Revanth Reddy : అన్ని పార్టీలను ఒకే గొడుగు కిందకు తెస్తున్నాం : రేవంత్​

author img

By

Published : Sep 22, 2021, 3:53 PM IST

Revanth Reddy

ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ ఇద్దరూ ఒక్కటే అని... ప్రజల నడ్డి విరుస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి (Revanth Reddy ) విమర్శించారు. పన్నుల రూపంలో దోచుకుంటున్నారని ఆరోపించారు. హరితహారం ముసుగులో పోడు భూములను కేసీఆర్​ గుంజుకుంటున్నారని మండిపడ్డారు. జాతి సంపదను ప్రధాని మోదీ... అధాని, అంబానీలకు పంచి పెడుతున్నారని అన్నారు.

అన్ని పార్టీలను ఒకే గొడుగు కిందకు తెస్తున్నాం : రేవంత్​

రాష్ట్రంలో పోడు భూముల కోసం కొట్లాట మొదలయిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy ) అన్నారు. మహిళలు అని చూడకుండా డెకాయిట్ కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. హరిత హారం ముసుగులో పోడు భూములు గుంజుకుంటున్నారని మండిపడ్డారు. భూములతో పాటు మా ప్రాణాలు కూడా తీసుకోండి అని గిరిజనులు చెప్తున్నారని... పోరాడి సాధించుకున్న తెలంగాణ నలుగురి చేతుల్లో బంది అయిందని విమర్శించారు. హైదరాబాద్‌ ఇందిరా పార్కు వద్ద కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో తెరాస, భాజపాయేతర పార్టీల మహాధర్నా నిర్వహించారు.

పన్నుల రూపంలో దోచుకుంటున్నారు

సీఎం కేసీఆర్ (KCR), ప్రధాని మోదీ (PM MODI)ఇద్దరూ ఒక్కటే అని... ​పన్నుల రూపంలో ప్రజల నడ్డి విరుస్తున్నారని రేవంత్ రెడ్డి (Revanth Reddy ) విమర్శించారు. కేంద్రం, రాష్ట్రం పన్నుల రూపంలో దోచుకుంటున్నాయని ఆరోపించారు. 24 లక్షల కోట్ల రూపాయలు పెట్రోల్, డీజిల్ రూపంలో వసూలు చేశారని పేర్కొన్నారు. నల్లధనం బయటకు తెస్తానని మోదీ చెప్పారని... ప్రతి పేద కుటుంబానికి 15 లక్షలు బాకీ పడ్డారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రైల్వే స్టేషన్​లు కడితే.. మోదీ రైళ్లు అమ్ముతున్నారని మండిపడ్డారు.

అన్నింటిని అమ్మేస్తున్నారు

నోట్ల రద్దు ఒక విష ప్రయోగం. ప్రభుత్వ ఆస్తులు, ప్రజా రవాణా, ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని అమ్ముతున్నారు. 6 లక్షల కోట్లకు ప్రభుత్వ సంస్థలను అమ్ముతున్నారు. ఒకప్పుడు ఈ సంస్థలను పెట్టి జాతికి అంకితం చేసింది కాంగ్రెస్ పార్టీ. జాతి సంపదను ప్రధాని మోదీ... అధాని, అంబానీలకు పంచి పెడుతున్నారు. మేము ఇద్దరం... మాకు ఇద్దరు అనే రీతిలో దేశాన్ని పట్టి పీడిస్తున్నారు. స్వాతంత్య్రం తర్వాత మొదటి సారిగా దేశం తిరోగమనంలో పయనిస్తోంది.

- రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

బంధువులకు కట్టబెడుతున్నారు

అన్ని పార్టీలను ఒకే గొడుగు కిందకు తెస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు ఎన్నికలు లేవని... తమకు ఎటువంటి రాజకీయాలు లేవన్నారు. దేశం, రాష్ట్రం గురించే తమ పోరాటమని స్పష్టం చేశారు. వేల కోట్ల రూపాయలు కేసీఆర్ బంధువులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రం, దేశం పెను ప్రమాదంలో పడిందని... ఈ నెల 27న నిర్వహించే భారత్ బంద్​ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో బంద్ సంపూర్ణంగా జరగాలని సూచించారు.

కేసీఆర్ ఆటలు సాగవు

ఆదిలాబాద్ నుంచి అశ్వరావుపేట వరకు పోడు భూముల పోరాటం చేస్తామని రేవంత్ రెడ్డి (Revanth Reddy ) తెలిపారు. భద్రాచలం బంద్​లో తాను పాల్గొంటానని చెప్పారు. పోడు భూములకు పట్టాలు ఎలా ఇవ్వరో చూద్దామన్నారు. ఉప సంఘం పేరుతో కేసీఆర్ కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప సంఘం వేస్తే అటవీ శాఖ అధికార్లను ఎలా పంపుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ గడ్డ మీద కేసీఆర్ ఆటలు సాగవన్నారు. అందరం అనుకుంటే సీఎంను గద్దె దించడం పెద్ద పనేం కాదని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి : ఇందిరాపార్కు వద్ద మహాధర్నా... సాగు చట్టాలు, పెట్రో ధరల పెంపుపై నిరసన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.