ETV Bharat / business

ఎల్​ఐసీ షేర్ హాల్డర్స్​కు గుడ్​ న్యూస్.. భారీ డివిడెండ్లకు అవకాశం!

author img

By

Published : Oct 28, 2022, 10:49 PM IST

Lic-plans-to-transfer-nearly-22-billion-dollors
షేర్‌ విలువ పెంచేందుకు LIC ప్లాన్‌

స్టాక్​ మార్కెట్​లో ఎల్​ఐసీ షేర్​ పట్ల మదుపరుల్లో నమ్మకాన్ని కలిగించడం, తన మార్కెట్​ విలువను పెంచుకోవడానికి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పాలసీ హోల్డర్లకు చెందిన సుమారు రూ.1.81 లక్షల కోట్ల ఫండ్‌ను డివిడెండ్‌ లేదా బోనస్‌ షేర్‌ ఇచ్చేందుకు నిర్ణయించిన ఫండ్‌లోకి బదిలీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ స్టాక్‌ మార్కెట్‌లో షేరు విలువను పెంచేందుకు చర్యలు ప్రారంభించింది. ఐపీఓకు వచ్చిన నాటి నుంచి షేరు విలువ దాదాపు 35 శాతం మేర కోల్పోయింది. రూ.949 వద్ద మార్కెట్‌లో లిస్ట్‌ అవ్వగా.. ప్రస్తుతం రూ.600లోపే ట్రేడవుతోంది. దీంతో ఎల్‌ఐసీ షేరుపై మదుపరుల్లో విశ్వాసం సన్నగిల్లుతోంది. ఈ నేపథ్యంలో అటు మదుపరుల్లో నమ్మకాన్ని కలిగించడంతో పాటు తన మార్కెట్‌ విలువను పెంచుకునేందుకు ఎల్‌ఐసీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పాలసీ హోల్డర్లకు చెందిన సుమారు రూ.1.81 లక్షల కోట్ల ఫండ్‌ను డివిడెండ్‌ లేదా బోనస్‌ షేర్‌ ఇచ్చేందుకు నిర్ణయించిన ఫండ్‌లోకి బదిలీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఇద్దరు అధికారులు పేర్కొన్నట్లు రాయిటర్స్‌ వార్తా సంస్థ తెలిపింది. నాన్‌ పార్టిసిపేటింగ్‌ ఫండ్‌లో ఉన్న మిగులు మొత్తాన్ని ఇందుకోసం వినియోగించనున్నారని తెలిసింది.

ఎల్‌ఐసీ రెండు రకాల పాలసీలను విక్రయిస్తుంటుంది. ఇందులో ఒకటి పార్టిసిపేటింగ్‌ పాలసీలు. ఈ పాలసీలు తీసుకున్న షేర్‌ హోల్డర్లకు లాభాల్లో వాటా అందిస్తారు. రెండోది నాన్‌ పార్టిసిపేటింగ్‌ పాలసీలు. వీటినే నాన్‌-పార్‌ పాలసీలగానూ వ్యవహరిస్తారు. ఈ పాలసీల్లో ఫిక్స్‌డ్‌ రిటర్న్స్‌ ఉంటాయి. వీటి ప్రీమియంలు వసూలు చేసి నాన్‌-పార్టిసిపేటింగ్‌ ఫండ్‌లో ఎల్‌ఐసీ ఉంచుతోంది. అందులో కొంత మొత్తాన్ని షేర్‌ హోల్డర్ల ఫండ్‌కు బదిలీ చేయడం ద్వారా మదుపరుల్లో నమ్మకాన్ని పెంచేందుకు వీలుపడుతుందని ఎల్‌ఐసీ భావిస్తోంది. దీనివల్ల భవిష్యత్‌లో అధిక డివిడెండ్లు చెల్లించేందుకూ అవకాశం ఉంటుందని సదరు అధికారులు తెలిపారు. అయితే, నాన్‌పార్టిసిపేటింగ్‌ ఫండ్‌లో ఉన్న మిగులు మొత్తాన్ని షేర్‌ హోల్డర్ల ఫండ్‌కు బదిలీ చేసేందుకు ఎల్‌ఐసీ బోర్డు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఇంకా ఆమోదం కోరలేదని తెలిసింది. దీనిపై అటు ఎల్‌ఐసీ గానీ, ఆర్థిక మంత్రిత్వ శాఖ గానీ స్పందించలేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.