హైదరాబాద్ శివారు కొత్తపేటలోని గడ్డి అన్నారం పండ్ల మార్కెట్లో క్రయవిక్రయాలు ఈ నెల 25 నుంచి బంద్ కానున్నాయి. అక్టోబర్ 1 నుంచి బాటసింగారంలోని లాజిస్టిక్ పార్క్లో పండ్ల మార్కెట్ లావాదేవీలు ప్రారంభిస్తున్నట్లు.. మార్కెట్ కమిటీ ఇంఛార్జి ఛైర్మన్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఇక్కడున్న 22 ఎకరాల్లో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం కానుందన్నారు. ఈనెల 30న ఈ ప్రాంతాన్ని మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కు అప్పగిస్తామన్నారు.
రంగారెడ్డి జిల్లా కోహెడలోని 178 ఎకరాల్లో పండ్ల మార్కెట్ను శాశ్వత ప్రాతిపదికన నిర్మాణానికి డీపీఆర్ ఇచ్చినట్లు తెలిపారు. అక్కడ మార్కెట్ నిర్మాణానికి సమయం పట్టే అవకాశం ఉండడం వల్ల తాత్కాలిక ప్రాతిపదికన బాటసింగారం లాజిస్టిక్ పార్క్కు తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని రైతులు, ఏజెంట్లు, హమాళీలు గుర్తించి, సహకరించాలని కోరారు.
మార్కెట్లో ఉన్న 341 మంది కమీషన్ ఏజెంట్లకు కావల్సిన సదుపాయాలను లాజిస్టిక్ పార్కులో కల్పించినట్లు మార్కెట్ కమిటీ ఇంఛార్జి ఛైర్మన్ ముత్యంరెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి: KTR: 'రూ.3,866 కోట్లతో హైదరాబాద్లో మురుగునీరు శుద్ధి ప్లాంట్'