ETV Bharat / city

AP Employees Protest: ఉద్యోగ సంఘాలతో చర్చించాకే జీవోలు ఇచ్చాం: బొత్స

author img

By

Published : Jan 20, 2022, 11:17 PM IST

AP Employees Protest: ఉద్యోగ సంఘాలతో చర్చించాకే జీవోలు ఇచ్చామన్నారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఉద్యోగులు సమ్మెకు వెళ్లడం సముచితం కాదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల హెచ్​ఆర్​ఏపై ప్రభుత్వం పునరాలోచన చేస్తుందని.. ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

AP Employees Protest
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ

AP Employees Protest: ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాతే జీవోలు విడుదల చేశామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఉద్యోగుల సమ్మెకు వెళ్ళటం సరికాదన్నారు. మరోసారి ఉద్యోగ సంఘాలతో చర్చలు తాము చర్చించడానికి సిద్ధంగానే ఉన్నామన్నారు. ఉద్యోగస్థులు సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత చర్చించి కేబినెట్​లో ఒక నిర్ణయం తీసుకుంటామని బొత్స తెలిపారు. జీవోలు ఇచ్చి తర్వాత కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెబుతున్నారని, వాటన్నిటినీ పరిశీలించి.. ఆలోచిస్తామన్నారు. ఉద్యోగులు నోటీసులు ఇచ్చి దాని మీద చర్చించడం వారి హక్కు.. కానీ సమ్మెకు వెళ్లడం సరైన విధానం కాదని బొత్స అభిప్రాయపడ్డారు.

వారి ట్రాప్​లో పడొద్దు

srikanth reddy on employees demands : ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్​ఆర్​ఎపై ప్రభుత్వం పునరాలోచన చేస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. ఉద్యోగులతో ప్రభుత్వం చర్చలు జరిపి పరిష్కరిస్తుందన్నారు. ప్రభుత్వం ఎప్పుడూ మొండిగా వెళ్లదని.., ఉద్యోగులు అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. ఆందోళనలపై ఉద్యోగులు పునరాలోచన చేయాలని కోరారు.

పదివేల కోట్ల భారం పడుతున్నా ప్రభుత్వం 23శాతం ఫిట్ మెంట్ ఇచ్చిందని శ్రీకాంత్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల కంటే పీఆర్సీ ఎక్కువగానే ఇస్తోందని.. పోల్చి చూసుకోవాలని కోరారు. తమ వైపు నుంచే కాకుండా ప్రభుత్వం వైపు నుంచి కూడా ఉద్యోగులు చూడాలన్నారు. ఉద్యోగులు ఏకపక్షంగా రాజకీయ పార్టీల్లాగా ఆలోచించవద్దని సూచించారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకీ ప్రభుత్వం వేతనాలు పెంచిందన్నారు. ఉద్యోగులను మోసం చేసే , నష్టపరిచే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. ప్రభుత్వాన్ని ద్వేషించే వారి ట్రాప్ లో ఉద్యోగులు పడవద్దని కోరారు. ఉద్యోగులను చర్చలకు పిలిచి పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.