ETV Bharat / city

'కేసీఆర్ నిర్లక్ష్య పాలన వల్లే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడి తప్పింది'

author img

By

Published : Mar 29, 2022, 10:45 PM IST

Bandi Sanjay Fire on KCR
Bandi Sanjay Fire on KCR

Bandi Sanjay Fire on KCR: సీఎం కేసీఆర్ పాలనా వైఫల్యం వల్లే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా గాడి తప్పిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ధనిక, మిగులు రాష్ట్రమని గొప్పలు చెబుతూ తెలంగాణను అప్పుల కుప్పగా మార్చి.. పూర్తిగా దివాళా తీయించారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

Bandi Sanjay Fire on KCR: కేసీఆర్ నిర్లక్ష్య పాలన వల్లే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా గాడి తప్పిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. తెలంగాణను ధనిక, మిగులు రాష్ట్రమని గొప్పలు చెబుతూ అప్పుల కుప్పగా మార్చారని కేసీఆర్​పై మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సకాలంలో జీతాలూ ఇవ్వడం లేదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రోజుకో జిల్లా చొప్పున వంతుల వారీగా జీతాలు చెల్లిస్తూ.. ప్రతి నెలా రెండోవారం దాకా సాగదీస్తున్నారని దుయ్యబట్టారు.

Bandi Sanjay Comments on KCR: ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల మెడికల్ రీయంబర్స్​మెంట్, ఎడ్యుకేషన్ కన్షెషన్, సరెండర్ బిల్లులు గత 7 నెలలుగా పెండింగ్​లో ఉన్నాయని విమర్శించారు. చివరకు 317 జీవో ద్వారా బదిలీ అయిన ఉపాధ్యాయులకు సంబంధించి జనవరి నెల వేతనం కూడా ఇంకా చెల్లించలేదంటే.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు జీపీఎఫ్​లో కూడబెట్టుకున్న డబ్బులను.. తమ పిల్లల ఉన్నత చదువులు, పెళ్లిళ్లు, కుటుంబ సభ్యులకు చికిత్స కోసం వాళ్లు ఆరాటపడుతుంటే వాటినీ చెల్లించకపోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. జీపీఎఫ్ సొమ్ము డ్రా చేసుకునేందుకు వచ్చిన దరఖాస్తులను గత 2 ఏళ్లుగా ఎందుకు పెండింగ్​లో పెట్టారని సంజయ్ ప్రశ్నించారు.

హెల్త్ కార్డులతో ఏ కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం అందించకపోవడంతో ఉద్యోగులు నానా యాతనలు పడుతుంటే ఎందుకు స్పందించడం లేదని మండిపడ్డారు. ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటే ఇదేనా అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఇకపై ఉద్యోగి పదవీ విరమణ చేసిన రోజే రావాల్సిన మానిటరీ బెనిఫిట్స్ అన్నీ అందించి ఆనందంగా ఇంటికి పంపుతామని.. అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన సీఎం మాటలేమయ్యాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా.. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి:'ఉక్రెయిన్‌ విద్యార్థుల కోసం సీట్లు పెంచండి'.. మోదీకి సీఎం కేసీఆర్​ లేఖ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.