ETV Bharat / city

మరింత వికసించనున్న గులాబీ.. నేడే జాతీయ పార్టీగా ప్రకటన..

author img

By

Published : Oct 4, 2022, 9:09 PM IST

Updated : Oct 5, 2022, 8:38 AM IST

Rename TRS to BRS: గులాబీ దళపతి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం నేడు కీలక మలుపు తిరగనుంది. జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సర్వం సిద్ధం చేసుకున్నారు. ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి... నేడు జాతీయ పార్టీగా ఆవిష్కృతం కానుంది. తెరాస పేరు, పార్టీ రాజ్యంగంలోని మౌలిక అంశాలకు సవరిస్తూ సర్వసభ్య సమావేశం తీర్మానం చేయనుంది. కర్ణాటక నుంచి జేడీఎస్, తమిళనాడుకు చెందిన వీసీకే నేతలు హాజరై సంఘీభావం ప్రకటించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట 19 నిముషాలకు కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేయగానే... రాష్ట్రమంతటా సంబరాలు చేసేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి.

Bharatiya Rashtra Samithi
Bharatiya Rashtra Samithi

Rename TRS to BRS: గులాబీ పార్టీలో కీలక ఘట్టం ఆవిష్కరించబోతోంది. ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. జాతీయ పార్టీగా రూపాంతరం చెందబోతోంది. దానికి అనుగుణంగా పేరుతో పాటు.. పార్టీ రాజ్యాంగంలో మౌలిక సవరణలు చేయనున్నారు. జాతీయ పార్టీ పేరును భారత్‌ రాష్ట్ర సమితి అని కేసీఆర్ ఖరారు చేశారు. అదేవిధంగా పార్టీ మౌలిక ఉద్దేశ్యాల్లో కీలక సవరణలు చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన, తెలంగాణ అభివృద్ధి వంటి మౌలిక ఉద్దేశ్యాలతో తెరాస ఆవిర్భవించింది. వాటిని జాతీయ పార్టీకి అనుగుణంగా మార్చనున్నారు. దేశమంతటా తెలంగాణ మోడల్, లౌకికవాదం, రైతు, యువత, మహిళ సంక్షేమ వంటి అంశాలతో మౌలిక ఉద్దేశ్యాలను పొందుపరచనున్నట్లు తెలుస్తోంది.

పార్టీ పదవుల విషయంలోనూ నిబంధనల్లో కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం కనిపిస్తోంది. విజయమే లక్ష్యంగా ప్రణాళికలు చేస్తున్న కేసీఆర్.. జాతీయ పార్టీ ప్రకటనకు ఈ మధ్యాహ్నం ఒంటి గంట 19 నిమిషాలకు ముహూర్తం ఖరారు చేశారు. తెలంగాణ భవన్‌లో ఉదయం 11 గంటలకు కేసీఆర్ అధ్యక్షతన తెరాస సర్వసభ్య సమావేశం జరగనుంది. రాష్ట్ర మంత్రులు, తెరాస ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ ఛైర్‌పర్సన్లు సహా 283 మంది కీలక ప్రతినిధులు సమావేశానికి హాజరు కానున్నారు. సభ్యులందరూ తీర్మానాలపై సంతకాలు చేశాక... మధ్యాహ్నం ఒంటి గంట 19 నిముషాలకు కేసీఆర్ సంతకం చేస్తారు. ఆ తర్వాత కేసీఆర్ సహా సభ్యులందరూ ప్రగతిభవన్ వెళ్లి భోజనం చేస్తారు. అనంతరం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

తెరాస కీలక భేటీకి ఇతర రాష్ట్రాల నుంచి పలువురు నేతలు కూడా హాజరు కానున్నారు. కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్​డీ కుమారస్వామి, ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు రాత్రే హైదరాబాద్ చేరుకున్నారు. తమిళనాడులో దళిత ఉద్యమ పార్టీగా పేరున్న వీసీకే అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు తిరుమవళం నగరానికి వచ్చారు. మరికొందరు రాజకీయ, వివిధ సంఘాల నాయకులు కూడా హాజరై సంఘీభావాన్ని ప్రకటించనున్నారు. జాతీయ పార్టీ ప్రకటన రాగానే.. రాష్ట్రమంతటా పెద్దఎత్తున సంబురాలు జరిపేలా తెరాస ఏర్పాట్లు చేసింది. బాణాసంచా కాల్చడం, మిఠాయిల పంపిణీ, బోనాలు, నృత్యాలతో సందడి చేయనున్నారు. హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో భారీగా ఫ్లెక్సీలు, కటౌట్ లు ఏర్పాటు చేశారు.

తెరాస పేరు, మౌలిక ఉద్దేశ్యాల సవరణలకు పార్టీ విస్తృతస్థాయి కార్యవర్గం తీర్మానం చేసిన తర్వాత... రేపు ఎన్నికల కమిషన్‌ను నివేదించనున్నారు. దిల్లీ వెళ్లి ఈసీ అధికారులను కలిసి ప్రక్రియ వేగంగా జరిగేలా చూసే బాధ్యతలను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ బృందానికి అప్పగించారు. ఈసీ ఆమోద ముద్ర పడగానే భారాస నిర్మాణం ఊపందుకోనుంది. భారాస జాతీయ రైతు, యువజన, కార్మిక, విద్యార్థి విభాగాలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు ప్రకటిస్తున్నారు. రైతు అంశాలపైనే మొదట దృష్టి సారిస్తున్న కేసీఆర్.. దానికి అనుగుణంగా దేశంలోని వివిధ రైతు సంఘాలను భారాసలో చేరేలా కసరత్తు చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లోని సుమారు 15 రైతు సంఘాలు భారాసకు అనుబంధంగా పనిచేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లోని కొన్ని పార్టీలు కూడా భారాసలో విలీనం కానున్నాయని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. డిసెంబరు 9న దిల్లీలో భారీ బహిరంగ సభ ద్వారా బలప్రదర్శన చేసేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు.

రానున్న పార్లమెంటు ఎన్నికల్లో దాదాపు అన్ని రాష్ట్రాల్లో ప్రత్యక్షంగా లేదా ఇతర పార్టీలతో కలిసి బరిలో ఉండాలని గులాబీ పార్టీ భావిస్తోంది. శంకర్ సింహ్ వాఘేలాతో కలిసి... గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. మొదట హైదరాబాద్ సంస్థానం పరిధిలోని కర్ణాటక, మహారాష్ట్రలోని ప్రాంతాలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ ఉద్యమం తరహాలోనే నేరుగా ప్రజలను కదిలిస్తే.. ఇతర పార్టీలు, నాయకులు కలిసొస్తారని కేసీఆర్ బలంగా నమ్ముతున్నారు. గుజరాత్ మోడల్ విఫలమైందని.. తెలంగాణ మోడల్ కావాలనే నినాదంతో భారాస ముందుకెళ్లనుంది. తెలంగాణలోని దళితబంధు, ఆసరా ఫించన్లు, రైతుబంధు, రైతుబీమా, కళ్యాణలక్ష్మి వంటి సంక్షేమ పథకాలు.. సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, నిరంతర విద్యుత్తు వంటివి విస్తృతంగా ప్రచారం చేసి.. భారాసకు మద్దతుగా నిలిస్తే దేశమంతా చేసి చూపిస్తామనే ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. దేశవ్యాప్త పర్యటనల కోసం ప్రత్యేకంగా విమానం కొనుగోలు చేశారు. నేడో, రేపో 12 సీట్ల ఛార్టర్ ఫ్లయిట్ రానున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొత్తగా పార్టీ ఏర్పాటు చేయకుండా.. ఇప్పుడున్న తెరాసకే పేరు మార్చడం వల్ల కారు గుర్తు యథాతథంగా కొనసాగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ బదులు భారతదేశంతో గులాబీ జెండానే కొనసాగించనున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 5, 2022, 8:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.