ETV Bharat / city

Jaggareddy Comments: 'ఆ విషయంలో కేసీఆర్​కే నా మద్దతు'.. జగ్గారెడ్డి కీలకవ్యాఖ్యలు

author img

By

Published : Oct 30, 2021, 5:31 PM IST

Updated : Oct 30, 2021, 7:55 PM IST

Sangareddy mla Jaggareddy Comments on union Andhra Pradesh
Sangareddy mla Jaggareddy Comments on union Andhra Pradesh

కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి మరోసారి సమైక్యవాదం వినిపించారు. కేసీఆర్ సమైక్యవాదంతో ముందుకొస్తే... తానూ మద్దతిస్తానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉద్యమ సమయంలోనూ సమైక్యవాదాన్నే వినిపించినట్టు గుర్తు చేశారు. సమైక్యం.. తమ వ్యక్తిగత అభిప్రాయమేనని.. పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు.

సమైక్యవాదంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకొస్తే.. తాను కూడా మద్దతిస్తానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమేనని.. పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తాను ఉద్యమ సమయంలో కూడా.. సమైక్యవాదం వైపే ఉన్నట్టు గుర్తు చేశారు. తనను తెలంగాణ ద్రోహి అన్నా.. ఎమ్మెల్యేగా గెలిచినట్టు పేర్కొన్నారు. ఆ రోజు తనను తప్పుబట్టిన నాయకులే.. ఇప్పుడు ఒక్కొక్కరుగా వారి అభిప్రాయాన్ని మార్చుకుని సమైక్యానికి అనుకూలంగా మాట్లాడుతున్నారని వివరించారు. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయన్న జగ్గారెడ్డి.. తాను ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదని.. ప్రజల అభీష్టం మేరకే నడుచుకుంటానని తెలిపారు.

తప్పుబట్టిన వాళ్లే మద్దతిస్తున్నారు..

"ముందు నుంచి తెలంగాణ కావాలని కోరుకున్న పార్టీ కాంగ్రెసే.. కానీ ఉద్యమాన్ని మొదలు పెట్టింది మాత్రం కేసీఆర్‌. ఉద్యమం ఊపందుకోవడంతో అన్ని పార్టీలు తప్పనిసరి పరిస్థితుల్లో మద్దతు ఇచ్చాయి. రేపు.. తాము తెలంగాణాలో పుట్టామని తెదేపా నుంచి లోకేశ్‌ కానీ.. వైసీపీ నుంచి జగన్మోహన్‌ రెడ్డి వారసులు గానీ.. వస్తే ఆశ్చర్యపోనవసరం లేదు. పార్టీ ప్లీనరీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయ అయోయమానికి గురిచేశాయి. రేవంత్‌ రెడ్డి పీసీసీ హోదాలో సమైక్యానికి వ్యతిరేఖంగా మాట్లాడి ఉండొచ్చు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. అంతా ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడుతున్న సమయంలో నేను సమైక్యం అంటే.. అందరూ నన్ను తెలంగాణ ద్రోహి అని విమర్శించారు. నేను మొదటి నుంచి కూడా సమైక్యవాదినే. సమైక్యం పేరున అక్కడ అంధ్ర, ఇక్కడ తెలంగాణ నాయకులు కొత్త డ్రామాను తెరపైకి తెచ్చారు. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో ప్రత్యేక రాష్ట్రం కోసం కోట్లాడాం. సమైక్యం కంటే మెరుగైన జీవితం ఉంటుందని భావించాం. విభజన జరిగినా.. ఆంధ్ర, రాయలసీమ ప్రజలు కోటి మందికిపైగా తెలంగాణాలోనే ఉన్నారు. ఆంధ్రాలో పార్టీ పెట్టమని కోరుతున్నారని సీఎం కేసీఆర్ అంటే... పార్టీ పెట్టడం ఎందుకు రాష్ట్రాన్నే కలిపేద్దామని ఆ రాష్ట్ర మంత్రి పేర్ని నాని ప్రతిపాదించారు. సమైక్యం విషయంలో నేను ఎవ్వరి అభిప్రాయాలను తప్పుపట్టను. నేను ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదు. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అన్ని ప్రాంతాల ప్రజలు నాకు ఒకటే." - జగ్గారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే

రేవంత్​కు సారీ చెప్పలేదు..

పీసీసీని ఉద్దేశించి మీడియా ముందు మాట్లాడిన విషయాలపై తనను సారీ చెప్పమని ఎవరూ అడగలేదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఎప్పటికీ తాను పార్టీకి అనుకూలంగానే పనిచేస్తానన్న జగ్గారెడ్డి.. తన వ్యాఖ్యలు పార్టీని ఇబ్బంది పెట్టేవిగా ఉన్నాయని ఇంఛార్జి చెప్పడం వల్లనే తాను సారీ చెప్పినట్లు జగ్గారెడ్డి వివరించారు. ఆ రోజు పార్టీకి సారీ చెప్పానేకాని.. రేవంత్ రెడ్డికి కాదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా రేవంత్‌ రెడ్డికి సారీ చెప్పనని.. సారీ చెప్పాల్సిన అవసరం రాదని తెలిపారు. నా స్టాండ్‌ మొదటి నుంచి సమైక్యమేనని... రెండో మాటకు స్థానం లేదని స్పష్టం చేశారు.

సంబంధిత కథనాలు..

Last Updated :Oct 30, 2021, 7:55 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.