ETV Bharat / city

'కేంద్రానిది రెండు నాల్కల ధోరణి'

author img

By

Published : May 25, 2022, 8:33 AM IST

ద్రవ్యమినిమయ చట్టాన్ని కేంద్రం ఉల్లంఘిస్తూ క్రమశిక్షణ పాటించే రాష్ట్రాలను ఇబ్బందిపెడుతోందన్న తెలంగాణ సర్కార్.. ఇది సరైన చర్య కాదని పేర్కొంది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల అమలు విషయంలో తమకు అనుకూలంగా ఉన్నవాటిని ఆమోదిస్తూ.. రాష్ట్రాలకు ఉపయోగపడేవాటిని పట్టించుకోకపోవడం ద్వారా కేంద్రం రెండు నాల్కల ధోరణి అవలంభిస్తోందని అభిప్రాయపడింది.

రాష్ట్ర ఆర్థిక శాఖ సుదీర్ఘ లేఖ
రాష్ట్ర ఆర్థిక శాఖ సుదీర్ఘ లేఖ

‘‘పదిహేనవ ఆర్థిక సంఘం సిఫార్సుల అమలు విషయంలో తమకు అనుకూలంగా ఉన్నవాటిని ఆమోదిస్తూ, రాష్ట్రాలకు ఉపయోగపడేవాటిని పట్టించుకోకపోవడం ద్వారా కేంద్రం రెండు నాల్కల ధోరణిని అవలంబిస్తోందని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. ద్రవ్యవినిమయ చట్టాన్ని కేంద్రం ఉల్లంఘిస్తూ క్రమశిక్షణ పాటించే రాష్ట్రాలను ఇబ్బందిపెడుతోందని, ఇది సరైన చర్య కాదని పేర్కొంది. బడ్జెట్‌కు బయట ఉండే రుణాలను కూడా పరిగణనలోకి తీసుకొని ద్రవ్యవినిమయ చట్టం ప్రకారం అర్హత ఉన్న మేరకే రుణాలు తీసుకోవాలంటూ కేంద్రం పేర్కొనడం, దీనిపై రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇటీవల రాష్ట్ర ఆర్థికశాఖ కేంద్ర ఆర్థిక, వ్యయశాఖలకు సుదీర్ఘ లేఖ రాసింది.

2022-23 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు రూ.42,728 కోట్ల రుణం మాత్రమే తీసుకొనే అర్హత ఉందని, కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని వ్యయవిభాగం తెలిపి కొంత సమాచారాన్ని కోరింది. బడ్జెట్‌కు బయట ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌(ఎస్‌.పి.వి) ఏర్పాటు చేసి రుణాలు తీసుకొని తిరిగి చెల్లిస్తున్నవి కూడా బడ్జెట్‌లో భాగంగానే చూడాలని, అవి ఎఫ్‌.ఆర్‌.బి.ఎం చట్టం పరిధిలోనే ఉంటాయని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి ఈ నెల 9న వీడియో కాన్ఫరెన్స్‌లో చెప్పగా, దీనిపై రాష్ట్రం అభ్యంతరం తెలిపింది. 15వ ఆర్థిక సంఘం నివేదిక 2020-21 నుంచి అమలులోకి వస్తుందని కూడా కేంద్రం స్పష్టం చేసింది. దీనిపై రాష్ట్రాల అభ్యంతరాలుంటే రాతపూర్వకంగా తెలపాలని సూచించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ లేఖ రాసింది. అందులో ముఖ్యాంశాలు...

15వ ఆర్థిక సంఘం సూత్రాలకు అనుగుణంగా రుణాలను కూడా పరిగణనలోకి తీసుకొని 2022-23 బడ్జెట్‌ను రూపొందించాం. దీనికి తగ్గట్లుగా వ్యయాన్ని కూడా పేర్కొని ఆమోదించాం. బడ్జెటేతర రుణాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు 2022 మార్చి 31న కేంద్రం నుంచి లేఖ వచ్చింది. ముందస్తు సమాచారం లేకుండా ఇలా చేయడం వల్ల శాసనసభ ఆమోదించిన బడ్జెట్‌పైన, సంక్షేమ, పెట్టుబడి కార్యక్రమాలపైన ప్రభావం పడుతోంది. దీనివల్ల బడ్జెట్‌కు కోతపడి రుణాలు తిరిగి చెల్లించడానికి డబ్బుల్లేక కార్పొరేషన్లు దివాలా తీసే ప్రమాదం ఉంది. దీంతో మొత్తం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపైనే ప్రభావం పడుతుంది.

కేంద్రం పెట్టుబడి వ్యయం కింద ప్రత్యేక సాయానికి 1.27 లక్షల కోట్ల రుణాన్ని రాష్ట్రాలకు ఇస్తామంది. ఇందుకోసం ఎఫ్‌.ఆర్‌.బి.ఎం పరిధిని పెంచింది. 2017-18, 2018-19, కాగ్‌ నివేదికల ప్రకారం కేంద్రం ఎఫ్‌.ఆర్‌.బి.ఎం చట్టాన్ని అనేకసార్లు ఉల్లంఘించింది. ఎలాంటి ఉల్లంఘనలు లేకుండా క్రమశిక్షణతో ఆర్థిక నిర్వహణ చేస్తున్న రాష్ట్రాలను శిక్షించేలా కేంద్ర నిర్ణయం ఉంది.

సెస్‌, సర్‌ఛార్జీల వల్ల కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే పన్నుల వాటా 41 నుంచి 29.6 శాతానికి తగ్గింది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల కింద కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రాష్ట్రానికి రావలసిన నిధులూ రాలేదు. మిషన్‌భగీరథకు రూ.19,205 కోట్లు, మిషన్‌ కాకతీయకు రూ.ఐదువేల కోట్లు ఇమ్మని నీతి ఆయోగ్‌ సిఫార్సు చేసినా పట్టించుకోలేదు.

తెలంగాణ వృద్ధి రేటు, సొంత పన్నుల ఆదాయం కూడా ఎక్కువ. 2019-20 సంవత్సరాన్ని తీసుకొంటే రుణాలు జీఎస్‌డీపీలో 23.5 శాతమే. ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకొంటే రుణాలను తిరిగి చెల్లించడానికి ఇబ్బంది లేదు. కొన్ని రాష్ట్రాల రుణాలు జీఎస్‌డీపీలో 42.5 శాతం వరకు కూడా ఉన్నాయి.

రాష్ట్రం రుణాలను తీసుకోవడానికి ఇచ్చిన గ్యారంటీలు కూడా నీటిపారుదల, తాగునీరు, రోడ్లు అభివృద్ధి తదితరాల కోసమే. పెట్టుబడి వ్యయం కిందనే ఖర్చుచేసింది. ఇలాంటి వాటివల్లే తెలంగాణ వృద్ధి గణనీయంగా పెరిగింది.

తెలంగాణ ఇండస్ట్రియల్‌ కార్పొరేషన్‌, హౌసింగ్‌ కార్పొరేషన్‌ తీసుకొనే రుణాలకు తాకట్టుపెట్టడానికి అవసరమైన ఆస్తులున్నాయి. మార్కెటింగ్‌ కార్పొరేషన్‌ మొక్కజొన్న, పప్పుదినుసుల కొనుగోలుకు తీసుకునే రుణాలను మార్కెటింగ్‌ ఆపరేషన్స్‌ పూర్తి కాగానే తిరిగి చెల్లిస్తోంది. అందువల్ల ప్రభుత్వ రుణాల్లోకి తీసుకోవడానికి వీల్లేదు. వీటన్నింటిని పరిగణిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఆర్థికశాఖ లేఖలో కోరింది.

బడ్జెట్‌ బయట తీసుకున్న రుణాలను కూడా ప్రభుత్వ రుణాలుగానే చూడాలని కేంద్ర ప్రభుత్వం చెప్పడం ఇది మొదటిసారి. 15వ ఆర్థిక సంఘం ఇలాంటి సిఫార్సు చేయలేదు. బడ్జెటేతర రుణాల విషయంలో కూడా క్రమశిక్షణ అవసరమని, దీనికి తగ్గట్లుగా ఎఫ్‌.ఆర్‌.బి.ఎం చట్టంలో మార్పులు చేయాలని, ఇందుకోసం ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసి దీని సిఫార్సులకు అనుగుణంగా మార్పు చేయాలని సూచించింది. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రాతినిధ్యం ఉండాలని పేర్కొంది. పార్లమెంటులో ప్రవేశపెట్టిన చర్యల నివేదికలో ఈ సిఫార్సును ప్రత్యేకంగా పరిశీలన చేస్తామని కేంద్రం పేర్కొంది. కానీ దీనికి భిన్నంగా వ్యవహరించింది.

ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు రాష్ట్రాలకు నిధులు బదలాయించడం సంప్రదాయం.అయితే మొదటిసారి కేంద్రం దీనిని పక్కనపెట్టింది. 15వ ఆర్థిక సంఘం మొదటి నివేదిక 2020-21 పన్నుల బదలాయింపు కింద రాష్ట్రానికి స్పెషల్‌ గ్రాంట్‌ ఇవ్వాలని సిఫార్సు చేస్తే దీనికి కేంద్రం అంగీకారం తెలపలేదు.దీంతోపాటు పౌష్టికాహారానికి సంబంధించిన గ్రాంటుకు, ఆర్థిక సంఘం సిఫార్సులకు అంగీకారం తెలపలేదు. ఈ విషయంలో కేంద్రం రెండు రకాలుగా వ్యవహరిస్తోంది. కేంద్రానికి అనుకూలంగా ఉన్నవాటిని ఆమోదిస్తూ మిగిలిన వాటిని పట్టించుకోవడం లేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.