ETV Bharat / city

LAND ISSUES IN TELANGANA: దీర్ఘకాలిక భూ సమస్యల పరిష్కారంపై సర్కారు దృష్టి

author img

By

Published : Sep 22, 2021, 5:41 AM IST

LAND ISSUES IN TELANGANA
LAND ISSUES IN TELANGANA

భూములు, స్థలాల వివాదాల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టిసారించింది. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలకు పరిష్కారాలను (LAND ISSUES IN TELANGANA) అన్వేషించే పనిలో పడింది. పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి.... ఓ కొలిక్కి తీసుకొచ్చేలా మంత్రివర్గ ఉపసంఘాలకు (Telangana cabinet sub committees)బాధ్యతలు అప్పగించింది. భూములు, ఇళ్ల స్థలాలకు సంబంధించిన మూడు ఉపసంఘాలు శాసనసభ సమావేశాల సందర్భంగా భేటీ కానున్నాయి.

LAND ISSUES IN TELANGANA: దీర్ఘకాలిక భూ సమస్యల పరిష్కారంపై సర్కారు దృష్టి

రాష్ట్రంలో భూ తగాదాలు లేకుండా చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్​ను (DHARANI PORTAL) తీసుకొచ్చింది. అధికారుల విచక్షణ అధికారాలకు కత్తెర వేసి.. బయోమెట్రిక్ విధానంలో పూర్తి పారదర్శకంగా భూ లావాదేవీలు జరిగేలా ప్రభుత్వం.. ధరణిని ఓ ట్రెండ్ సెట్టర్​గా అభివర్ణించింది. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు.. పారదర్శకంగా, నిమిషాల వ్యవధిలోనే పూర్తవుతున్నాయి. అయితే ఈ క్రమంలో మానవ, సాంకేతిక తప్పిదాలు కొత్త సమస్యలను తీసుకొచ్చాయి. మెజార్టీ లావాదేవీలు సాఫీగా సాగేలా వివిధ రకాల మాడ్యూల్స్​ను ధరణిలో అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే కొన్ని తప్పిదాలను సవరించే ఆస్కారం లేకపోవడం భూ యజమానులకు శాపంగా మారింది. దీంతో సదరు భూముల లావాదేవీలకు అవకాశం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కొత్త మాడ్యూల్స్ తీసుకొస్తున్నా..

రాష్ట్రవ్యాప్తంగా లక్షకు పైగా సర్వే నంబర్లు నిషేధిత భూముల జాబితాలో ఉన్నాయి. ప్రజావసరాల కోసం సర్వే నంబర్లో కొంత భూమిని సేకరిస్తే.. కొన్నిచోట్ల ఆ నంబర్ మొత్తం నిషేధిత జాబితాలోకి వెళ్లింది. కొన్ని ప్రైవేటు స్థలాలు ప్రభుత్వ భూముల జాబితాలో చేరాయి. రెవెన్యూ, కార్డ్​ డేటాలు కలపడంతో మిస్ మ్యాచ్ అయి ఇబ్బందికరంగా మారింది. పేర్ల నమోదులో జరిగిన తప్పిదాలు యజమానులకు సంకటంగా మారాయి. ఇబ్బందుల పరిష్కారం కోసం తీసుకొచ్చిన గ్రీవెన్స్ వ్యవస్థ తగిన పరిష్కారం చూపడం లేదు. ఈ సమస్యలన్నీ గత ఏడాది కాలంగా వెలుగు చూస్తునే ఉన్నాయి. ఎప్పటికప్పుడు కొత్త మాడ్యూల్స్ తీసుకొస్తున్నా... అన్ని సమస్యలకు పరిష్కారం చూపడం లేదు.

తాజా కేబినెట్​లో ప్రస్తావన..

ఇటీవల దళితబంధు పథకంపై ముఖ్యమంత్రి కేసీఆర్ (TELANGANA CM KCR REVIEW)నిర్వహించిన సన్నాహక సమావేశం సహా.. తాజా మంత్రివర్గ భేటీలోనూ ధరణి ధరణి పోర్టల్ (DHARANI PORTAL) సమస్యలు ప్రస్తావనకు వచ్చాయి. కొందరు మంత్రులు సైతం క్షేత్రస్థాయి ఇబ్బందులను వివరించారు. ఈ సమస్యల పరిష్కారం కోసం సీఎం కేసీఆర్ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. మంత్రులు హరీశ్​రావు, ప్రశాంత్​రెడ్డి, తలసాని శ్రీనివాస్​యాదవ్, జగదీశ్​రెడ్డి, నిరంజన్​రెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలతో సబ్ కమిటీ ఏర్పాటైంది. గతంలోనూ ఈ తరహా కమిటీ కొంత కసరత్తు చేసింది. తాజాగా మరోమారు ఉపసంఘం ద్వారా పరిష్కారాల కోసం ప్రయత్నిస్తున్నారు.

పోడు భూములపై..

భూములకు సంబంధించిన మరో కీలక సమస్య పోడు వ్యవసాయం. పోడు భూముల (PODU LANDS)సాగు వ్యవహారంలో అటవీ ప్రాంతాల్లో నివసించే వారు, అటవీ అధికారుల మధ్య ఘర్షణలు జరుగుతునే ఉన్నాయి. అటవీ అధికారులపై దాడులు జరిగిన సందర్భాలు ఉన్నాయి. పోడు భూముల సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్.. గతంలో అనేక సార్లు చెప్పినా.. వివిధ కారణాలతో అమలు జరగలేదు. తాజాగా పోడు భూముల సమస్య పరిష్కారం, సూచనలకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్​ ఛైర్మన్​గా.. ఈ సమస్య ఎక్కువగా ఉన్న జిల్లాల్లోని మంత్రులు జగదీశ్​రెడ్డి, ఇంద్రకరణ్​రెడ్డి, అజయ్ కుమార్ సభ్యులుగా ఉపసంఘం ఏర్పాటైంది.

పోడు భూముల సమస్య పరిష్కారం, పర్యావరణ పరిరక్షణ, అటవీ భూముల సంరక్షణ, ఆర్​ఓఎఫ్ఆర్ చట్టం (ROFR ACT) అమలు, గిరిజనులు, గిరిజనేతరుల హక్కులు కాపాడడం అంశాలపై మొదటి భేటీలో చర్చించిన సబ్​ కమిటీ... శుక్రవారం మరోసారి సమావేశం కావాలని నిర్ణయించింది.

ఇళ్ల స్థలాల అంశంపైనా..

అటు రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల స్థలాల అంశం, సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. అనుమతుల్లేని లే అవుట్లు, ప్లాట్ల రిజిస్ట్రేషన్ జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు తీసుకొచ్చింది. ఇదే సమయంలో ఎల్ఆర్ఎస్ పథకాన్నీ తీసుకొచ్చింది. పాతిక లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అయితే న్యాయస్థానం ఆదేశాలతో ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. వచ్చిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులన్నింటినీ క్లస్టర్లుగా విభజించారు. వాటిపై రాష్ట్ర ప్రభుత్వం తదుపరి ముందుకెళ్లాల్సి ఉంది. గ్రామకంఠానికి సంబంధించీ చాలా సమస్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల ఇళ్ల స్థలాల సమస్యలపై పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో సబ్​కమిటీ ఏర్పాటైంది.

ఇవీచూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.