ETV Bharat / city

ఎంపీ మాధవ్‌ ఘటనపై స్పందించిన రాష్ట్రపతి, తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్​కు సూచన

author img

By

Published : Aug 29, 2022, 9:28 PM IST

రాష్ట్రపతి కార్యాలయం
రాష్ట్రపతి కార్యాలయం

President Respond on MP Gorantla Video Viral Issue ఏపీ వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్​ వీడియో వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని మహిళ ఐకాస నేతలు రాష్ట్రపతిని కలిసిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై స్పందించిన ప్రెసిడెంట్​ కార్యాలయం ఎంపీపై తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సీఎస్​కు సూచించింది.

President Respond on MP Gorantla Video Viral Issue: ఆంధ్రప్రదేశ్​ హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్పందించారు. రాష్ట్రానికి చెందిన పలువురు మహిళా నేతలు రాష్ట్రపతిని కలిసి అందజేసిన ఫిర్యాదును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపింది. ఈ వ్యవహారంలో తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి కార్యాలయం సూచించింది.

మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యవహారంపై రాష్ట్రానికి చెందిన డిగ్నిటీ ఫర్‌ ఉమెన్‌ జేఏసీ నేతలు ఇటీవల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌కడ్‌తో పాటు జాతీయ మహిళా కమిషన్‌, పలువురు కేంద్రమంత్రులకు ఫిర్యాదు చేశారు. అయితే, రాష్ట్రపతికి ఇచ్చిన ఫిర్యాదుపై రాష్ట్రపతి కార్యాలయం తాజాగా స్పందించింది. ఈ నెల 23న మహిళా జేఏసీ నేతలంతా రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేశారని.. ఆ కాపీని సీఎస్‌కు పంపి దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించినట్టు తెలిపింది. ఈ మేరకు మహిళా జేఏసీ కన్వీనర్‌ చెన్నుపాటి కీర్తికి సమాచారం ఇస్తూ లేఖ పంపింది.

గతంలో గవర్నర్​ను కలిసిన మహిళ ఐకాస నేతలు: ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంతో పాటు మూడేళ్లుగా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై అఖిలపక్షాల మహిళా ఐకాస నేతలు గవర్నర్​ బిశ్వభూషణ్​ హరిచందన్​కు నివేదిక ఇచ్చారు. ఈ నెల 12వ తేదీన రాజ్​భవన్​లో గవర్నర్​ను కలిసిన అఖిలపక్షాల మహిళా ఐకాస నేతలు.. నిబంధనలు అతిక్రమించి ప్రవర్తించిన ప్రజా ప్రతినిధులపై చర్యలు ఉండకపోవటంతో పాటు అధికారులు, మంత్రులు తప్పు చేసిన వారిని వెనకేసుకొస్తున్న తీరును వివరించారు. కేంద్ర ఫోరెన్సిక్​కి ఎంపీ వీడియో వ్యవహారం అప్పగించాలని కోరారు. ప్రజా ప్రతినిధులు మహిళల పట్ల ఎలా ఉండాలనే దానిపై శిక్షణ తరగతులు ఉండాలని సూచించారు.

మహిళా కమిషన్, డీజీపీకి లేఖ: ఈ వ్యవహారంపై తక్షణం విచారణ జరిపి నిజాలు నిగ్గుతేల్చాలని మహిళా కమిషన్‌ డీజీపీకి లేఖ రాసింది. విచారణ జరిపి ఎంపీ గోరంట్లపై చర్యలు చేపట్టాల్సిందిగా ప్రభుత్వానికి మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ సూచించారు. మహిళాలోకానికి తలవంపులు తెచ్చిన ఈ ఘటనలో నిజానిజాలు నిగ్గు తేల్చాలని ఆమె డీజీపీని కోరారు.

అసలేం జరిగిందంటే: హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఓ మహిళతో నగ్నంగా వీడియో కాల్‌లో మాట్లాడుతున్నట్లున్న వీడియో ఒకటి కలకలం రేపింది. ఆగస్టు 4న (గురువారం) ఉదయం 8 గంటల సమయంలో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైన ఈ వీడియో.. కొద్దిసేపటికే విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ఎంపీ మాధవ్‌ నగ్నంగా ఓ మహిళతో వీడియో కాల్‌లో మాట్లాడటాన్ని రికార్డు చేసి, ఆ వీడియోను మరో ఫోన్‌తో చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది.

ఆగస్టు 3వ తేదీ బుధవారం రాత్రి ఫేస్‌బుక్‌ మెసెంజర్‌లో తొలుత ఈ వీడియో వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. కాసేపటికి ట్విటర్‌లోనూ కొంతమంది దాన్ని షేర్‌ చేశారు. గురువారం ఉదయం ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. దీనిపై గోరంట్ల మాధవ్‌ స్పందిస్తూ ఆ వీడియో నకిలీది అనీ, తాను జిమ్‌లో కసరత్తు చేస్తున్న వీడియోను మార్ఫింగ్‌ చేశారని చెప్పారు. ఇదంతా తెదేపా, కొంతమంది మీడియా వ్యక్తుల కుట్ర అని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు.

ఇవీ చదవండి: గోరంట్ల మాధవ్​పై చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతికి ఫిర్యాదు

ఆ విషయం నాకు ముందే తెలుసు.. వీడియోను పెద్దగా పట్టించుకోలేదు: గోరంట్ల మాధవ్‌

హిజాబ్‌ బ్యాన్​పై సుప్రీం కీలక నిర్ణయం, రఫేల్​ స్కామ్​పై విచారణకు నో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.