ETV Bharat / city

కంటైన్మెంట్​ జోన్లకు ప్రత్యేక విధివిధానాలు

author img

By

Published : Apr 14, 2020, 7:11 PM IST

telangana
కంటైన్మెంట్​ జోన్లకు ప్రత్యేక విధివిధానాలు

కరోనా లక్షణాలున్న వారిని గుర్తించేందుకు కంటైన్మెంట్ ప్రాంతాల్లో ఇంటింటా ఫీవర్ సర్వే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. రోజువారీ ఆరోగ్య పరిస్థితులను పరిశీలించాలని తెలిపింది. కంటైన్మెంట్ ప్రాంతాల్లోని ప్రజలు.. కనీసం ఇళ్ల ముందు కూడా ఉండరాదని.. పూర్తిగా ఇళ్లకే పరిమితం కావాలని సూచించింది. పూర్తిజాగ్రత్తలు తీసుకున్నాక అనుమతి పొందిన వ్యక్తుల ద్వారా ఇళ్ల వద్దకే నిత్యవసరాలను సరఫరా చేయాలని ప్రభుత్వం అధికారులకు స్పష్టం చేసింది.

కరోనా కేసులు వెలుగుచూసిన ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయా ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేక విధి విధానాలు రూపొందించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీలోని కంటైన్మెంట్ జోన్లకు సంబంధించి.. పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్​ కుమార్​ ఆదేశాలు జారీ చేశారు.

24 గంటల పర్యవేక్షణ..

కొవిడ్ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదైన ప్రాంతాన్నంతా కంటైన్మెంట్ జోన్​గా ప్రకటించి మొత్తాన్ని ఎనిమిది అడుగుల ఎత్తుతో బారికేడింగ్ ఏర్పాటు చేయాలి. ఉమ్మడి ప్రవేశ మార్గాన్ని ఏర్పాటుచేసి 24 గంటలపాటు పోలీసుల పర్యవేక్షణ ఉండాలి. బయట వారు లోపలికి వెళ్లకూడదు. లోపలి వారు అనుమతి లేకుండా బయటకు రాకూడదు. ఇళ్ల ముందు కూడా ఎలాంటి సంచారం ఉండరాదు.

అధికారుల బృందాలు

కేసుల సంఖ్య ఆధారంగా కంటైన్మైంట్ జోన్ పరిధిని ఏర్పాటుచేయాల్సి ఉంటుంది. ఒక్కో కేసుకు కనీసం వంద ఇళ్లను పరిశీలనలోకి తీసుకోవాలి. పురపాలక, పోలీసు, వైద్యారోగ్య అధికారులతో కలిపి కంటైన్మెంట్ జోన్ ప్రాంతానికి ఒక బృందాన్ని ఏర్పాటుచేయాలి. సర్కిల్, జోనల్ స్థాయిల్లోనూ అధికారుల బృందాలను నియమించాలి. కంటైన్మెంట్ జోన్​లోని రాకపోకలను పూర్తిగా రికార్డు చేయాలి. ముందు జాగ్రత్తగా ప్రాంతంలోని ప్రజలకు మాస్కులు పంపిణీ చేయాలి. జోన్​కు ప్రత్యేకంగా ఒక వాహనాన్ని ఏర్పాటు చేయాలి. జోన్​లో విధులు నిర్వర్తించే వారందరికీ వ్యక్తిగత రక్షణ పరికరాలు సమకూర్చాలి.

ఇళ్ల వద్దకే నిత్యవసరాలు..

కూరగాయలు, పాలు, నిత్యావసరాల కోసం వ్యాపారులను సంప్రదించి.. ఇళ్ల వద్దకే చేరేలా నోడల్ అధికారులు చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ ఆదేశించింది. మధ్యాహ్నం 12 గంటల వరకు ఇండెంట్లు తీసుకొని ఆ తర్వాత ఇళ్ల వద్దకే సరఫరా చేసేలా చూడాలని సూచించింది. నిత్యావసరాలు అందించేవారు పూర్తిజాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. నోడల్ అధికారుల ఫోన్ నంబర్లు ఆ ప్రాంత ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపింది.

అత్యవసర సేవలు..

నిరాశ్రయులు, వలస కూలీలకు ప్రత్యేక వసతులు కల్పించాలని సర్కారు ఆదేశించింది. ప్రోటోకాల్‌ ప్రకారం పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని పేర్కొంది. కంటైన్మెంట్ ప్రాంతాల్లోని అన్ని ఇళ్లలోనూ ఫీవర్ సర్వే నిర్వహించాలని... ఎవరైనా కరోనా లక్షణాలతో కనిపిస్తే వారిని ఐసోలేషన్ కేంద్రాలకు తరలించాలని సూచించింది. అత్యవసర వైద్యసేవలు, అంబులెన్స్ సేవలు నిరంతరం అందుబాటులో ఉంచాలని పురపాలక శాఖ సూచించింది.

నోడల్‌ బృందాల సమన్వయంతో వివిధ శాఖల అధికారులు నిర్వర్తించాల్సిన బాధ్యతలకు సంబంధించి కూడా పురపాలక శాఖ స్పష్టమైన విధివిధానాలను ఖరారుచేసింది.

ఇవీచూడండి: ఒక్కరోజులోనే భారత్​లో 1211 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.