ETV Bharat / city

మూలాలు తేలని వింత వ్యాధి... జాతీయ సంస్థల పరీక్షలపైనే ఆశలు

author img

By

Published : Dec 8, 2020, 5:03 AM IST

Updated : Dec 8, 2020, 8:20 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని ఏలూరులో అంతుచిక్కని వ్యాధి సృష్టించిన కలకలం కొనసాగుతూనే ఉంది. ఓపక్క వ్యాధి మూలాలేమిటో తెలియకపోవడం, మరోవైపు ఆసుపత్రులకు వచ్చే బాధితుల సంఖ్య తగ్గకపోవడం కలవరపెడుతోంది. వరుసగా మూడో రోజు కూడా మూర్ఛ, ఇతర లక్షణాలతో వంద మందికిపైగా జిల్లా ఆసుపత్రిలో చేరారు. బాధితుల సంఖ్య 400 దాటింది. బాధితుల నుంచి రక్తం, ప్రభావిత ప్రాంతాల నుంచి నీరు, ఆహార నమూనాలను సేకరించి స్థానికంగానూ, రాష్ట్ర స్థాయిలో పరిశీలించినా ఎలాంటి స్పష్టతా రాలేదు. దీంతో జాతీయ పరిశోధన సంస్థల పరీక్షలపైనే ఆశలన్నీ నిలిచాయి.

mystery-illness-cases-rise-in-eluru-westgodavari-district-officials-still-clueless
మూలాలు తేలని వింత వ్యాధి... జాతీయ సంస్థల పరీక్షలపైనే ఆశలు


గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్​లోని ఏలూరులో వివిధ ప్రాంతాల నుంచి 22 నీటి నమూనాలను, 9 చోట్ల పాల నమూనాలను సేకరించి విజయవాడ, గుంటూరు, ఏలూరులోని ప్రయోగశాలల్లో పరీక్షించారు. బాధితుల నుంచి 52 రక్త నమూనాలు, వెన్నుపూస నుంచి 35 నమూనాలు సేకరించి పరీక్షకు పంపారు. వీటి నివేదికల్లో అనుమానించదగ్గ లక్షణాలేవీ కనిపించలేదు. ఐఐసీటీ, ఎయిమ్స్‌, సీసీఎంబీలకు నీటి, రక్త, మల, మూత్ర నమూనాలతోపాటు బాధితుల ఇళ్ల నుంచి ఆహార నమూనాలు పంపించినట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు ఐసీఎంఆర్‌- ఎన్‌ఐఎన్‌ బృందం కూడా రంగంలోకి దిగింది. అంటురోగ పరిశోధన విభాగం శాస్త్రవేత్త డా.జేజే బాబు నేతృత్వంలో 9 మంది ఎన్‌ఐఎన్‌ శాస్త్రవేత్తల బృందం సోమవారం రాత్రికి ఏలూరు చేరుకుంది. వైద్యాధికారులను కలిసి పరిస్థితిని సమీక్షించింది. బాధితుల రక్త నమూనాలు సేకరించడంతోపాటు ఆహారం, తాగునీటి కల్తీ అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ‘మొదట ఇక్కడే పరీక్షలు చేసి ప్రాథమిక అవగాహనకు వస్తాం. తర్వాత నమూనాలను హైదరాబాద్‌కు తీసుకెళ్లి ఎన్‌ఐఎన్‌లో పూర్తి స్థాయిలో పరీక్షించి కారణాలను కనుక్కొంటాం’ అని డా.జేజే బాబు ‘ఈనాడు’కు చెప్పారు. డా.సిన్హా, డా.అనంతన్‌, డా.మహేష్‌కుమార్‌, డా.రాఘవేంద్ర, డా.నవీన్‌కుమార్‌, డా.శ్రీను, శ్రీరామకృష్ణ, నస్రావలి ఈ బృందంలో ఉన్నారు. మరోవైపు ఆహార కల్తీ ఏమైనా జరిగి ఉంటుందా అనే కోణంలో పరీక్షించేందుకు బాధితుల ఇళ్ల నుంచి మిరప, కందిపప్పు, వంటనూనెల నమూనాలను కూడా సేకరిస్తున్నారు.


నీరు, ఆహారం కలుషితమైతే..

- నీరు లేదా ఆహారం కలుషితమైతే.. ఇంట్లో వారందరిపైనా ప్రభావం చూపాలి. ఇక్కడ కుటుంబంలో ఒకరు లేదా ఇద్దరు మాత్రమే అస్వస్థతకు గురయ్యారు. చాలా కుటుంబాల్లో అసలు ఈ సమస్య కనిపించలేదు.
- పంది మాంసం తిన్నా, దాని విసర్జితాలు నీటిలో కలిసినా టీనియా వామ్స్‌ (బద్దె పురుగుల) వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు. దీని ప్రభావం కడుపునొప్పి రూపంలో బయటపడే అవకాశం ఉంది. ఇక్కడ కడుపునొప్పితో వచ్చిన కేసులే లేవు.
- నమూనాల పరీక్షల్లోనూ అనుమానించేలా లక్షణాలేవీ కనిపించలేదు. ఇలాంటి లక్షణాలతో గతంలో ఏదైనా వ్యాధి బయటపడిందా అని వైద్యులు అంతర్జాలంలోనూ శోధిస్తున్నారు.
- మరోవైపు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు వాతావరణ, వాయు కాలుష్యంపైనా దృష్టి పెట్టారు.


లక్షణాలున్నా సొంత వైద్యం!
మరోవైపు వింత వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నవారు ఎవరైనా ఆసుపత్రికి రాకుండా ఇళ్లలో ఉన్నారా అని వైద్య, ఆరోగ్య శాఖ ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తోంది. సుమారు 10 మందిని గుర్తించి ఆసుపత్రికి పంపించారు. లక్షణాలున్నా.. కొందరు సొంత వైద్యంతో కాలయాపన చేస్తున్నారని, దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు పేర్కొన్నారు.


పనులు చేస్తూనే కుప్పకూలి..


- ఏలూరు ఆముదాల అప్పలస్వామి కాలనీకి చెందిన కోనాడ రాజు సిమెంటు పనులు చేస్తూ ఫిట్స్‌ రావడంతో పడిపోయాడు. ఫిట్స్‌ కారణంగా పెదవులను కొరుక్కోవడంతో రక్తం వచ్చింది.
- చోడుదిబ్బ ప్రాంతానికి చెందిన ఏడాది వయసున్న ఇళ్ల కుశలవిరాజ్‌కు ఫిట్స్‌ రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. కొద్ది సేపటి వరకు తేరుకోలేదు.
- దెందులూరు మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన పాలపర్తి కల్యాణి ఏలూరులో వివాహ కార్యక్రమానికి వచ్చి వారం రోజులుపాటు అక్కడే ఉన్నారు. ఆదివారం తిరిగి వెళ్లారు. సోమవారం సాయంత్రం ఫిట్స్‌ రావడంతోపాటు నోటి వెంట నురగలు వచ్చాయి. ఆమెను ఏలూరు ఆసుపత్రికి తీసుకువచ్చిన తర్వాత చాలాసేపటి వరకు తగ్గలేదు.

మెదడుపైనే ప్రభావం!


మూర్ఛ, తల, కళ్లు తిరుగుతుండటం వంటి లక్షణాలతోనే బాధితులను సోమవారం ఆసుపత్రికి తరలించారు. కేవలం మూర్ఛ, తల, కళ్లు తిరుగుతుండటం, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలతోపాటు చికిత్స అందించిన వెంటనే కోలుకుంటుండటంతో వ్యాధికి కారణాలేమిటో అవగాహనకు రాలేకపోతున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా మెదడును వింత వ్యాధి ప్రభావితం చేస్తోందని, దానికి అనుగుణంగా చికిత్స అందించాలని, ఆ దిశగానే పరిశోధనలు జరగాల్సి ఉందని న్యూరో ఫిజీషియన్‌ ఒకరు పేర్కొన్నారు. పలువురు బాధితులకు కంటిలోని నల్లగుడ్డు వద్ద తెల్లటి మచ్చలను గుర్తించామని, దీన్ని నిశితంగా పరిశీలించాల్సి ఉందని మరో సీనియర్‌ వైద్యుడు చెప్పారు.

ఐఐసీటీలో పరిశోధన ప్రారంభం

అంతుచిక్కని వ్యాధితో ప్రజలు అస్వస్థతకు గురైన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని ప్రభావిత ప్రాంతాల నుంచి నీటి నమూనాలను సేకరించి హైదరాబాద్‌లోని ఐఐసీటీకి పంపించారు. సోమవారం రాత్రికి నమూనాలు ప్రయోగశాలకు చేరుకున్నాయని.. వెంటనే శాస్త్రవేత్తలు వీటిపై పరిశోధనలు ప్రారంభించారని ఐఐసీటీ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నానికల్లా ఫలితం వచ్చే అవకాశముంది. మరోవైపు బాధితుల నుంచి సేకరించి పంపిన 15 నమూనాలపై హైదరాబాద్‌లోని కేంద్ర పరిశోధన సంస్థ సీసీఎంబీలో పరిశోధనలు ప్రారంభించినట్లు ఆ సంస్థ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా వెల్లడించారు. బాధితుల వాంతి, మూత్ర నమూనాలు తెప్పించి సమగ్ర పరిశోధనలు చేయనున్నట్లు తెలిపారు. ఫలితాలు వెల్లడయ్యేందుకు వారం నుంచి పదిరోజులు పడుతుందని చెప్పారు.

ఇదీ చదవండి : 'హైదరాబాద్​ గడ్డమీద వ్యాక్సిన్​ తయారు కావడం గర్వకారణం'

Last Updated : Dec 8, 2020, 8:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.