ETV Bharat / city

AP Employees Protest: 'చర్చల పేరుతో ఎన్నిసార్లు మోసం చేస్తారు'

author img

By

Published : Jan 26, 2022, 4:32 PM IST

AP employees JAC leaders on govt: ఏపీ ప్రభుత్వ తీరుపై పీఆర్సీ సాధన సమితి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కుట్రపూరితంగా కొత్త జీతాలని ఒకసారి, సీఎఫ్‌ఎంస్‌, హెచ్‌ఆర్‌ఎంస్‌ అని మరోసారి చెబుతూ గందరగోళం సృష్టిస్తోందని మండిపడ్డారు. ఉద్యోగుల జీతాలు ఆపితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం రేపటినుంచి మమ్మల్ని ఏమైనా చేయవచ్చని బండి శ్రీనివాసరావు అన్నారు. తమ ఇళ్లపై దాడితో పాటు అరెస్టు చేయవచ్చని వ్యాఖ్యానించారు.

AP Employees Protest
AP Employees Protest

AP employees JAC leaders slams govt: పీఆర్సీ ఉద్యమం, చర్చలు ముగిసే వరకు తమకు పాత జీతాలే ఇవ్వాలని వారం క్రితమే ఏపీ ప్రభుత్వానికి చెప్పినట్లు పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. కానీ, ప్రభుత్వం కుట్రపూరితంగా కొత్త జీతాలని ఒకసారి, సీఎఫ్‌ఎంస్‌, హెచ్‌ఆర్‌ఎంస్‌ అని మరోసారి చెబుతూ గందరగోళం సృష్టిస్తోందని మండిపడ్డారు. ఈ క్రమంలో జీతాలు ఇవ్వకుండా ఉద్యోగుల్లో అసహనం కలిగేలా చేసి ఉద్యమం దెబ్బతినేలా కుట్ర పన్నుతున్నారని ఆయన మండిపడ్డారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా ఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఉద్యమ కార్యాచరణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఇవాళ అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రాలు ఇచ్చారు. విజయవాడలోని బందర్ రోడ్డు ఆర్టీఏ కార్యాలయం ఆవరణలోని అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రాలిచ్చారు. పీఆర్సీ జీవోలు రద్దు చేయాలని నినాదాలు చేశారు. ఆందోళనలో పీఆర్సీ సాధన సమితి నేతలు బండి శ్రీనివాస్, శివారెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు, వైవీ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొప్పరాజు మాట్లాడారు.

ఆపితే ఊరుకునేది లేదు

‘‘ఈ నెల జీతం రాకుండా ప్రభుత్వం చూస్తోంది. ఉద్యోగుల జీతాలు ఆపితే ఊరుకునేది లేదు. మాకు వేతనాలు తగ్గకుండా చూస్తారని సజ్జల చెబుతున్నారు. పీఆర్సీ ఇచ్చేది జీతాలు తగ్గించడానికా? లేక పెంచడానికా? అనేది చెప్పాలి. కొత్త జీతాలు ఆపి పాతజీతాలు ఇవ్వండి. అలా అయితే ప్రభుత్వానికి రూ.10వేల కోట్లు మిగులుతాయి కదా. మాకు ఏం కావాలో నిన్న మంత్రుల కమిటీకి తెలిపాం. మా డిమాండ్లపై స్పష్టంగా చెబితే చర్చలకు సిద్ధం. జిల్లాల పునర్విభజన ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. మా ఉద్యమం సమయంలోనే జిల్లాల ప్రక్రియ తీసుకొచ్చారు. జిల్లాల పునర్విభజనపై మేం చేయగలిగినంత చేస్తాం. మాపై ఒత్తిడి తీసుకురావొద్దని కలెక్టర్లను కోరుతున్నాం. జిల్లాల విభజన ప్రక్రియపై అధికారుల ఒత్తిళ్లకు లొంగేది లేదు’’ అని బొప్పరాజు అన్నారు.

తాడేపల్లిలో ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్‌ సమావేశం జరిగింది. ఈ భేటీలో బొప్పరాజు, బండి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఉద్యోగ సంఘాల సమ్మెకు ఎన్‌ఎంయూ నేతలు మద్దతిచ్చారు. ఆర్టీసీ ఉద్యోగులకు అన్నీ సమస్యలే ఉన్నాయని బండి శ్రీనివాస్ అన్నారు. తమ ఉద్యమానికి ఆర్టీసీ ఉద్యోగులు కూడా మద్దతు ఇవ్వాలని కోరారు.

"ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఒక్కటే సమస్య. ఆర్టీసీ ఉద్యోగులకు అన్నీ సమస్యలే. ఉద్యోగుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుంది. ఈహెచ్‌ఎస్ కార్డులతో కార్మికులకు వైద్యం అందని పరిస్థితి. కొత్త జీతాలు మాకు వద్దన్నా ప్రభుత్వం ఇస్తానంటోంది. ప్రభుత్వం మనకు పెద్ద ద్రోహం చేస్తోంది. ఇప్పుడు ప్రభుత్వం ఇస్తోంది రివర్స్ పీఆర్సీ. కార్మికులకూ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలివ్వాలి. కార్మికుల డిమాండ్లు పరిష్కారమయ్యేవరకు తోడుగా ఉంటాం. ప్రభుత్వం రేపటినుంచి మమ్మల్ని ఏమైనా చేయవచ్చు. మా ఇళ్లపై దాడి చేయవచ్చు.. మమ్మల్ని అరెస్టు చేయవచ్చు" - బండి శ్రీనివాసరావు, ఎన్జీవో సంఘ అధ్యక్షుడు

ప్రభుత్వ దుర్మార్గాన్ని గమనించే...

ఆత్మగౌరవం కోసం ఉద్యోగులు ఉద్యమం చేస్తున్నారని బొప్పరాజు అన్నారు. ప్రభుత్వం వద్ద తాము ఫిట్‌మెంట్‌కు ఎక్కడా ఒప్పుకోలేదని స్పష్టం చేశారు. ఫిట్‌మెంట్‌కు ఒప్పుకున్నట్లు ఆధారాలుంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ దుర్మార్గాన్ని గమనించే 4 ఐకాసలు కలిశాయన్నారు. ప్రభుత్వం తమతో నాలుగు స్తంభాలాట ఆడుతోందని దుయ్యబట్టారు. ఆర్టీసీలోని అన్ని సంఘాలూ సమ్మెకు సిద్ధంగా ఉండాలని కోరారు.

ఇదీ చదవండి: 'పక్కా ప్రణాళికతోనే దాడి.. నా ప్రాణాలకు రక్షణ లేదు..'

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.