ETV Bharat / city

Student Name Registration Issues : సర్కార్ బడికి ప్రైవేట్ విద్యార్థులు.. పేర్ల నమోదులో తిప్పలు

author img

By

Published : Oct 14, 2021, 7:12 AM IST

Student Name Registration Issues
Student Name Registration Issues

కరోనా మహమ్మారి విద్యార్థుల భవిష్యత్​ను తారుమారు చేసింది. కొవిడ్ సృష్టించిన విలయతాండవం వల్ల చాలా మంది తల్లిదండ్రులు తమ ఆర్థిక పరిస్థితి బాగాలేక.. పిల్లలను ప్రైవేట్ పాఠశాలల నుంచి సర్కార్ బళ్లకు పంపుతున్నారు. కానీ.. ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థుల పేర్ల నమోదు(Student Name Registration Issues)లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రైవేట్ స్కూళ్లు చైల్డ్ ఇన్ఫో పోర్టల్(Child Info Portal) నుంచి విద్యార్థుల పేర్లు తొలగించకపోవడం వల్ల సర్కారు బడుల్లో వారి పేరు నమోదు(Student Name Registration Issues) సాధ్యం కావడం లేదు.

రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ బడుల్లో చేరే విద్యార్థుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తల్లిదండ్రులు తమ పిల్లలను గతంలో మాదిరిగా ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడానికే మొగ్గు చూపుతున్నారు. అయితే.. సాంకేతిక కారణాల వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో పేర్ల నమోదు(Student Name Registration Issues)కు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

తెలంగాణలో ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ బడుల్లో ప్రవేశం పొందిన విద్యార్థుల సంఖ్య ఏకంగా 2.20 లక్షలకు చేరింది. ఈ విద్యాసంవత్సరం (2021-22) ఆగస్టు 15వ తేదీ నాటికి 1.14 లక్షల మంది చేరినట్లు వెల్లడించిన పాఠశాల విద్యా శాఖ.. తాజాగా ఆ సంఖ్య 2.20 లక్షలకు పెరిగిందని తెలిపింది. వీరంతా సాధారణ బడులతోపాటు విద్యాశాఖ పరిధిలోని ఆదర్శ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల్లో ప్రవేశాలు పొందారు. కరోనా కారణంగా పిల్లల తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి తారుమారైంది. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు చెల్లించే స్తోమత లేకపోవడానికితోడు వాటిలో ఆన్‌లైన్‌ తరగతులకు భారీగా రుసుములు వసూలు చేస్తుండటంతోనే తల్లిదండ్రులు విద్యార్థులను ప్రభుత్వ బడుల్లో చేర్పిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ఈ సారి ఒకటో తరగతిలో దాదాపు 1.80 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలు పొందారు. పదో తరగతి విద్యార్థులు 2 లక్షల మందికిపైగా ఉత్తీర్ణులై కళాశాలల్లో ప్రవేశం పొందారు. అంతమొత్తం సంఖ్యలో ఒకటో తరగతిలో చేరాల్సి ఉండగా.. తక్కువగా నమోదయ్యారు. జనాభా వృద్ధి శాతం తగ్గిపోతుండటమే దీనికి కారణమని అధికారులు చెబుతున్నారు. అయితే.. ప్రైవేటు నుంచి వలసలు ఇంకా కొనసాగుతుండటంతో నమోదు సంఖ్య మరింత పెరిగే అవకాశముందని విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

టీసీలు లేకుండానే..

ప్రైవేట్‌ పాఠశాలల చైల్డ్‌ ఇన్ఫో పోర్టల్‌(Child Info Portal) నుంచి విద్యార్థుల పేర్లు తొలగించకపోవడంతో సర్కారు బడుల్లో వారి నమోదు సాధ్యం కావడం లేదు. ఫీజు బకాయిలు ఉన్నందున ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులకు బదిలీ పత్రా(టీసీ)లు ఇవ్వడం లేదు. విద్యాహక్కు చట్టం ప్రకారం.. 8వ తరగతి వరకు టీసీలు లేకున్నా బడుల్లో చేర్చుకోవచ్చు. ఆ వెసులుబాటు వల్ల తల్లిదండ్రులు తమ పిల్లలను టీసీలు లేకుండానే సర్కారు బడుల్లో చేర్పించారు. కొత్తగా చేరిన చోట చైల్డ్‌ ఇన్ఫో పోర్టల్‌లో నమోదు చేయడానికి గతంలో చదివిన పాఠశాల నుంచి పేరు తొలగించాలి. ఈ కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల పేర్లు నమోదు(Student Name Registration Issues) కావడం లేదు. విద్యార్థుల పేర్లతో ఆధార్‌ సంఖ్య అనుసంధానమవడంతో ఏదైనా ఒక చోటే పేరు ఉంటుంది. తల్లిదండ్రుల అంగీకారంతో ఎంఈవోలు పాత పాఠశాలలోని పేరును తొలగించవచ్చు. అయితే.. తమ ఫీజు చెల్లించకుండా పేరు ఎలా తొలగిస్తారని ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు ప్రశ్నిస్తుండటంతో అధికారులు కూడా వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం.

మూతబడిన పాఠశాలలు పునఃప్రారంభం

పిల్లలు రాకపోవడంతో ఎన్నో సంవత్సరాలుగా మూతపడి ఉన్న ప్రభుత్వ పాఠశాలలు ఈ ఏడాది తెరుచుకుంటున్నాయి. రాష్ట్రంలో ఒక్క విద్యార్థీ లేక 1,201 బడులు మూతపడ్డాయి. అందులో ఈసారి 212 పునఃప్రారంభమయ్యాయి. వాటిలో ప్రస్తుతం 3,500 వరకు విద్యార్థులు ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.