ETV Bharat / city

భారీ వర్షాలు.. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదులు

author img

By

Published : Nov 26, 2020, 1:40 PM IST

నివర్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్​లోని కడప జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రైల్వేకోడూరులో అత్యధికంగా 245.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మాండవ్య, పెన్నా, పుల్లంగేరు, గుంజన, చెయ్యరు, పాపాగ్ని నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈదురు గాలులతో కూడిన వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

heavy-rains-in-kadapa-district
భారీ వర్షాలు.. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదులు

భారీ వర్షాలు.. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదులు

ఆంధ్రప్రదేశ్​లోని కడప జిల్లాలో నివర్ తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. గత రాత్రి నుంచి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా చిత్తూరు - నెల్లూరు జిల్లాలకు సరిహద్దుగా ఉన్న రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో భారీ వర్షం కురిసింది. జిల్లాలో అత్యధికంగా రైల్వేకోడూరులో 245.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా సగటున 44.65 మిల్లీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. కమలాపురం, జమ్మలమడుగు, పులివెందుల, బద్వేలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది.

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదులు, చెరువులు

మాండవ్య, పెన్నా, పుల్లంగేరు, గుంజన, చెయ్యేరు, పాపాగ్ని నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. రాయచోటి మండలంలోని ఇనాత్ ఖాన్ చెరువు, గుండ్ల చెరువులు పొంగుతున్నాయి. జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే ప్రజలను అప్రమత్తం చేసింది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. వాగులు, వంకల వద్ద నీటిలో దిగరాదని హెచ్చరికలు జారీ చేశారు. తుపాన్ ప్రభావానికి జిల్లాలోని చేతికి వచ్చిన వరి పంట నేలకొరగింది. రైతులు తీవ్రంగా నష్టపోయారు. మైదుకూరులో.. బుధవారం రాత్రి నుంచి ప్రారంభమైన వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. నియోజకవర్గంలో విస్తారంగా సాగైన వరి పంట నీటిపాలైంది. చేతికొచ్చిన పంట చేజారిపోయిందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

తడిసి ముద్దవుతున్న రైల్వేకోడూరు

రైల్వేకోడూరు నియోజకవర్గంలో రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రైల్వేకోడూరు సమీపంలోని వాగులు, వంకలు, ఏర్లు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. రైల్వేకోడూరు పట్టణంలోని ధర్మాపురం గుంజన ఏరు సమీపంలో ఉండడంతో కొన్ని ఇళ్లల్లోకి నీళ్లు వచ్చి చేరాయి. రైల్వేకోడూరు పట్టణం నుండి రెడ్డివారిపల్లికి పోయే వంతెన పైకి నీళ్లు రావడం వల్ల రాకపోకలు అంతరాయం ఏర్పడింది. చిట్వేల్ మండలంలో రాత్రి నుంచి సాధారణ వర్షపాతం నమోదైంది. పుల్లంపేట మండలంలో రాత్రి నుండి భారీ వర్షం కురుస్తోంది. పుల్లంగేరు తీవ్రంగా ప్రవహిస్తోంది. పెనగలూరు మండలంలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇప్పటివరకు రైల్వే కోడూరు మండలంలో 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఎమ్మార్వో శిరీష తెలిపారు.

ఇదీ చదవండి: సొంత రాష్ట్రం నడుపుకునే సత్తా ఉందా అని అడిగారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.