TTD in America: అమెరికాలో స్థిరపడిన భారతీయులు, తెలుగువారు దర్శించుకునేలా.. ఈ నెల 18 నుంచి జులై 9 వరకు ఎనిమిది నగరాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహించనున్నట్లు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలో ఈవో ఏవీ ధర్మారెడ్డితో కలిసి ఆయన శనివారం మాట్లాడారు. ‘రెండున్నరేళ్లుగా కరోనాతో ఇతర దేశాల నుంచి భక్తులు తిరుమలకు రాలేకపోయారు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ సూచనలతో అమెరికాలోని భక్తుల కోసం స్వామివారి కల్యాణాలు నిర్వహించాలని తితిదే నిర్ణయించింది. ఏపీ ప్రవాస భారతీయుల సంఘం సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. జూన్ 18న శాన్ఫ్రాన్సిస్కో, 19న సియాటిల్, 25న డాలస్, 26న సెయింట్ లూయీస్, 30న షికాగో, జులై 2న న్యూ ఆర్లీన్స్, 3న వాషింగ్టన్ డీసీ, 9న అట్లాంటా నగరాల్లో శ్రీవారి కల్యాణాలు జరుగుతాయి. ఇలాంటి వేడుకలు నిర్వహించాలని ఇతర దేశాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలిస్తున్నామ’ని తెలిపారు. తిరుమలలో స్వామివారి సర్వదర్శనానికి 48 గంటలకుపైగా సమయం పడుతోందని ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
తనిఖీ కేంద్రం సిబ్బంది చేతివాటం.. ప్రత్యేక ప్రవేశదర్శనానికి నకిలీ టికెట్లతో వచ్చిన వారిని అనుమతిస్తూ తనిఖీ కేంద్రం సిబ్బంది చేతివాటం ప్రదర్శించగా, పట్టుకున్నట్లు ఏవీఎస్వో పద్మనాభన్ తెలిపారు. కేవీఎం ఏజెన్సీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగి వెంకటేశు తిరుపతికి చెందిన దళారి రాజుతో కలిసి కొందరు భక్తులకు రూ.300ల నకిలీ దర్శన టికెట్లు విక్రయించాడు. భక్తులు ఆ టికెట్లతో వచ్చినప్పుడు కౌంటర్లో ఉన్న వెంకటేశ్ తనిఖీ చేస్తున్నట్లు నటించి అనుమతించాడు. శనివారం విజిలెన్స్ అధికారుల పరిశీలనలో ఈ గుట్టు రట్టయ్యింది.
మంత్రి ఎస్కార్ట్ డ్రైవర్ మహద్వార ప్రవేశం.. మంత్రి రోజా ఎస్కార్ట్ డ్రైవర్నంటూ ఏఆర్ కానిస్టేబుల్ లోకేశ్ శ్రీవారి ఆలయ మహద్వారం ఎదురుగా ఉన్న బయోమెట్రిక్లో చెబుతూ లోపలకు ప్రవేశించారు. ప్యాంటుతోనే పడికావలి వరకు వెళ్లగా అక్కడి సిబ్బంది గుర్తించి వెనక్కి పంపించారు. బయోమెట్రిక్ భద్రతా సిబ్బంది వైఫల్యంతోనే ఇలా జరిగిందన్న విమర్శలు వచ్చాయి.
కానిస్టేబుల్ చర్యపై నివేదిక సిద్ధం చేసినట్లు తితిదే వీజీవో బాలిరెడ్డి తెలిపారు. దీనిపై రోజా స్పందిస్తూ.. తాను, తనవారు ఎప్పుడూ నిబంధనలు ఉల్లంఘించలేదని, కావాలనే కొందరు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
ఇవీ చూడండి: