ETV Bharat / city

ఇలా చేస్తే పన్ను చెల్లింపులకు వేచి ఉండాల్సిన పనుండదు!

author img

By

Published : Feb 26, 2020, 11:56 AM IST

commercial tax
commercial tax

వాణిజ్య పన్నుల శాఖను పాలనాపరంగా పునర్విభజన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే 91గా ఉన్న వాణిజ్య పన్నుల సర్కిళ్లను వందకు పెంచిన ప్రభుత్వం కొత్తగా మరో రెండు డివిజన్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. కమిషనర్‌ కార్యాలయంతో పాటు డివిజన్ల కార్యాలయాల్లోనూ పన్నుల వసూళ్లకు సిబ్బంది కొరత తీవ్రంగా ఉండడంతో ఖాళీలను భర్తీ చేసే దిశలో చర్యలు మొదలయ్యాయి.

ఏపీ విభజన తర్వాత 91 వాణిజ్య పన్నుల సర్కిళ్లు, 12 డివిజన్లతో తెలంగాణలో వాణిజ్య పన్నుల శాఖ ఏర్పాటైంది. ఇందులో కొన్ని సర్కిళ్లు పన్ను చెల్లింపుదారులతో చాలా చిన్నవిగా... మరికొన్ని సర్కిళ్లు మూడునాలుగు సర్కిళ్లకు సమానమైన పన్ను చెల్లింపుదారుల సంఖ్యతో పెద్దగా ఉండేవి. చిన్న సర్కిళ్లలో పని చేసే అధికారులకు చేతినిండా పనిలేక ఖాళీగా ఉండేవారు. పెద్ద సర్కిళ్లలో పనిచేసే అధికారులకు పని ఒత్తిడి తీవ్రంగా ఉండేది. ఈ పరిస్థితిని గుర్తించిన అప్పటి వాణిజ్య పన్నుల ముఖ్యకార్యదర్శి సోమేశ్‌కుమార్‌... సర్కిళ్లను ప్రక్షాళన చేయడం ఒకటే మార్గమని నిర్ణయించారు. పన్ను చెల్లింపుదారుల సంఖ్య, అధికారులు, సిబ్బందిపై పని ఒత్తిడి, పాలనాపరంగా ఎదురవుతున్న ఇబ్బందులను ప్రామాణికంగా తీసుకుని సర్కిళ్లను ప్రక్షాళన చేసే దిశలో పునర్విభజన చేశారు. 2018 మే 22న ఇందుకోసం ప్రత్యేకంగా జీవో 145 ఇచ్చి ప్రక్షాళన చేపట్టారు.

సర్కిళ్లను చేసినట్లే డివిజన్ల ప్రక్షాళన

తక్కువ పన్ను చెల్లింపుదారులు ఉన్న సర్కిళ్లకు ఎక్కువ మంది చెల్లింపుదార్లను కేటాయించడం, అధిక సంఖ్యలో పన్ను చెల్లింపుదారులు ఉన్న సర్కిళ్లలో సంఖ్యను తగ్గించడం లాంటి కార్యక్రమం చేపట్టారు. కొన్ని డివిజన్లల్లో సర్కిళ్ల సంఖ్య పెరగగా మరికొన్ని డివిజన్లల్లో సర్కిళ్ల సంఖ్య తగ్గింది. ఒక్కో డివిజన్‌ పరిధిలో ఏడు లేక ఎనిమిది సర్కిళ్లు ఉండేట్లు చర్యలు తీసుకున్నారు. జిల్లాల్లో అయిదు డివిజన్లు ఉండగా హైదరాబాద్‌ నగరంలోనే ఏడు డివిజన్లు ఉన్నాయి. సర్కిళ్లను ప్రక్షాళన చేసినట్లే... డివిజన్లను కూడా పునర్విభజన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సరూర్‌నగర్ డివిజన్‌ పరిధిలో 14 సర్కిళ్లు, హైదరాబాద్‌ రూరల్‌ డివిజన్‌ పరిధిలో 14 సర్కిళ్లు ఉండడంతో అక్కడ అధికారులపై పని ఒత్తిడి విపరీతంగా ఉంది. పాలనాపరంగానూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఎగవేతదారులను కట్టడి చేయవచ్చు

ఆ రెండు డివిజన్లను ఒక్కోదానిని రెండేసి లెక్కన నాలుగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. డివిజన్ల సంఖ్య 12 నుంచి 14కు పెరగనుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఇదే విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కూడా చర్చించినట్లు తెలుస్తోంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రక్షాళన కార్యక్రమం పూర్తయితే... పెద్ద డివిజన్లను విడగొట్టడం వల్ల పాలనాపరమైన సౌలభ్యత ఏర్పడి ఆయా డిప్యూటీ కమిషనర్లపై పని ఒత్తిడి తగ్గుతుంది. పన్ను ఎగవేతదారులపై దృష్టిసారించి కిందిస్థాయి అధికారులతో సమీక్షలు చేస్తూ... పనితీరును మెరుగుపరిచేందుకు దోహదం చేస్తుంది. వాహన తనిఖీలు, వ్యాపార, వాణిజ్య సంస్థలను సోదాలు నిర్వహించి... ఎగవేతదారులను కట్టడి చేసేందుకు అవకాశం ఏర్పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

వేధిస్తున్న సిబ్బంది కొరత

వాణిజ్య పన్నుల శాఖలో పదవీవిరమణ అవుతున్నారేకాని... కొత్తగా నియామకాలు లేవు. చాలా డివిజన్లల్లో సిబ్బంది కొరత ఏర్పడింది. ప్రధానంగా కమిషనర్‌ కార్యాలయంలో కూడా కార్యాలయ సబ్‌ఆర్డినెట్లు, సీనియర్‌ అసిస్టెంట్లు లాంటి పోస్టులు ఖాళీగా ఉండడంతో అక్కడ జరగాల్సిన పనులు జాప్యం అవుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు. సాంకేతికపరంగా పనితీరును మెరుగుపరుచుకుంటూ వస్తున్నప్పటికీ... సిబ్బంది కొరత అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి అవసరమైన మేరకు నియమించుకోడానికి అనుమతించాలని సీఎస్ ​సోమేశ్‌కుమార్‌ విజ్ఞప్తి చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

ఇదీ చూడండి: ట్రంప్​ పర్యటనలో వాణిజ్య ఒప్పందం ఎందుకు కుదరలేదు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.