మూసీ ఉగ్రరూపం.. పరీవాహక ప్రాంతాల్లోని బస్తీలను ముంచెత్తిన వరద

author img

By

Published : Jul 28, 2022, 4:31 AM IST

మూసీ ఉగ్రరూపం
మూసీ ఉగ్రరూపం ()

హైదరాబాద్‌లో ఉప్పొంగుతున్న మూసీ నదితో పరివాహక ప్రాంత ప్రజల భయం గుప్పిట్లో మగ్గుతున్నారు. జంట జలాశయాలకు భారీ వరదలతో పొంగిపొర్లుతున్న మూసీ.... వంతెనలను, పరివాహక ప్రాంతంలోని కాలనీలను ముంచెత్తుతోంది. భారీ వర్షాలకు చెరువులు ఇప్పటికే నిండుకుండల్లా మారటంతో దిగువనున్న బస్తీలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నాయి.

మూసీ ఉగ్రరూపం దాల్చింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గ పరిధి, వికారాబాద్‌, అనంతగిరి కొండల్లో భారీవర్షం కురవడంతో జంటజలాశయాలైన ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ల్లోకి వరద పోటెత్తింది. ఈ రెండింటిలోకి బుధవారం సాయంత్రానికి 15 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. వచ్చిన దాన్ని వచ్చినట్లు అధికారులు దిగువకు విడిచి పెడుతున్నారు. ఉస్మాన్‌సాగర్‌లోకి రికార్డు స్థాయిలో వరద చేరింది. దాదాపు దశాబ్దం తర్వాత 15 గేట్లలో 13 గేట్లను ఆరడుగుల మేర ఎత్తడం గమనార్హం. 2020 అక్టోబరు నాటి వరదల్లో హిమాయత్‌సాగర్‌లోకే భారీగా వరద చేరడంతో మూసీలోకి విడిచిపెట్టారు. ప్రస్తుతం హిమాయత్‌సాగర్‌లో 17 గేట్లకు.. 8 గేట్లను 3 అడుగుల మేర ఎత్తి జలాలను కిందికి విడిచిపెడుతున్నారు. వరద పరిస్థితిని అంచనా వేసేందుకు జలమండలి ఎండీ దానకిషోర్‌, వివిధ శాఖల అధికారులు జంటజలాశయాలను పరిశీలించారు. బుధవారం రాత్రికి వరద తగ్గుముఖం పడుతుందని భావిస్తున్నారు. మరోవైపు భారీ వరదలతో మూసీ చుట్టుపక్కల బస్తీలు, కాలనీల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. స్థానికులను జీహెచ్‌ఎంసీ, పోలీసులు ఎక్కడికక్కడ అప్రమత్తం చేశారు. చాదర్‌ఘాట్‌, మూసారంబాగ్‌ వంతెనలు, హిమాయత్‌నగర్‌, మంచిరేవుల కాలినడక వంతెనలపై నుంచి వరద పొంగడంతో కొన్ని గంటలపాటు రాకపోకలను నిలిపివేసి, ప్రవాహం తగ్గాక పునరుద్ధరించారు.

.

3వేల మంది నిరాశ్రయులు: నగరంలో మూసీ ఉగ్రత ధాటికి చాదర్‌ఘాట్‌ నుంచి మూసారంబాగ్‌ వరకు నది పక్క బస్తీలలో పెద్దఎత్తున ఇళ్లు నీట మునిగాయి. 3వేల మంది నిరాశ్రయులయ్యారు. బాధితులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ఉదయం 3-4 అడుగుల ఎత్తున సాగిన ప్రవాహం సాయంత్రానికి కాస్త నెమ్మదించింది. చాదర్‌ఘాట్‌ కాజ్‌వేను తాకుతూ వరద పారింది. మూసారంబాగ్‌ వంతెనపై వరద ఉద్ధృతికి రెండువైపులా నిర్మించిన రక్షణ కంచె కొట్టుకుపోయింది.

యువకుడిని కాపాడిన పోలీసులు: మూసీ ఒడ్డు నుంచి నదిలోకి కొట్టుకుపోతున్న ఓ యువకుడిని పోలీసులు ప్రాణాలకు తెగించి కాపాడారు. ఘటన కుల్సుంపుర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పురానాపూల్‌ చౌరస్తా సమీపంలో వంతెన దిగువన మూసీనది నీటిలో ఓ యువకుడు కొట్టుకుపోతూ కేకలు వేసినట్లు స్థానికులు పోలీసులకు వెంటనే సమాచారం ఇచ్చారు. ఏసీపీ సతీష్‌కుమార్‌ సూచన మేరకు.. హబీబ్‌నగర్‌ సీఐ సైదబాబు, మంగళ్‌హాట్‌ ఎస్సై రాంబాబు, స్థానికులు కలిసి పరస్పరం చేతులు పట్టుకుని గొలుసుగా ఏర్పడి, బాధితుణ్ని కాపాడి ఒడ్డుకు చేర్చారు.

.

కొట్టుకుపోయిన కారు.. బయటపడిన డ్రైవరు: కుమురం భీం జిల్లా కెరమెరి మండలంలో బుధవారం సాయంత్రం అనార్‌పల్లి, అందుగూడ మధ్యలో ఉన్న ఒర్రెను దాటే క్రమంలో కారు వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. ప్రమాదాన్ని పసిగట్టిన అనార్‌పెల్లికి చెందిన డ్రైవరు రాజేష్‌ కారు దిగి.. ఒడ్డుకు పరుగెత్తాడు. కారు ఒర్రె ప్రవాహానికి కిలోమీటర్ల దూరం కొట్టుకుపోయింది. అసంపూర్తి వంతెన సమీపంలో చిక్కుకొని ఆగడంతో గ్రామస్థులు దానిని బయటకు తీశారు.

కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా టొక్కిగూడకు చెందిన ఆత్రం రాజు, కన్నీబాయి భార్యాభర్తలు. బుధవారం ఉదయం కన్నీబాయి, ఆమె కుమార్తె మాన్కుబాయి(16), బంధువులు టేకం మాన్కుబాయి, అయ్యుబాయిలు కలసి వెంకటాపూర్‌కు కూలీ పనులకు వెళ్లారు. సాయంత్రం తిరిగివస్తూ నాయకపుగూడ వాగు దాటుతుండగా హఠాత్తుగా ప్రవాహం పెరిగి ముగ్గురూ కొట్టుకుపోయారు. కన్నీబాయి, అయ్యుబాయిలు చెట్ల పొదల్లో చిక్కి బయటపడ్డారు. కానీ ఆత్రం మాన్కుబాయి(16) ఆచూకీ తెలియలేదు. రాత్రి కావడంతో గాలింపునకు వీలుకాలేదు.

గేదెలను వాగు దాటించబోయి..: కుమురం భీం జిల్లా రెబ్బెన మండలం వర్ధలగూడకు చెందిన పశువుల కాపరి అప్పం వెంకయ్య(55) బుధవారం ఉదయం పశువులను మేపేందుకు పెద్దవాగు వైపు వెళ్లాడు. గేదెలను వాగు నుంచి మళ్లిస్తుండగా నీటిలో మునిగిపోయాడు. వెంకయ్యకు భార్య అమ్మక్క, ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.