ETV Bharat / city

Omicron Cases Hyderabad Today : తప్పుడు అడ్రస్​ ఇచ్చి తప్పించుకునేందుకు యత్నం

author img

By

Published : Dec 18, 2021, 7:14 AM IST

Omicron Cases Hyderabad, హైదరాబాద్​లో ఒమిక్రాన్
హైదరాబాద్​లో ఒమిక్రాన్ కేసులు

Omicron Cases Hyderabad Today : విదేశాల నుంచి హైదరాబాద్​ వస్తున్న వారు విమానాశ్రయంలో తప్పుడు చిరునామాలు ఇస్తూ అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారి ఆరోగ్యస్థితిపై ఆరా తీయడానికి వైద్య సిబ్బంది వారిచ్చిన చిరునామాకు వెళ్తే చాలా మంది తప్పుడు అడ్రస్​లు ఇచ్చినట్లు తేలింది. పోలీసులు రంగంలోకి దిగడంతో చాలా కష్టంగా వారిని కనిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

Omicron Cases Hyderabad Today : ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్‌ భయాందోళనలు కొనసాగుతున్న వేళ.. విదేశాల నుంచి భాగ్యనగరానికి వస్తున్న వారు తప్పుడు చిరునామాలు ఇస్తూ అధికారులకు మస్కా కొడుతున్నారు. వైద్య సిబ్బందిని, పోలీసులను తిప్పలు పెడుతున్నారు. ఈ నెల 14న కెన్యా నుంచి వచ్చిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్‌ ఉన్నట్లు నిర్ధారణ అయింది. వైద్యాధికారులు అతను విమానాశ్రయంలో ఇచ్చిన చిరునామా ప్రకారం పారామౌంట్‌ కాలనీకి వెళితే తప్పుడు అడ్రస్‌ అని తేలింది. పోలీసుల సాయంతో అతని ఆచూకీ గుర్తించారు. పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు.

చాలామందిదీ అదే దారి..

Omicron Cases Hyderabad Latest : విదేశాల నుంచి వచ్చే చాలామంది తప్పుడు చిరునామాలు, ఫోన్‌ నంబర్లు ఇచ్చి ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. ప్రస్తుతం మాల్దీవులు, కౌలాలంపూర్‌, కొలంబో, సింగపూర్‌, బ్రిటన్‌, షార్జా, అబుదాబీ, దోహా, దుబాయ్‌, బహ్రెయిన్‌, మస్కట్‌, కువైట్‌ నుంచి ఎక్కువ మంది వస్తున్నారు. బ్రిటన్‌, సింగపూర్‌ నుంచి వచ్చిన వారి చిరునామాలు, ఫోన్‌ నంబర్లు పోలీసులు, వైద్య సిబ్బంది వద్దకు చేరుతున్నాయి. పరిస్థితిని తెలుసుకునేందుకు వెళ్తే.. అక్కడ అలాంటి వారు ఎవరూ లేరనే సమాధానం వస్తుండటంతో అవాక్కవుతున్నారు. గోల్కొండ పరిధి పారామౌంట్‌కాలనీలో ఒమిక్రాన్‌ కేసులు బయటపడటంతో వైద్య ఆరోగ్య, జీహెచ్‌ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగి పరీక్షలు చేపట్టారు. చాలామంది విదేశీయులు సహకరించడం లేదని వాపోతున్నారు. పోలీసుల సాయం తప్పనిసరి అవుతోందని చెప్పారు.

అప్పట్లోనే పకడ్బందీ..

Omicron Cases Telangana Today : కొవిడ్‌ తొలి, మలి దశల్లో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అధికారులు పకడ్బందీగా వ్యవహరించేవారు. విదేశాల నుంచి వచ్చినవారిని క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించేవారు. అక్కడే 10 రోజుల వరకు వైద్యుల పర్యవేక్షణలో ఉంచేవారు. రెండుసార్లు టెస్టుల తర్వాత ఎలాంటి వైరస్‌ బయట పడకపోతే ఇళ్లకు పంపించేవారు. ప్రస్తుతం ముప్పున్న దేశాల నుంచి వచ్చేవారికే ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేస్తున్నారు. నెగెటివ్‌ వస్తే ఇళ్లకు పంపిస్తున్నారు. కొందరిలో ఇంటికి వెళ్లాక లక్షణాలు బయటపడుతున్నాయి. అప్పటికే వారు చాలాచోట్ల తిరుగుతూ వైరస్‌ వ్యాప్తికి కారకులవుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు పకడ్బందీగా హోం ఐసొలేషన్‌ అమలు చేస్తేనే ప్రయోజనం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.