ప్రళయ గోదావరి.. నీటమునిగిన పంపుహౌస్​లు

author img

By

Published : Jul 15, 2022, 4:11 AM IST

నీటమునిగిన పంపుహౌస్​లు

గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గతంలో ఎన్నడూ లేనంతగా వరద ప్రవాహం ముంచుకొచ్చింది. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం పంపుహౌస్‌లు నీట మునిగాయి. వరదనీటిలోనే మోటార్లు, పంపులు ఉండిపోయాయి. ఇంజినీర్లు, సిబ్బంది అక్కడే చిక్కుకుపోయారి. భద్రాచలం వద్ద నది ఉగ్రరూపం దాల్చింది. తొమ్మిది మండలాలను వరద నీరు ముంచెత్తింది. కాళేశ్వరం త్రివేణి సంగమం అదికారులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు.

గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గతంలో ఎప్పుడూ లేనంత ప్రవాహం రావడంతో ఆ ధాటికి పరీవాహక ప్రాంతాలు తల్లడిల్లుతున్నాయి. వరద ఉద్ధృతికి కాళేశ్వరం పంపుహౌస్‌లు, కంట్రోల్‌రూములూ నీట మునిగాయి. వాటిలో ఉన్న ఇంజినీర్లు, సిబ్బంది అక్కడే చిక్కుకుపోయారు. భద్రాచలం వద్ద నది భీకరంగా మారుతోంది. గురువారం రాత్రి 63.3 అడుగులకు చేరుకున్న ప్రవాహం.. క్రమేపీ పెరుగుతోంది. శుక్రవారం ఉదయానికి 70 అడుగులకు, రాత్రికి 75 అడుగులకు చేరుకుంటుందన్న అంచనాల నేపథ్యంలో వంతెన మీదుగా రాకపోకలు నిలిపివేశారు. గురువారం రాత్రి మేడిగడ్డ బ్యారేజీ నుంచి నుంచి 28.58 లక్షల క్యూసెక్కుల నీటిని బయటికి వదిలారు.

కాళేశ్వరం వద్ద 1986లో అత్యధికంగా 107.05 మీటర్ల మట్టం నమోదుకాగా గురువారం సాయంత్రం 108.80 మీటర్లు నమోదైంది. మంచిర్యాల వద్ద కూడా గతంలో కంటే అధికంగా 139.116 మీటర్లుగా రికార్డయింది. మొత్తమ్మీద గోదావరి తీర ప్రాంతాల పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. వర్షాలు, వరదల నేపథ్యంలో వందల గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోగా వేల మంది నిరాశ్రయులయ్యారు. చాలాచోట్ల రహదారులు తెగిపోయాయి. విద్యుత్తు స్తంభాలు పడిపోయాయి. కరెంటు సరఫరా నిలిచిపోయింది. పంటపొలాలు మునిగిపోయాయి. భగీరథ పైపులు దెబ్బతినడంతో తాగునీటి సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. నిర్మల్‌ జిల్లా పెంబి మండలం పసుపుల, తాటిగూడ గ్రామాల మధ్య నాలుగేళ్ల క్రితం నిర్మించిన వంతెన కడెం వాగు ఉద్ధృతికి పూర్తిగా కొట్టుకుపోయింది. వరద సహాయక చర్యలు అందించేందుకు వెళ్లిన మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌ ఏరియాకు చెందిన ఇద్దరు సింగరేణి రెస్క్యూ సిబ్బంది దుర్మరణం చెందారు. సంగారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో మట్టిగోడలు కూలి ఇద్దరు మరణించారు.

.
.

నీటమునిగిన పంపుహౌస్​లు: గోదావరి వరద ఉద్ధృతికి కాళేశ్వరం పంపుహౌస్‌లు నీటమునిగాయి. భారీ వరద కారణంగా పంపుహౌస్‌లతో పాటు కంట్రోల్‌రూములు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. మేడిగడ్డ, అన్నారం పంపుహౌస్‌లు మునిగిపోవడంతో భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. గోదావరికి తీవ్రస్థాయిలో వరద రావడంతో పాటు స్థానికంగా కురిసిన వర్షాలతో వాగులు, వంకలు, నదుల ద్వారా వచ్చిన వరద ముందుకెళ్లే అవకాశం లేక వెనక్కి తన్నడంతో పంపుహౌస్‌ల ప్రాంతమంతా జలమయమైంది. అక్కడున్న ఇంజినీర్లు, ఇతర సిబ్బంది బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజి పూర్తి స్థాయి నీటిమట్టం 100 మీటర్లు కాగా, పంపుహౌస్‌ వద్ద 108.5 మీటర్లు ఉంది. బుధవారం ఉదయం నుంచి భారీగా వరద రాగా.. రాత్రికి మరింత ఎక్కువై పంపుహౌస్‌లోకి నీరు చేరడం ప్రారంభమైంది. పంప్‌హౌస్‌లోని 40 మెగావాట్ల సామర్థ్యం గల 17 మోటార్లు నీటిలో మునిగినట్లు సంబంధిత ఇంజినీర్లు తెలిపారు. కరెంటు స్తంభాలు పడిపోవడంతో బుధవారం తెల్లవారుజాము నుంచే విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. పంపుహౌస్‌లోకి వచ్చిన నీటిని వెంటనే డీవాటరింగ్‌ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. గత మూడేళ్లలో ఈ పథకం ద్వారా దాదాపు 200 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు.

.
.

ప్రమాదకరంగా మేడిగడ్డ: మేడిగడ్డ బ్యారేజి వద్ద ప్రమాదకర స్థాయిని మించి వరదనీటి ప్రవాహం ఉండటంతో ఆ ప్రాంతమంతా జలదిగ్బంధంలో ఉంది. బ్యారేజి వద్ద ఉన్న కంట్రోల్‌ రూము, సీఆర్‌పీఎఫ్‌ క్యాంపు కార్యాలయం నీటిలోనే ఉన్నాయి. బ్యారేజి వద్ద 103 మీటర్ల ఎత్తు నుంచి వరద ప్రవహిస్తోంది. నిర్వహణ ఇంజినీర్లు 10 మంది, సీఆర్‌పీఎఫ్‌ క్యాంపు 90 మంది జవాన్లు కంట్రోల్‌ రూముకు చేరుకున్నారు. జేసీబీల ద్వారా వారిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నించినా వీలుకాకపోవడంతో పడవల ద్వారా తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. ప్రస్తుతానికి కంట్రోల్‌ రూము భవనంలోనే ఇంజినీర్లు, సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు ఉన్నారు. ఎప్పటికప్పుడు పెరుగుతున్న వరదను చూస్తే మేడిగడ్డ బ్యారేజి పైనుంచి ప్రవాహం వెళ్లినా ఆశ్చర్యం లేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

అన్నారంలో కంట్రోల్‌రూముల్లోకి వరద: అన్నారం పంపుహౌస్‌ బుధవారం రాత్రికి పూర్తిగా మునిగిపోయింది. ఇందులోని 12 మోటార్లు, పంపులు, కంట్రోల్‌ రూములన్నీ జలమయమయ్యాయి. శివారం వద్ద సుమారు 5 కిలోమీటర్ల దూరం మేర.. వెయ్యి మీటర్ల వెడల్పు ఉండాల్సిన గోదావరి 330 మీటర్లకు కుచించుకుపోయిందని, దీంతో ప్రవాహం నెమ్మదించి నష్టం కలుగజేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమైన తర్వాత బుధవారం వరకు 430 మి.మీ స్థానికంగా కురిసిందని, గోదావరి నిండుగా ప్రవహించడంతో పాటు స్ధానికంగా ఉండే వాగులు, వంకలు పొంగడంతో పంపుహౌస్‌ను రక్షించుకొనేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.

సుందిళ్ల వద్ద అంతే...:సుందిళ్ల పంపుహౌస్‌కు నష్టం వాటిల్లలేదని ఇంజినీర్లు చెబుతున్నా, అక్కడికి వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో పూర్తి సమాచారం అందాల్సి ఉంది. అక్కడి ఇంజినీర్లు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. గురువారం తెల్లవారుజామున 4 గంటలకు విద్యుత్తు సరఫరా ఆగిపోయింది. గేట్లు తెరవడంతో ప్రవాహం ముందుకు వెళ్తున్నందున ఇబ్బందీ లేదని, అయితే తాగునీరూ దొరకని దుస్థితి నెలకొందని ఓ ఇంజినీరు వాపోయారు.

శ్రీరామసాగర్‌ వరద కాలువ సామర్థ్యానికి మించి ప్రవాహం వచ్చింది. ఈ కాలువ నుంచి మిడ్‌మానేరు ద్వారా దిగువకు వదిలినా, కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన లక్ష్మి పంపుహౌస్‌కు ఏం జరుగుతుందోనన్న ఆందోళన ఇంజినీర్లలో నెలకొంది. కాళేశ్వరంలో కీలకమైన రెండు పంపుహౌస్‌లు నీట మునగడంతో వాటి పునరుద్ధరణకు సమయం పట్టే అవకాశం ఉంది. ప్రవాహం కొంత తగ్గి విద్యుత్తు సరఫరా రాగానే నీరుతోడి మోటార్లను డ్రై చేస్తామని, ప్యానల్స్‌ ఎంతవరకు దెబ్బతిన్నాయో చూడాలని నీటిపారుదలశాఖకు చెందిన సీనియర్‌ ఇంజినీరు ఒకరు తెలిపారు.

పంప్‌హౌస్‌ల మోటార్లకు ఇబ్బంది లేదు: అసాధారణ పరిస్థితుల్లో ప్రాజెక్టుల పంప్‌హౌస్‌లు మునగడం సహజమని, దాంతో వచ్చిన ఇబ్బందేమీ లేదని ప్రభుత్వ నీటి పారుదల శాఖ సలహాదారు పెంటారెడ్డి గురువారం తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కన్నెపల్లి, అన్నారం పంప్‌హౌస్‌ల మునకపై ఆయన మాట్లాడుతూ అసాధారణ వర్షపాతం వల్ల ఇది సంభవించిందన్నారు. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అనవసర రాజకీయాలు చేయవద్దని ఆయన కోరారు. కాళేశ్వరం పంప్‌హౌస్‌ల నిర్మాణాలకెలాంటి ఇబ్బంది లేదని, మోటార్లు, ఎలక్ట్రికల్‌ పరికరాలు మాత్రమే నీట మునిగాయని ఆయన వెల్లడించారు. దీనివల్ల మోటార్లకు వచ్చిన ఇబ్బందేమీ లేదన్నారు. వరద ఉద్ధృతి తగ్గిన వెంటనే నీటిని తొలగించి.. మోటార్లను ఆరబెట్టి వినియోగంలోకి తీసుకువస్తామన్నారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.