ETV Bharat / city

వ్యవసాయ బిల్లుల ఆమోదంతో యార్డుల పాత్ర నామమాత్రం

author img

By

Published : Sep 26, 2020, 7:03 AM IST

నూతన వ్యవసాయ బిల్లులతో వ్చవసాయ మార్కెట్ల పాత్ర నామమాత్రంగా మారనుంది. రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు రూ.200 కోట్లకు పైగా ఆదాయం తగ్గుతుందని మార్కెటింగ్​ శాక అంచనా వేస్తోంది.

telangana markets
వ్యవసాయ బిల్లుల ఆమోదంతో యార్డుల పాత్ర నామమాత్రం

పార్లమెంటులో వ్యవసాయ బిల్లులకు ఆమోదం లభించిన నేపథ్యంలో రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ల పాత్ర ఇకపై నామమాత్రం కానుంది. మార్కెట్‌ యార్డు ఆవరణలోకి వచ్చిన పంటల కొనుగోలును మాత్రమే మార్కెటింగ్‌ శాఖ పర్యవేక్షించనుంది. రాష్ట్రంలో ఐదు వేల మందికిపైగా వ్యాపారులకు, మరో 4,500 మంది కమీషన్‌ ఏజెంట్లకు మార్కెట్లలో పంటల కొనుగోలుకు అనుమతులు ఉన్నాయి. వారంతా భవిష్యత్తులో మార్కెట్లకు రాకపోవచ్చని ఆ శాఖ అంచనా వేస్తోంది.

మార్కెట్‌ యార్డు గేటు బయట పంటను ఎవరైనా స్వేచ్ఛగా కొనుగోలు చేయవచ్చని, వారి నుంచి రుసుం వసూలు చేసే అధికారం ఎవరికీ ఉండదని వ్యవసాయ బిల్లుల్లో కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో యార్డు లోపల పంట ఉత్పత్తులను కొనుగోలు చేసే వ్యాపారుల నుంచి మాత్రమే పంట విలువలో ఒకశాతం చొప్పున ‘మార్కెట్‌ రుసుం’ వసూలు చేయాలని తాజాగా నిర్ణయించింది. ‘ఈ బిల్లులను ఇంతకుముందే ఆర్డినెన్స్‌ రూపంలో కేంద్రం గుర్తించింది. అప్పట్నుంచే మార్కెట్ల బయట పంటలు కొంటున్న వ్యాపారులు మార్కెట్‌ రుసుం చెల్లించడం మానేశారు. వారిని మేమూ అడగటం లేదని’ మార్కెటింగ్‌ శాఖ అధికారులు తెలిపారు. వ్యవసాయ మార్కెట్లు లేని ప్రాంతాల్లో ప్రధాన మార్గాల్లోని వ్యవసాయశాఖ తనిఖీ కేంద్రాల(చెక్‌పోస్టులు) సిబ్బంది ఇంతకాలం మార్కెట్‌ రుసుం వసూలు చేసేవారు. కొత్త చట్టంతో ఈ చెక్‌పోస్టులన్నీ రద్దవుతాయి. వాహనాల్లో దేశంలోని ఎవరైనా, ఎక్కడికైనా పంటలు ఎలాంటి రుసుం కట్టకుండా తరలించుకునే అవకాశమేర్పడింది.

ప్రభుత్వ నిర్ణయమే కీలకం

ప్రస్తుత వానాకాలం(ఖరీఫ్‌) సీజన్‌లో కోటీ 43 లక్షల ఎకరాల్లో పంటలు సాగులో ఉన్నట్లు వ్యవసాయశాఖ తాజా నివేదికలో తెలిపింది. వీటిలో పెసర పంట ఇప్పటికే మార్కెట్లకు రావడం మొదలైంది. మిగిలిన పంటల కోతలు వచ్చే నెల నుంచి మొదలై, మార్కెట్లకు రావడం ప్రారంభమవుతుంది. అక్టోబరు ఒకటి నుంచే కొత్త మార్కెటింగ్‌ ఏడాది ప్రారంభం కానుంది. ముమ్మరంగా మార్కెట్ల కార్యకలాపాలు ప్రారంభం కానున్న దశలో పార్లమెంటులో వ్యవసాయ బిల్లుల ఆమోదంతో రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖలో సందిగ్ధం అలముకుంది. కొత్త చట్టం అమలుకు ఏంచేయాలో చెప్పాలంటూ మార్కెటింగ్‌ శాఖ సంచాలకుల కార్యాలయం తాజాగా ప్రభుత్వానికి లేఖ రాసింది. ‘కొత్త చట్టం అమలుతో మార్కెట్‌ రుసుం వసూలు కాదు. రూ.200 కోట్లకుపైగా ఆదాయం తగ్గుతుంది. ఈ నిధులు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సి ఉంటుంది. లేకపోతే మార్కెట్ల నిర్వహణ, ఉద్యోగులకు జీతభత్యాలు ఇవ్వడం కష్టమవుతుందని’ లేఖలో వివరించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా తమ శాఖ తదుపరి చర్యలు ఉంటాయని ఈ శాఖ అధికారులు ‘ఈనాడు’కు చెప్పారు.

ఆదాయంలో కోతతో ఇబ్బందులే

తెలంగాణలో 192 మార్కెట్‌ కమిటీలున్నాయి. వీటిలో 100లోపు కమిటీల పరిధిలో నిరంతరం పంటల కొనుగోళ్లు జరుగుతుంటాయి. మిగతావన్నీ వాటి పరిధిలోని గ్రామాల్లో బయట కొనుగోళ్లు జరిపే వ్యాపారుల నుంచి మార్కెట్‌ రుసుం వసూలు చేసేవి. బయట కొనుగోళ్లపై ఆంక్షల సడలింపులు, మార్కెట్‌ రుసుం రద్దు, చెక్‌పోస్టులూ లేకపోవడంతో ఈ కమిటీలకు ఏ మార్గంలోనూ ఆదాయం రాదని అంచనా. వ్యవసాయ మార్కెట్లలో వ్యాపారులు కొన్న పంటల విలువ నుంచి గతేడాది(2019-20) మార్కెట్‌ రుసుం కింద మార్కెటింగ్‌ శాఖకు రూ.341 కోట్ల ఆదాయం లభించింది. సరాసరిన ఏటా సుమారు రూ.300 కోట్ల ఆదాయం అలా సమకూరుతోంది. కొత్త చట్టంతో తమ శాఖ యార్డులకే పరిమితం కావాల్సి ఉన్నందున, ఈ ఏడాది ఆదాయం మూడు వంతులు తగ్గుతుందని తాజాగా అంచనా వేసింది.

ఇవీచూడండి: సచివాలయ టెండర్ల దాఖలు గడువు పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.