ETV Bharat / city

ఏడో ఏట దూరమై... 38 ఏళ్ల తర్వాత కలుసుకొని..

author img

By

Published : Oct 30, 2021, 1:38 PM IST

missing woman met family, missing woman story
అదృశ్యమైన మహిళ స్టోరీ, 38 ఏళ్ల తర్వాత తనవారికి కలిసిన మహిళ

కూతురు సరిగ్గా చదవడం లేదని, తన స్నేహితుడి ఇంట్లో ఉంచి చదివిస్తే.. ఆమె బాగుపడుతుందనుకున్నాడు. వెంటనే ఆమెను తీసుకొచ్చి హైదరాబాద్​లోని స్నేహితుడి ఇంట్లో విడిచివెళ్లాడు. రెండ్రోజులు గడవకముందే తల్లిమీద బెంగతో ఎవరికీ చెప్పకుండానే ఇంటికెళ్లాలని బయటకొచ్చేసింది. ఆమె చేసిన ఆ చిన్న తప్పే 38 ఏళ్ల పాటు ఆమెను తన కుటుంబానికి దూరం చేసింది. చివరకు ఆమె అల్లుడి ద్వారా తన సోదరులను కలుసుకుంది. ఆ క్షణాన ఆమె ఆనందానికి అవధులు లేకుండాపోయాయి.

ఏడో ఏట దూరమై... 38 ఏళ్ల తర్వాత కలుసుకొని..

చిన్నప్పుడు తప్పిపోయి, మరో కుటుంబంలో సభ్యురాలిగా ఎదిగినా ఆమెకు తన రక్తసంబంధీకులను కలుసుకోవాలనే కోరిక అలాగే ఉండిపోయింది. అమ్మానాన్నలు, అక్కలు, సోదరులు గుర్తొచ్చినప్పుడల్లా మౌనంగా విలపించేది. 45ఏళ్ల వయసులోనూ ఆమె తన పుట్టింటివారిని తలచుకొని కన్నీరు పెట్టుకోవడాన్ని చూసిన ఆమె అల్లుడు.. ఎలాగైనా తన అత్తను ఆమె కుటుంబానికి దగ్గర చేయాలని సంకల్పించారు. ఆమె చెప్పిన వివరాల ఆధారంగా సామాజిక మాధ్యమాల ఆసరాతో వారి జాడ తెలుసుకున్నారు. దాదాపు 38 ఏళ్ల నాడు దూరమైన తమ తోబుట్టువు ఫోన్‌ ద్వారా మాట్లాడడం, అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడంతో ఆమె సోదరులు ఉబ్బితబ్బిబ్బయ్యారు. హుటాహుటిన ఆమెను చూసేందుకు రెక్కలు కట్టుకొని వచ్చేశారు. అంతే.. ముగ్గురి కళ్ల నుంచి ఆనందబాష్పాలు ధారకట్టాయి. ఆంధ్రప్రదేశ్​లోని అమృతలూరు మండలం యలవర్రులో శుక్రవారం ఈ ఉదంతం చోటు చేసుకుంది.

వనపర్తి జిల్లా మదనాపూర్‌ మండలం నెలివెడి గ్రామానికి చెందిన క్యాసని నాగన్న, తారకమ్మ దంపతుల మూడో సంతానమైన మంగమ్మ తన ఏడో ఏట తండ్రితో కలిసి హైదరాబాద్​కు వచ్చింది. ఆమె సరిగ్గా చదవడం లేదని.. స్నేహితుడి దగ్గర ఉంచితేనైనా బాగా చదువుకుంటుందని అక్కడే వదిలివెళ్లిపోయాడు తండ్రి. మూడు రోజులు గడవకముందే అమ్మపై బెంగతో ఎవరికీ చెప్పకుండా తమ ఇంటికి వెళ్లేందుకు బయటకు వచ్చింది. అలా రోడ్లపై తిరుగుతున్న ఆమెను చూసిన ఓ వృద్ధుడు తల్లి వద్దకు తీసుకెళ్తానని మాయమాటలు చెప్పి, ఆమెకు అల్పాహారమిచ్చి రైలులో విజయవాడ తీసుకొచ్చాడు. అనంతరం ఆమెను గుంటూరు జిల్లా వేమూరు మండలం జంపని తెలుగు బాప్టిస్టు చర్చి వద్దకు తీసుకొచ్చాడు. తన మాట వినడంలేదని పాపను ఆ వృద్ధుడు కొడుతుండడంతో అక్కడివారు ప్రశ్నించి, ఆ చిన్నారిని ఎత్తుకొచ్చాడని నిర్ధారించుకొని అతన్ని వెళ్లగొట్టారు.

అయితే పాప బాగోగులు చూసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో గ్రామానికి చెందిన కనగాల సామేలు ఆ చిన్నారిని తన ఆరుగురు సంతానంతో పాటు పెంచి పెద్దచేశారు. తర్వాత కొల్లిపర మండలం దావులూరుకు చెందిన అంబటి దాసు అనే వ్యక్తికిచ్చి వివాహం చేశారు. మంగమ్మ, దాసు దంపతులకు ఇద్దరు సంతానం కాగా, పెద్ద బిడ్డ శాంతకుమారిని యలవర్రుకి చెందిన కొండసీమ క్రిస్టఫర్‌కు ఇచ్చి రెండేళ్ల క్రితం వివాహం చేశారు. అత్త తన రక్తసంబంధీకుల గురించి బాధపడుతుండడాన్ని చూసిన అల్లుడు ఫేస్‌బుక్‌ను ఆశ్రయించి, నెలివెడికి చెందిన భాస్కర్‌ అనే వ్యక్తి సహాయంతో ఆమె కుటుంబసభ్యుల వివరాలు సేకరించారు. మూడు రోజుల క్రితం వారిని ఫోన్‌ ద్వారా సంప్రదించారు. మంగమ్మ ఇద్దరు తమ్ముళ్లు వెంకటేష్‌, కృష్ణ శుక్రవారం యలవర్రు వచ్చి, వారి సోదరిని కలుసుకొని ఆనందసాగరంలో మునిగిపోయారు.

  • తన కుటుంబసభ్యులను చూడకుండానే చనిపోతానేమోనని భావించానని, అయితే తన అల్లుడు వారిని తన వద్దకు చేర్చాడని ఆనందంతో చెప్తోంది మంగమ్మ. తన తల్లిదండ్రులు, తోబుట్టువులు, సోదరుల పేర్లు బాగా గుర్తుపెట్టుకున్నానని, వాటి ఆధారంగానే వారి జాడ తెలుసుకోవడం సాధ్యమైందని ఆమె పేర్కొంది.
  • తమ తల్లిదండ్రుల ద్వారా అక్క చిన్నతనంలో తప్పిపోయిందని తెలుసుకున్నామని, ఆమెను చూస్తామని అనుకోలేదని, 38 ఏళ్ల తర్వాత ఆమెను ఇలా కలుసుకోవడం పరమాద్భుతంగా ఉందని చెప్పారు ఆమె సోదరులు వెంకటేష్‌, కృష్ణ.

ఇదీ చూడండి: Huzurabad by elections 2021: స్వేచ్చగా ఓటెయ్యండి... ప్రజాస్వామ్యాన్ని కాపాడండి: గెల్లు శ్రీనివాస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.