Corona Tests : తస్మాత్ జాగ్రత్త... జ్వరం, జలుబే కదా అని నిర్లక్ష్యం వహిస్తే...

author img

By

Published : Oct 14, 2021, 6:47 AM IST

Corona Tests

కరోనా కాస్త నెమ్మదించడంతో.. అది మనల్ని వీడిపోయిందని అపోహ పడుతున్న కొందరు ఆ లక్షణాలు(corona symptoms) కనిపిస్తున్నా పరీక్షలు చేయించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. వైరల్‌ జ్వరమనే భ్రమలో ఉండిపోతున్నారు. జ్వరం, జలుబే కదా ఏమవుతుందనే భావన ఒక్కోసారి తీవ్ర అనారోగ్యానికి దారి తీస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. రక్తంలో ఆక్సిజన్‌ స్థాయులు పడిపోయి చివరికి ఐసీయూలో చేరాల్సిన పరిస్థితి తలెత్తుతోంది.

  • హైదరాబాద్‌లోని ఓ వైద్యుడు 8 నెలల క్రితం కరోనా టీకా తీసుకున్నారు. ఇటీవల ఆయనలో దగ్గు, జలుబు, జ్వరం తదితర లక్షణాలు కనిపించాయి. వైరల్‌ జ్వరంగా భావించి మందులు వేసుకున్నారు. వారం అయినా జ్వరం తగ్గకపోగా ఆక్సిజన్‌ స్థాయులు పడిపోయాయి. వెంటనే సికింద్రాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరి పరీక్షలు చేయించుకోగా కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. ఐసీయూలో పది రోజులపాటు 20 లీటర్ల ఆక్సిజన్‌ అందించడంతో కోలుకున్నారు.
  • ప్రైవేటు ఉద్యోగి నరేశ్‌ గత అయిదారు రోజుల నుంచి దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్నారు. వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ అని భావించి, కరోనా పరీక్ష చేయించుకోవడంలో నిర్లక్ష్యం వహించారు. సొంత వైద్యంతో నెట్టుకొచ్చారు. వారం దాటినా జ్వరం, దగ్గు తగ్గలేదు. ఇతర ఇబ్బందులూ తలెత్తడంతో వైద్యుణ్ని సంప్రదించి, ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేయించారు. పాజిటివ్‌ వచ్చింది. 15 రోజుల చికిత్స తర్వాత ఆరోగ్యం నయమైంది.

కరోనా(Covid) తగ్గుముఖం పట్టిందని కొందరు నిర్లక్ష్యంగా ఉంటున్నారు. మాస్కు, శానిటైజర్ వాడకం, భౌతికదూరం పాటించడం వంటి నిబంధనలకు గాలికి వదిలేస్తున్నారు. జలుబు, జ్వరం, దగ్గు వంటివి సోకితే.. సీజనల్​ వ్యాధులని భావించి సొంత వైద్యం చేసుకుంటున్నారు. పరిస్థితి తీవ్రమైనప్పుడు పరీక్ష చేయిస్తే కొవిడ్ పాజిటివ్​గా(Corona tests) తేలుతోంది. అప్పటికే శరీరంలో ఆక్సిజన్ స్థాయి పడిపోయి పరిస్థితి విషమంగా మారుతోంది. కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోతున్నాయి. ఇటీవల గాంధీ ఆసుపత్రిలో రోజూ పది మంది వరకు తీవ్ర కరోనా లక్షణాలతో చేరుతున్నారు. నిజానికి కొవిడ్‌ కేసుల సంఖ్య ఇటీవల బాగా తగ్గిపోయినా కొందరు టీకా తీసుకోకపోవడం, లక్షణాలు కనిపించినా ఆఖరి వరకు పరీక్షలకు దూరంగా ఉండటంతోనే వారిలో వైరస్‌ తీవ్రత పెరుగుతోందని అంటున్నారు వైద్యులు. మరికొందరు పరీక్షల్లో నెగెటివ్‌ రావడంతో అంతటితో ఆగిపోతున్నారు. ఇలాంటి వారిలో కొందరు ఆక్సిజన్‌ శాతం పడిపోయి ఆఖరి నిమిషంలో వైద్యులను సంప్రదిస్తున్నారు. ప్రస్తుతం 18 ఏళ్లు, ఆపైబడిన వారికే వ్యాక్సిన్‌ వేస్తున్నారు. పాఠశాలలు తెరచుకోవడంతో పిల్లలు బడులకు వెళుతున్నారు. ముఖ్యంగా విద్యార్థుల్లో కరోనా లక్షణాలు కనిపిస్తే, నిర్లక్ష్యం చేయకుండా పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

చూడ చూడ తేడాలు వేరు..

  • సాధారణ వైరల్‌ ఫీవర్‌, కొవిడ్‌ లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటాయి. తరచి చూస్తే తేడాలు కనిపిస్తాయి.
  • వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌లో జ్వరంతోపాటు జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు ఉంటాయి. 3-5 రోజుల్లో తగ్గిపోతాయి.
  • కరోనాలో ఇవే లక్షణాలతోపాటు ఆయాసం రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిలు పడిపోవడం కనిపిస్తాయి.
  • కొందరికి రక్తంలో ఆక్సిజన్‌ స్థాయులు తగ్గినా బయటకు ఎలాంటి లక్షణాలు ఉండవు. ఇదే కొన్నిసార్లు తీవ్ర ముప్పుగా పరిణమించే అవకాశం ఉంటుంది.
  • అందుకే కొవిడ్‌ లక్షణాలు కనిపిస్తే తక్షణం పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

పరీక్షలకు వెనకడుగు వద్దు

డాక్టర్‌ శివరాజ్‌, సీనియర్‌ ఫిజీషియన్‌

"కరోనా లక్షణాలున్నా కొందరు పరీక్షలకు వెనకడుగు వేస్తున్నారు. సాధారణ వైరల్‌ జ్వరమైతే 3-5 రోజుల్లో తగ్గిపోతుంది. ఇంకా జ్వరం, ఆయాసం, దగ్గు కొనసాగుతుంటే వెంటనే ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేయించుకోవాలి."

- డాక్టర్‌ శివరాజ్‌, సీనియర్‌ ఫిజీషియన్‌

నెగెటివ్‌ వచ్చినా నిర్లక్ష్యం చేయొద్దు

- డాక్టర్‌ రాజారావు, సూపరింటెండెంట్‌, గాంధీ ఆసుపత్రి

కొవిడ్‌ లక్షణాలు ఉండి, ర్యాపిడ్‌ యాంటిజెన్‌, ఆర్టీపీసీఆర్‌ రెండు పరీక్షల్లోనూ నెగెటివ్‌ రాగానే కొందరు తమకు కరోనా లేదని ధీమాగా ఉంటున్నారు. తర్వాత పరిస్థితి విషమంగా మారుతోంది. గాంధీకి వచ్చే కరోనా బాధితుల్లో ఇలాంటి వారే ఉంటున్నారు. ఐసీయూ చికిత్సలతో కొందరు కోలుకుంటున్నారు. తీవ్రమైన దగ్గు, జ్వరం, ఆయాసం ఉన్నప్పుడు నెగెటివ్‌ వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా, వైద్యుల సూచనలతో ఛాతీ సిటీస్కాన్‌ తీయించుకోవాలి.

- డాక్టర్‌ రాజారావు, సూపరింటెండెంట్‌, గాంధీ ఆసుపత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.