ETV Bharat / business

స్టాక్​ మార్కెట్లలో పెట్టుబడి.. ఇవి అదుపులో ఉంచుకుంటేనే!

author img

By

Published : May 7, 2022, 4:55 AM IST

Stock market
స్టాక్​ మార్కెట్లు

Stock market investments: స్టాక్‌ మార్కెట్‌... ఎప్పుడు ఎలా స్పందిస్తుందో చెప్పలేం. స్వల్పకాలిక హెచ్చుతగ్గులు ఇందులో పదేపదే చూస్తూనే ఉంటాం. మార్కెట్‌ దశలను అర్థం చేసుకోవడం, వాటిని తట్టుకునేందుకు సిద్ధం కావడం.. మదుపరిగా మనం చేయాల్సింది ఇదే. సూచీలు పురోగమిస్తున్నప్పుడు పెట్టుబడుల గురించి ఎలా ఆలోచిస్తామో.. తిరోగమనంలోనూ అదే ధోరణితో వ్యవహరించాలి. అప్పుడే పెట్టుబడులు లాభాలను పంచుతాయి.

Stock market investments: స్టాక్​ మార్కెట్​లో స్వల్పకాలిక హెచ్చుతగ్గులు పదే పదే వస్తూనే ఉంటాయి. మార్కెట్‌ దశలను అర్థం చేసుకోవడం, వాటిని తట్టుకునేందుకు సిద్ధం కావడం.. మదుపరిగా మనం చేయాల్సింది ఇదే. పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడే 'ఏటా 10-20 శాతం దిద్దుబాటు ఉండే అవకాశం ఉంది' అని స్పష్టంగా అనుకోవాలి. అప్పుడే ఎలాంటి ఇబ్బందీ ఉండదు. మీ పెట్టుబడుల విలువను లెక్కించుకుంటూ ఉండండి. ఈక్విటీల్లో 80శాతం మించకుండా చూసుకోండి. మిగతా మొత్తాన్ని డెట్‌ ఫండ్లలోకి మళ్లించండి. పెట్టుబడుల విలువను ఎప్పుడూ ఈ ప్రామాణిక అంచనాతో అనుసంధానం చేయండి. దీనివల్ల తాత్కాలికంగా వచ్చే హెచ్చుతగ్గులను సమన్వయం చేసుకునేందుకు వీలవుతుంది. నష్టాన్ని భరించే మీ సామర్థ్యం ఆధారంగా నిధుల కేటాయింపు ఉండాలి.

రెండేళ్ల కాలంలో స్టాక్‌ మార్కెట్లు గణనీయంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో మీ ఈక్విటీ పెట్టుబడుల విలువ మీ పోర్ట్‌ఫోలియోలో 5 -10 శాతం అధికంగానే ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని, పెట్టుబడుల్లో సర్దుబాటు చేసుకునేందుకు ఇది సరైన సమయంగా చెప్పొచ్చు. మంచి పనితీరు ఉన్న కంపెనీలు, ఫండ్లలో పెట్టుబడులు కొనసాగించాలి. ఈక్విటీ పెట్టుబడులను మీరు అనుకున్న ప్రామాణిక స్థాయికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి.
రానున్న ఏడాది కాలంలో ఈక్విటీ మార్కెట్ల పనితీరు బాగుంటుందని అంచనా ఉందనుకుందాం. అప్పుడు ఈక్విటీ పెట్టుబడులు సానుకూలంగా ఉంటాయి. ఈ సమయంలో మీరు పెట్టుబడులు కొనసాగిస్తూనే ఉండాలి.

అదే మార్కెట్‌ పనితీరు బాగా ఉండదు.. బేర్‌ మార్కెట్‌ ఉంటుంది అనే వార్తలు వచ్చినా.. కొనుగోలు అవకాశంగా భావించాలి తప్ప వెనకడుగు వేయొద్దు. మార్కెట్‌ సూచీలు 10 శాతం పతనమైతే డెట్‌ నుంచి పెట్టుబడులను ఈక్విటీల్లోకి తీసుకురావాలి. స్టాక్‌ మార్కెట్‌ పెరిగినప్పుడు ఈక్విటీ నిష్పత్తి అధికంగా ఉంటుంది కాబట్టి, పెట్టుబడుల్లో 80శాతానికి పరిమితం చేసేలా చర్యలు తీసుకోవాలి. స్వల్పకాలానికి ఈక్విటీ మార్కెట్ల పనితీరును అంచనా వేయడం చాలా కష్టమైన పని. ప్రతి పెట్టుబడినీ మీ లక్ష్యానికి అనుసంధానం చేయాలి. పూర్తిగా ప్రణాళికను రూపొందించుకున్న తర్వాతే.. దాన్ని అమలు చేయాలి. మార్కెట్లో మదుపు చేసేటప్పుడు భయం, అత్యాశ, ఆందోళనలాంటి భావోద్వేగాలను అదుపులో పెట్టుకొని, స్థిరంగా నిర్ణయాలు తీసుకోవాలి.

- అరుణ్‌ కుమార్‌, హెడ్‌ ఆఫ్‌ రీసెర్చ్‌, ఫండ్స్‌ఇండియా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.