ఉత్తర తెలంగాణను ముంచెత్తిన వరదలు.. ఆ రెండు జిల్లాలు అతలాకుతలం

author img

By

Published : Jul 14, 2022, 8:06 PM IST

Flood effect

Flood effect: ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాలను... వరదలు ముంచెత్తుతున్నాయి. పలు చోట్ల రహదారులు కొట్టుకుపోయి... రాకపోకలు స్తంభించాయి. మంచిర్యాలలో పలు కాలనీల్లోకి... గోదావరి పోటెత్తింది. ఆసిఫాబాద్‌ జిల్లాలో గర్భిణిని కాపాడబోయి గల్లంతైన ఇద్దరు సహాయక సిబ్బంది... మృతదేహాలు లభ్యమయ్యాయి.

ఉత్తర తెలంగాణను ముంచెత్తిన వరదలు.. ఆ రెండు జిల్లాలు అతలాకుతలం

Flood effect: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో వరదపోటుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలంలోని వడ్యాల్‌లో.. బుధవారం రాత్రి చెరువు అలుగునీటిలో జారిపడి దాసరి శోభారాణి అనే వివాహిత కొట్టుకుపోయింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని దహేగాం మండలం పెసరకుంట పెద్దవాగు ఉద్ధృతిలో కుట్టుకుపోయిన.. సింగరేణి రెస్క్యూటీంలోని ఇద్దరు కార్మికుల మృతదేహాలు లభ్యమయ్యాయి. గర్భిణిని కాపాడబోయి వీరిరువురూ మృత్యువాత పడ్డారు. మృతులు సతీష్, రాము మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లో బొగ్గు గనులలో విధులు నిర్వహిస్తున్నారు.‍

నీటమునిగిన నివాస గృహాలు: మంచిర్యాలలోని లోతట్టు ప్రాంతకాలనీలు.. జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతోపాటు... పై నుంచి వస్తున్న వరద నీటితో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. రాళ్లవాగు బ్యాక్ వాటర్.. లోతట్టు ప్రాంత కాలనీలలోకి చేరడంతో అనేక ఇళ్లు నీట మునిగాయి. ఇప్పటికే రామ్ నగర్, ఎల్ఐసి కాలనీ, బాలాజీ నగర్, పద్మశాలి కాలనీ, ఎన్టీఆర్ నగర్... బైపాస్ రోడ్డు, లక్ష్మీనగర్ , ఆదిత్య ఇంక్లైన్ పాత మంచిర్యాల సరిహద్దులోని నివాస గృహాలు నీట మునిగాయి. ప్రధానంగా లక్ష్మీ నగర్, ఎల్ఐసి కాలనీ, రామ్ నగర్ కాలనీలోని పెద్దపెద్ద భవనాలు నీటిలో మునిగిపోవడంతో... మత్స్యకారుల సహకారంతో తెప్పలపై బాధితుల్ని తీసుకువచ్చారు. మరికొందరిని గుర్రాలపై తరలించారు. పట్టణంలోని వరద బాధిత ప్రాంతాలను జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి, ఎమ్మెల్యే దివాకర్ రావు పరిశీలించి సహాయక చర్యలు అందించారు. ముంపు బాధితులను అప్రమత్తం చేస్తూ.. పట్టణంలో ఏర్పాటు చేసిన కేంద్రాలకు తరలించారు. సింగరేణి రెస్క్యూ టీంలు... ముంపునకు గురైన కాలనీలలో రక్షణ చర్యలు చేపట్టాయి.

హెలికాప్టర్​తో సహాయం: మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ఓడ్డు సోమనపల్లిలో వాటర్ ట్యాంకు మీద చిక్కుకుపోయిన ఇద్దరు రైతులను రక్షించేందుకు చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రత్యేక చొరవ చూపించారు. తమ పశువుల కోసం బుధవారం సాయంత్రం ఆ ఇద్దరు రైతులు పొలాల వద్దకు వెళ్లగా తిరుగు ప్రయాణంలో గోదావరి నది ప్రవాహం చుట్టు ముట్టింది. దీంతో బయటకు రాలేక నీటి ట్యాంకు ఎక్కి ప్రాణాలను రక్షించుకునేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే అక్కడకి చేరుకున్న ఎమ్మెల్యే... హైదరాబాద్ నుంచి హెలికాప్టర్​ను రప్పించి ఇద్దరిని సురక్షితంగా ఓడ్డుకు చేర్చారు.

చెరువులకు గండి: నిజామాబాద్ నగరం ఖానాపూర్ సమీపంలో సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తి... వాగులో పడి గల్లంతయ్యాడు. గమనించిన స్థానికులు.. ఎంత ప్రయత్నించినా వ్యక్తి ఆచూకీ లభించకపోవడంతో.. కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు.. గాలింపు చర్యలు చేపట్టారు. జక్రాన్‌పల్లి మండలంలోని కేశ్‌పల్లిలో వైద్యం అందక గ్రామానికి చెందిన హోటల్‌ శంకరయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. గ్రామం చుట్టూ వరద నీరు చేరి.. రహదారులు కొట్టుకుపోయాయి. నందిపేట్‌లో మరో చెరువుకు గండి పడింది. బుధవారం సత్తారు చెరువుకు గండి పడి నీటి ప్రవాహం గ్రామంలోని వీధులతోపాటు.. పెద్ద చెరువులోకి చేరింది. తాజాగా పెద్ద చెరువుకు గండి పడి.. నీరు గోదావరిలోకి చేరుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో.. బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

జాతీయ రహదారిపై నిలిచిన నీరు: భారీ వర్షాలతో ఆర్మూర్ పట్టణం వరద ముంపులో చిక్కుకుంది. గుండ్ల చెరువు నుంచి అలుగులు పారి.. నీరు జాతీయ రహదారి 63పైకి చేరుతోంది. నిజామాబాద్ నుంచి ఆర్మూర్ వచ్చే ఈ రహదారిని పోలీసులు మూసివేశారు. ద్విచక్ర వాహనదారులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దారి గుండా ప్రయాణించొద్దని విజ్ఞప్తి చేశారు. ఆర్మూర్ నుంచి ఇస్సాపల్లి వైపు వెళ్లే పాత దారిలో వరద నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉంది. ఆలూరు బైపాస్ వద్ద నీటి ప్రవాహాన్ని అంచనా వేయకుండా.. నలుగురు కుటుంబ సభ్యులు ఓ ద్విచక్రవాహంపై ఇస్సాపల్లి వైపు ప్రమాదకరంగా ప్రయాణించారు. ఈ క్రమంలో నీటి ప్రవాహానికి వాహనం అదుపు తప్పి.. నలుగురూ కిందపడి వరదలో కొట్టుకుపోతుండగా... స్థానిక మత్స్యకారులు రక్షించారు. ద్విచక్ర వాహనం నీటిలోనే గల్లంతయ్యింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.