలి వెళ్లే వారు.. అయ్యప్ప సొసైటీ- దుర్గం చెరువు- ఐకియా మీదుగా వెళ్లాలని సూచించారు. మియాపూర్, కొత్తగూడా, హఫీజ్​పేట నుంచి వచ్చే వాహనాలు సైబర్ టవర్స్-ఎఐజీ హాస్పిటల్-ఐకియా-దుర్గం చెరువు మీదుగా వెళ్లాలని సూచించారు. ఆర్సీపురం, చందానగర్ నుంచి మాదాపూర్, గచ్చబౌలి వచ్చే వాహనాలు బీహెచ్​ఈఎల్- నల్లగండ్ల- హెచ్‌సీయూ మీదుగా వెళ్లాలని తెలిపారు. ప్లీనరీ సమయంలో జెఎన్‌టీయూ- సైబర్ టవర్స్, మియాపూర్- కొత్తగూడ- కావూరీ హిల్స్, బయోడైవర్సిటీ-జెఎన్‌టీయూ, నారాయణమ్మ కళాశాల- గచ్చిబౌలి మార్గాల్లో భారీ వాహనాలకు అనుమతి లేదని వెల్లడించారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.