ETV Bharat / city

New Districts in AP: ఏపీలో కొత్త జిల్లాలపై త్వరలో గెజిట్‌ నోటిఫికేషన్లు

author img

By

Published : Jan 28, 2022, 9:19 AM IST

Collectors report on new districts: ఆంధ్రప్రదేశ్​లో ప్రతిపాదిత జిల్లాల పునర్విభజనపై.. జిల్లా కలెక్టర్లు ప్రభుత్వానికి అందించే నివేదికలు కీలకం కాబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన కొత్త జిల్లాల నోటిఫికేషన్లకు అనుగుణంగా కలెక్టర్లు విడివిడిగా జిల్లాల పేర్లతో రాజపత్రాన్ని (గెజిట్‌ నోటిఫికేషన్‌) విడుదల చేయనున్నారు.
Collectors report on new districts
కొత్త జిల్లాలపై త్వరలో గెజిట్‌ నోటిఫికేషన్లు

Collectors report on new districts: ప్రతిపాదిత జిల్లాల పునర్విభజనపై క్షేత్రస్థాయిలో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు, ఆయా ప్రాంతాల ప్రజలు తమ ఆకాంక్షలు, అభ్యంతరాలను వెల్లడిస్తున్నారు. వీటన్నింటినీ క్రోడీకరించి జిల్లా కలెక్టర్లు ప్రభుత్వానికి అందించే నివేదికలు కీలకం కాబోతున్నాయి. ఈనెల 25న రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల పేర్లను ప్రకటించింది. ఏడాది కిందటే కలెక్టర్లు జిల్లాల పునర్విభజనపై కసరత్తు చేశారు. వారిచ్చిన సమాచారాన్ని అనుసరించి.. ప్రిలిమనరీ నోటిఫికేషన్ల జారీకి ముందు కలెక్టర్లతో ప్రభుత్వం చర్చించింది. అప్పట్లో ఉన్న కలెక్టర్లు పలువురు ప్రస్తుతం లేరు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన కొత్త జిల్లాల నోటిఫికేషన్లకు అనుగుణంగా కలెక్టర్లు విడివిడిగా జిల్లాల పేర్లతో రాజపత్రాన్ని (గెజిట్‌ నోటిఫికేషన్‌) విడుదల చేయనున్నారు. 1974 (ది ఆంధ్రప్రదేశ్‌ డిస్ట్రిక్ట్స్‌ ఫార్మేషన్‌) చట్టాన్ని అనుసరించి ప్రతిపాదిత జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై.. గ్రామ/వార్డు సచివాలయాలు, తహసీల్దార్‌, ఆర్డీవో, కలెక్టరేట్‌ల ద్వారా ప్రచారం చేయనున్నారు.

ప్రభుత్వ ప్రతిపాదనలపై అభ్యంతరాలను వ్యక్తంచేసేందుకు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజలకు అవకాశాన్ని కల్పిస్తారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి నుంచి కలెక్టర్లకు అందే అభ్యంతరాలు, సలహాలు, సూచనలు కీలకం కానున్నాయి. వీటిని కోడ్రీకరించి వారు ప్రభుత్వానికి నివేదికలు అందచేస్తారు. వీటిని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటుందా లేదా అనేది తెలియదు. ఈ ప్రక్రియ ముగిశాకే జిల్లాల వారీగా తుది నోటిఫికేషన్‌ వస్తుంది. అయితే.. ప్రిలిమనరీ నోటిఫికేషన్‌లో రాజకీయ కారణాలతోనే మార్పులు, చేర్పులు జరగొచ్చని భావిస్తున్నారు.

కదిరి రెవెన్యూ డివిజన్‌పై పునఃపరిశీలన?

అనంతపురం జిల్లాలోని కదిరిని మళ్లీ రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లావాసుల నుంచి వస్తున్న డిమాండ్లపై ప్రభుత్వం పునఃపరిశీలన చేస్తున్నట్లు తెలిసింది. అనంతపురం జిల్లాలో కొత్తగా శ్రీసత్యసాయి జిల్లా ఏర్పడింది. పుట్టపర్తి కేంద్రంగా ఏర్పడే జిల్లాలో.. పుట్టపర్తి, ధర్మవరం, పెనుకొండ రెవెన్యూ డివిజన్లను ప్రతిపాదించారు. దీనికిముందు కదిరి, ధర్మవరం, పెనుకొండ రెవెన్యూ డివిజన్లు ఉండగా.. కొత్తగా పుట్టపర్తి వచ్చి కదిరి మాయమైంది. కదిరి డివిజన్‌ను యథావిధిగా కొనసాగించాలని గట్టి డిమాండ్లు వస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలోనే అతి పెద్ద తాలూకాల్లో ఒకటైన కదిరిలో రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలనే నినాదం చాలాకాలంపాటు వినిపించింది. చివరికి 2013లో నెరవేరింది. కదిరి, పుట్టపర్తి నియోజకవర్గాల పరిధిలోని మొత్తం 12 మండలాలతో కలిపి కదిరి కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటైంది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.