ETV Bharat / city

సామాజిక మాధ్యమాల్లో పోస్టుల కేసు... తెదేపా కార్యకర్తకు బెయిల్

author img

By

Published : Jul 2, 2022, 8:43 AM IST

venkatesh
venkatesh

సామాజిక మాధ్యమాల్లో పోస్టుల వ్యవహారంలో సీఐడీ అరెస్టు చేసిన ఏపీ తెదేపా కార్యకర్త గార్లపాటి వెంకటేశ్​కు బెయిల్ మంజూరైంది. వెంకటేశ్​ను రిమాండ్​కు పంపాలని సీఐడీ చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చి న్యాయమూర్తి... ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేవన్నారు. సొంతపూచీపై వెంకటేశ్​కు బెయిలిచ్చారు. సీఐడీ అధికారులు కుట్రపూరితంగా వెంకటేశ్​పై కేసు పెట్టారని... దీనిపై ప్రైవేటు కేసు వేయనున్నట్లు ఆయన తరఫు న్యాయవాదులు తెలిపారు.

ఏపీ ముఖ్యమంత్రి కుటుంబంపై పోస్టులు పెట్టారంటూ సీఐడీ పోలీసులు ….. యూ ట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న అమరావతి మండలం ధరణికోటలోని వెంకటేశ్​ ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ఇంటి తలుపులు పగులగొట్టి మరీ అరెస్టు చేయటం విమర్శలకు తావిచ్చింది. వెంకటేశ్​తో పాటు సాంబశివరావు అనే మరో కార్యకర్తను అదుపులోకి తీసుకున్నప్పటికీ... విచారించి గురువారం రాత్రి వదిలివేశారు. వెంకటేశ్​ని న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా... తనను సీఐడీ అధికారులు కొట్టారని చెప్పారు.

దీంతో జీజీహెచ్ లో చేర్చి అక్కడి వైద్యుల నుంచి నివేదిక ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఆ తర్వాత వెంకటేశ్​కు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు చేయించారు. ఈసీజీతో పాటు, ఎంఆర్ఐ, సిటీస్కాన్​తో పాటు మెదడు, నరాలకు సంబంధించిన స్కానింగ్ పరీక్షలు నిర్వహించారు. గాయాలు లేవని నివేదిక ఇవ్వాలంటూ వైద్యులపై ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇలా శుక్రవారమంతా జీజీహెచ్​లో హైడ్రామా నడిచింది. ఎట్టకేలకు వైద్య పరీక్షలు పూర్తి చేసి ఆ నివేదికను శుక్రవారం సాయంత్రం న్యాయమూర్తికి సీల్డ్ కవర్లో అందించారు. ఆ తర్వాత వెంకటేశ్​ను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు.

ఈ కేసులో సరైన ఆధారాలు లేనందున వెంకటేశ్​ను రిమాండ్‌కు పంపాల్సిన అవసరం లేదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. సీఐడీ అరెస్టు చేసిన మిగతా వారిని నోటీసులు ఇచ్చి పంపించేసి... వెంకటేశ్​ ఒక్కరినే రిమాండ్ కోరటమేంటని ప్రశ్నించారు. తప్పు చేసినట్లు సరైన ఆధారాలు లేవన్నారు. సీఐడి పోలీసులు తనపట్ల చాలా దారుణంగా ప్రవర్తించారని వెంకటేశ్​ఆవేదన వ్యక్తం చేశారు. బెయిల్ పై బయటకు రాగానే వెంకటేశ్​ చికిత్స కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.